Thursday, May 29, 2025



జనారణ్యంలో పుట్టి పెరిగిన నాకు అడవి అంటే అంతుచిక్కని భయం. ముందే నేను అనంతపురం జిల్లా వాడిని. ఒక్క పెన్నహోబిలం  చిట్టడువులు తప్ప చిన్నతనం లో ఇంకే అడవినీ  చూడలేదు. తరువాత యుక్త వయసులో తిరుపతికి మకాం మార్చడం వల్ల శేషాచలం అడవులతో అనుబంధం పెరిగింది. ఆ అనుబంధం కూడా నడక దారికి ఇరువైపులా ఉన్న అడవితోనే. అంతకు మించి శేషాచలం కొండల మీద అడవిలోకి సాహసించి వెళ్లలేక పోయాను. శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం లో జంతుశాస్త్ర ఆచార్యుడి గా పనిచేస్తున్న రాజశేఖర్ మాత్రం ఉద్యోగం రాక ముందే బంగారు బల్లి మీద ప్రయోగాలు చేస్తూ శేషాచలం అడవుల్లో ప్రొఫెసర్ నందగోపాల్ గారితో పాటు తెగ తిరిగాడు. అప్పుడు అంతో, ఇంతో విన్నాను అడవి గురించి. ఈ మిత్రుడితోనే నేను అదే బంగారు బల్లి కోసం అహోబిలం అడవుల్లో కాళ్ల నొప్పి పుట్టే వరకు తిరిగాను. బంగారు బల్లి కనపడక పోయినా కూడా నాకు మాత్రం అడవి మీద అనురక్తి పెరిగింది. అడవి ఒళ్లంతా మా నరసింహ స్వామి సాక్షిగా తడమాలి అనిపించింది. నా భక్తి యాత్రలో భాగంగా శ్రీశైలం వెళ్లినప్పుడు, నల్లమల అడవుల్లో రాత్రి ప్రయాణం వెన్నులో చలి పుట్టించింది. మేము కారులో వెళుతుంటే, రోడ్డు నిదానంగా దాటుతూ ఒక పాము  కనపడింది.  జీవితంలో భయం అనేది ఒక విచిత్రమైన అనుభవం. భయపడినప్పుడే మనకు జీవితం తీవ్రత తెలుస్తుంది అంటాడు ఆచార్య రజనీష్. 

ఇలా అడవి మీద మమకారం పెంచుకున్న నేను కొన్ని బలీయమైన కారణాల వలన అడవిలో కొన్ని రోజులు గడపడం లాంటి సాహస కృత్యాలు చేయలేక పోయాను. నా భయాల వల్ల నాకు ఇప్పటికీ అడవి అంతుచిక్కని ఒక రహస్యంగానే మిగిలిపోయింది. ఇలా నా అటవీ సందర్శన కాంక్ష పెరుగుతూ ఉన్న ప్రస్తుత తరుణంలో , నన్ను ఛాయా బుక్. కామ్ లో ఉన్న  "లంకమల దారుల్లో" అనే travelog వివరాలు ఆకర్షించాయి. పోస్ట్ లో ఆ పుస్తకం వచ్చినప్పుడు , అడవి మొత్తం నా ఇంటికి నడిచి వచ్చిన సంబరం అయ్యింది.  నాకు మొదటే ట్రావెలాగ్ పుస్తకాలంటే తగని మక్కువ. అసలు ఈ లంకమల దారుల్లో పుస్తకం చదువుతుంటే నాకైతే  "counter clockwise studies" చేస్తున్నట్టుగా అనిపించింది.  పుస్తకం పేజీలు తిప్పుతుంటే నేను నా గతంలోకి జారుకున్నాను. నా ఉద్యోగ ప్రస్థానం కడప జిల్లా రైల్వే కోడూరు వద్ద ఉన్న చిన్న ఓరంపాడు లో మొదలయ్యింది. అక్కడ కొత్తగా ప్రభుత్వ జూనియర్ కాలేజీ పెట్టారు. అక్కడ నాకు 2002లో పోస్టింగ్ ఇవ్వడం తో కడప జిల్లాతో నా అనుబంధం మొదలయ్యింది. ఓబులవారి పల్లె రైల్వే స్టేషన్ లో inter city రైలు దిగి, చేతిలో కారియర్ బ్యాగ్ తో చిన్న ఓరంపాడు కు నేనూ, నా సీనియర్ మిత్రుడు గంగాధర్ రెడ్డి మూడు కిలోమీటర్ల మేర ప్రతి రోజు నడిచి చేరుకునేవాళ్లం. అంతే గాక ప్రతి వేసంగి సెలవుల్లో స్పాట్ వాల్యుయేషన్ కోసం కడప జిల్లా కేంద్రం లో మకాం వేసేవాడిని. విష్ణు ప్రియా లాడ్జీ లో దిగే వాడిని. ఇలా నా ఉద్యోగ ప్రస్థానం కడప లో జరుగుతున్న సమయం లో రచయిత వివేక్ పుస్తకం లో ప్రస్తావించిన ప్రదేశాలు చూడడం తటస్థించింది. లంకమల ఆడవులంతా వివేక్ ఆత్మ పరుచుకున్నట్టే అనిపించింది పుస్తకం చదువుతుంటే. నేను ఈ అడవుల గుండానే కొన్ని నెలల  క్రింద సిద్దవటం నుంచి బద్వేల్ దగ్గర ఉన్న లక్ష్మీ పాళ్యెం అగ్రహారానికి వెళ్లాను. ఈ పుస్తకం అప్పుడే చదివి ఉంటే, డిపార్ట్మెంట్ వారి సహకారంతో కొద్దిగా అడవి లోపలికి వెళ్ళేవాడినేమో!!!!

అడవి సౌందర్యం అంతా దాని స్వేచ్ఛ లోనే ఉంది. ఈ పుస్తకం చదవక ముందు నాకు అసలు అడవులు ఎందుకు తగలడతాయో తెలిసింది కాదు. అడవి తనను తాను కాల్చుకోవడం ద్వారానే పునరుజ్జీవనం పొందుతుందని, కొన్ని విత్తనాలు కాలితే తప్ప మొలకెత్తవనే ప్రకృతి రహస్యం నాకు అవగతమయ్యింది. ప్రతి అడవి మాఘం, పాల్గుణం లో కాలి బూడిదయ్యేది తిరిగి చిగురించడానికే. వైశాఖానికంతా అడవి తనను తాను ఎలా సిద్దం చేసుకొంటుందో చక్కగా వర్ణించారు ఈ పుస్తకంలో. అడవిలో నడవడం వలన సహజమైన పద్దతిలో nature healing జరుగుతుంది. అడవి స్థల కాల పరిస్థితులకీ అతీతంగా ఎలా నిలబడగలిగిందో  నాకు అర్థమయ్యింది.  గోజీతలు, కొండ పిచ్చుకలు, అడవి కోళ్లు , బెల్లగాయిల గురించిన వర్ణన చదివేటప్పుడు అడవిని మొత్తం కాన్వాస్ మీద చిత్రీకరించినట్టనిపించింది. యానాదులంటే, అనాది కాలంగా ప్రకృతిలో కలసి మమేకమై జీవించేవారని ఎంత చక్కగా తెలియజేశారో ఈ పుస్తకం లో. మధ్యవర్తుల ఉచ్చులో పడి మోసపోతున్న వలస కూలీల గురించి తెలుసుకున్నప్పుడు బాధేసింది. పుస్తకం లో ఒక చోట 'ఉతిత్తీరు .. ఉతిత్తీరు ' అని అరిచే ఉత్తిసిత్తు గాడు తారసపడ్డాడు. పక్షులు రకరకాల ధ్వనులు ఎలా చేస్తాయో ఒక జువాలజీ మాస్టారు గా నాకు తెలిసి ఉండడం వలన ఇలాంటి వర్ణనలను నేను బాగా ఎంజాయ్ చేసాను. రచయిత కేవలం అడవి ప్రయాణాన్ని అక్షరీకరించడంతో ఆగలేదు. ఆయన ప్రయాణంలో తారసిల్లిన యానాదుల జీవన విధానాలను సేకరించి, వాటిని ఆర్డీవో వెంకట రమణ గారి దృష్టికి తీసుకువెళ్లారు. వారికి ఆధార్ కార్డులు మంజూరు అయ్యేలా చేసారు. ఆ విధంగా ఈ రచన ఒక సామాజిక ప్రయోజనాన్ని సాధించింది. 

మిట్టమానుపల్లె వద్ద బ్రిటీష్ సైనికుడిని చంపిన మల్లుగాడి గురించి చదివినప్పుడు, ఇలాంటి అజ్ఞాత స్వాతంత్ర సమర యోధులు ఎందరు ఉన్నారో కదా అనిపించింది. మిన్నాగు విషం నాకి మల్లుడు బలవంతుడైన తీరు ఆసక్తి కరంగా ఉంది. దివిటీ పట్టుకుని తిరిగే ఈ మల్లన్నను, నిశీధి సమయం లో సానితో రతి చేస్తుండగా బంధించి, సూరు బొక్కల్లో నుంచి ఈటెల తో పొడిపించి చంపించిన బ్రిటీష్ వాడి జిత్తులమారితనం గురించి చదివినప్పుడు నా మనసు మిన్నాగు విషం పడిన తొణకల బావి నీటిలా తొణికింది, వణికింది. తెల్లదొర మనసు మిన్నాగు కంటే విషపూరితం కదా!!!!! దివిటీ మల్లిగాడి "ఉన్నోళ్లను కొట్టు, లేనోళ్లకు పెట్టు" అనే నినాదం ఇంకా ఆ లంకమల లో మారుమోగుతున్నట్టే ఉంది. లంకమలలో  ఒకప్పుడు ఏనుగులు తిరిగి ఉండొచ్చు అనే విషయం నాకు చాలా ఆసక్తిని కలిగించింది. 

కార్తె మారే ముందు, మారిన తరువాత లేచే పుట్టగొడగులను ఇబ్బడి, ముబ్బడిగా పండించడం ఎలానో ఈ తరాలు నేర్చుకుంటే, ఆకలి సమస్యలు కొందరికైనా తీరొచ్చు. మన బతుకుల్లోని చాలా సమస్యలకు అడవి పరిష్కారం చూపిస్తుందనేది నిజం. కానీ మనం అడవి నుంచి దూరంగా జరిగిపోయాము. నది నుంచీ దూరంగా వచ్చేసాము. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా కడప జిల్లా ప్రవాసినై ఉన్నప్పుడు సగిలేరు సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలకు practical examiner గా వెళ్లాను. అప్పుడే కాశిరెడ్డి నాయన జీవ సమాధి అయిన జ్యోతి ని చూసాను. ఎప్పుడో 2004 మాట ఇది.  అహోబిలంకు అక్కడ నుంచి నడక దారి ఉందని అప్పుడే  విన్నాను. మునుపు నే రాసిన సమీక్షలు చదివిన వారికి నేనో భక్తుడను అనే విషయం అర్థమై ఉంటుంది. జ్యోతి క్షేత్రాన్ని 2004 లో   దర్శించినప్పుడు నేనో చిన్న బత్తాయిని, ఇప్పుడు పెద్ద బత్తాయిని అంతే తేడా. అప్పట్లో ఏ రోజో ఒక రోజు జ్యోతి నుంచి అహోబిలం వరకు నడిచి పోక పోతానా అని అనుకున్నాను. కానీ ఇప్పటికీ అది సాధ్యం కాలేదు. నడక ప్రయాణం చేయాలంటే బద్దకం ఉండకూడదు. ప్రయాణానికి కావలసింది ప్రణాళిక. నాకు లోపించింది అదే. అందునా అడవులంటే పులి ఉంటుందేమో అన్న గిలి. నాకున్న భయం నాలోని భక్తిని చంపేసింది. ఈ లంక మల దారుల్లో పులి రెండు కాళ్ల మనిషిని ఎందుకు వేటాడదో చక్కగా వివరించారు. మా జువాలజీ లో ప్రతి వేటాడే జంతువుకి తను భక్షించే జీవికి సంబంధించిన  ఒక image ఉంటుందని చెపుతారు. దానినే prey image అంటారు. అందుకే పులి రెండు కాళ్ల మనిషిని వేరే విధి లేకుంటే తప్ప వేటాడదు. ఈ పులి గిలి వల్లనే నేను జ్యోతి నుంచి అహోబిలం వరకు నడక చేపట్టలేక పోయాను. ఏదో 'మారం రాజశేఖర్' పుణ్యమా అని అహోబిలం అడవుల్లో కొద్దిగా తిరిగాను అంతే. 

నాకు అడవంటే భయం పెరగడానికి మరో కారణం మిత్రులతో కలిసి రైల్వే కోడూరు దగ్గర ఉన్న గుండాల కోన కు వెళ్లినప్పుడు జరిగిన సంఘటన. గుండాల కోన లోపలికి వెళ్లాము జీపుల్లో. మాకు గైడ్ గా ఆ కాలేజీ లో చదువుతున్న ఒక స్టూడెంట్ వ్యవహరించాడు. వాడు ముందుండి నడిపిస్తే, మేము వాడి వెనక నడిచాము. గుండాల కోన గాంభీర్యాన్ని చూస్తే నాకు గుండెల్లో వణుకు మొదలయ్యింది. ఏ వైపు చూసినా కూడా కోట గోడల్లా ఆకాశాన్ని చుంబిస్తున్న తూర్పు కనుమలు. మా జీపు ముందుగా ఉన్నట్టుండి ఒక నక్కల గుంపు వచ్చింది. కొన్ని నక్కలు  నా నక్క జిత్తులను పసిగట్టినట్టుగా నన్ను వింతగా చూసాయి. నేను నా నక్క వినయాలతో వాటిని పక్కదావ పట్టించాను. మా మిత్రులలో ఒకడు మన అదృష్టం పెంచుకోవడానికి జీపు దిగి వాటి తోకలు తొక్కుదాం అని కూడా ప్రతిపాదించాడు. పంచతంత్రంలో కరటక, దమనకులనే నక్కల గురించి వినడమే గానీ, వాటిని ఇంత దగ్గరగా చూడడం ఇదే మొదటిసారి. అక్కడ నుంచి కోన వద్దకు మమ్మల్ని మా స్టూడెంట్ గైడ్ పిలుచుకువెళ్లాడు. మా మిత్రులంతా ఆ నీళ్ల గుంటలో ఈతలు కొడుతుంటే, నేను మాత్రం బిక్కు, బిక్కు మంటూ ఒక గుండు మీద కూచున్నాను. అక్కడ ఒక బిలం ఉండడం గమనించాను. సాధారణంగా అడవుల్లో నీటి కుంట దగ్గరికి దాహం తీర్చుకోవడానికి క్రూర మృగాలు వస్తాయనే విషయం నా బుర్రకు తట్టి ఇంకా భయం వేసింది. అందరి ఈత ఉత్సాహం నీరు గారిన తరువాత, మాతో తీసుకుపోయిన ఏవో తినుబండారాలు తిన్నాము. వెనక్కు వచ్చేటప్పుడు మా స్టూడెంట్ గైడ్ కు స్మృతి భంగమై , 'అయ్యోర్లు !!!! తోవ మరిచితిని' అని అనడంతో మా అందరి పరిస్థితి తినింది అరగక హిమాలయాలకు వెళ్లి, అక్కడ చిక్కుకున్న ప్రవరాఖ్యుడి లాగా అయిపోయింది. నాకే ఎందుకో అనుమానం పెను భూతమై వేధించి, ఆ సగటు విద్యార్థిని పక్కకు పిలుచుకు వెళ్లి " రేయ్ !!! నాయనా!!! నీకు పుణ్యం ఉంటుంది. నిజం చెప్పు నీకు మాలో ఎవరి మీద కోపం ఉంది?????" అని అడిగాను. వాడో గడుసు పిండంలా ఉన్నాడు. "భలే కనుక్కున్నారు సర్!!!! మా ఇంగ్షీషు సర్ అంటే నాకు కసి. నన్ను మా క్లాస్ అమ్మాయిల ముందు ఇంగ్షీషులో తిట్టాడు సర్!!! అందుకే ఈ దోవ మరచినట్టు నటిస్తున్నాను" అన్నాడు. "ఒరేయ్ !!! ఆ ఇంగ్షీషు సర్ తరపున నేను క్షమాపణ చెపుతాను రా!!!! నీవు కనికరించకుంటే నేను ఏ నక్క తోక పట్టుకునో  ఈ అడవి దాటాలి రా!!!" అని మొరపెట్టుకున్నాను. తరువాత ఆ శిష్య రత్నం మమ్మల్ని ఎలాగోలా అడవి బయటకు తీసుకువచ్చి విసిరేశాడు లెండి. అప్పట్నుంచి నాకు అడవి అంటే ఒకటే భయం.  

స్థానికులు వంట చెరుకు కోసం అడవులను నరకకుండా ఉండటానికి సీమ తుమ్మ చెట్లను అప్పట్లో నాటించారని పుస్తకం చదివిన తరువాతనే తెలిసింది. వీటి విత్తనాలను అప్పట్లో హెలికాఫ్టర్స్ లో చల్లించారనే ముచ్చట బాగుంది. కానీ అప్పట్లో అడవి రక్షణ కోసం నాటిన సీమ తుమ్మ చెట్లే ఇప్పుడు స్థానిక వృక్ష జాతులను కబళిస్తున్నాయి. కంచే చేను మేయడం అంటే ఇదేనేమో. 

కలివి కోడి అస్థిత్వాన్ని ప్రపంచానికి చాటిన ఐతన్న, ఆ కలివి కోడిని చూడడం కోసం పక్షి శాస్త్రజ్ఞుడైన భరత్ భూషణ్ లంకమలకు రావడం, బాంబే నుంచి సలీం అలీ గారు ఉరుకుల పరుగుల మీద రావడం, కానీ సలీం అలీ గారు వచ్చే లోపే ఆ పక్షి ప్రాణాలు గాలిలో కలసిపోవడం లాంటి సంఘటనలు రచయిత హృద్యంగా డాక్యుమెంట్ చేసారు. మనిషి తాకిన గూడు దగ్గరికి బెల్లగాయిలు మళ్లీ రావు అనే భయం పెట్టడం మంచిదే. ఆ మాత్రం పాప భీతి మనిషిలో లేకుంటే ఈ పాటికి బెల్లగాయి అంతరించిన జాతులలో చేరిపోయేది. 

సంబెట నరసింహ రాజు తవ్వించిన రాజుల చెరువు ఉదంతం, పగలు చీకటి కోన లో దివిటీ మల్లన్న బంగారం దాచిన వైనం చదువుతుంటే తెగ థ్రిల్లింగ్గా అనిపించింది. మనల్ని మనం కొత్తగా పరిచయం చేసుకోవడానికైనా అప్పుడప్పుడు ప్రయాణాలు చేస్తుండాలి అని రచయిత చెప్పిన మాట అక్షరాలా నిజం. 

2004 లో నేను కడప జిల్లాలో ఉన్నప్పుడు కడప జిల్లా లోని చాలా ప్రదేశాలు చుట్టబెట్టేసాను. హత్తిరాల లోని పరుశురామ క్షేత్రం మొదలుకొని, నందలూరు, ఒంటిమిట్ట, దేవుడి కడప, పుష్పగిరి, బ్రహ్మంగారి మఠం, జ్యోతి లాంటి ప్రదేశాలు అన్నిటినీ ఎర్ర బస్సుల్లో అప్పట్లో తిరిగేసాను కానీ అప్పట్లో ఎప్పుడూ కూడా సిద్దవటం కానీ, లంకమల గానీ, ఇంకా గండికోట గానీ పోలేకపోయాను. కారణం తెలియదు. నింగి ఋణం, నేల ఋణం అన్నట్టుగానే ఏదైనా ప్రాంతానికి వెళ్లాలి అంటే నీటి ఋణం ఉండాలేమో!!!! కానీ ఇటీవల యోగి వేమన విశ్వవిద్యాలయం లో part time PhD జువాలజీ లో చేరిన తరువాత అనంతపురం నుంచీ కడపకు నెలకో సారన్నా తిరుగుతున్నాను. అలా నేను ఇటీవలనే అల్లాడపల్లి, సంగమేశ్వరం చూసాను. ఇక్కడ చెప్పొచ్చేదేమంటే పుస్తకం లో ప్రస్తావించిన గండికోటను చూసినప్పటికీ, దాని చారిత్రక నేపథ్యాన్ని పట్టుకోలేక పోయాను. గ్రేట్ కాన్యాన్ సౌందర్యం ఎంతో నచ్చింది నాకు. ఈ గండికోటను మీర్ జుమ్లా కుతంత్రంతో ఆక్రమించిన తీరు పుస్తకం లో చక్కగా వివరించారు. 

లంకమల అరణ్యం మాత్రం కొద్ది కాలం క్రిందటే బద్వేలు వద్ద ఉన్న లక్ష్మీ పాళ్యెం అగ్రహారం లోని వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లినప్పుడు చూసాను. కానీ కొండ పొలం సినిమాలో చెప్పినట్టు అడవిని చూస్తే సరిపోదు, గమనించాలి. ఆటవిక న్యాయాన్ని తక్కువగా అంచనా వేస్తాము కానీ, ఈ jungle law వల్లనే అడవి అనేక ఆహారపు గొలుసులకు ఆశ్రయమిస్తోంది. సిద్దవటం మట్లీ రాజుల కోటను కూడా నేను, కడప SKR & SKR Govt College for women కాలేజీ Principal అయిన నా మిత్రుడు సలీం తో కలిసి చూసాను. 

సామాజిక వేదికల గురించి నాకున్న అభిప్రాయం కూడా ఈ పుస్తకం చదవడం వలన మారిపోయింది. 'జలధారలు', 'Into The Nature' లాంటి గ్రూపుల గురించి చదివినప్పుడు, అలాంటి గ్రూపులలో విద్యార్థులు సభ్యులుగా చేరితే ఎంత బాగుంటుందో కదా అనిపించింది.  అడవి ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అక్కడక్కడ చక్కగా వివరించారు. అడవి యాత్రికులకు పులి, ఎలుగ్గొడ్ల కంటే పరిక ప్రమాదకరం అని తెలసుకున్నాను. ఈత కాయలంటే ఎలుగుబంట్లకు ఇష్టం అని మొదటిసారి తెలుసుకున్నాను. జంతుశాస్త్ర అధ్యాపకుడిగా నేను పాఠాలు చెపుతున్నప్పటికీ నాదంతా పుస్తక పరిజ్ఞానమే. ఈ పుస్తకం చదివితే ఎవరికైనా తమిళ స్మగ్లర్ల పట్ల సానుభూతి కలుగుతుంది. ఈ పుస్తకం చదువుతుండగానే, త్వరలో M V రమణా రెడ్డి గారి ఆత్మకథ 'గతించిన రోజులు' చదవాలని సంకల్పించుకున్నాను. ఈ లంకమల దారుల్లో ట్రావెలాగ్ చదువుతూనే రాత్రి పూట కొండ పొలం సినిమా చూసేసాను. ఆదిమానవుల ఆవాసాల 'బిలం ప్రయాణం' ఉదంతం ఆసక్తికరంగా ఉంది. చెయ్యేరు వరద భీభత్సం వివరించేటప్పుడు రచయిత ఈత నేర్చుకోవడం ఒక ప్రాథమిక అవసరం అని ఎంత చక్కగా చెప్పారో!!!!! అలాంటి ఈత నేను ఇప్పటికీ నేర్చుకోలేక పోయాను. బెంగళూరుకు వెళ్లినప్పుడు బేబీ స్విమ్మింగ్ పూల్ లో నేను వచ్చీ రాని మునకలు వేస్తుంటే, నన్ను చూసిన కన్నడ పిల్లలు నన్ను mentally retarded fellow గా భావించి గుస...... గుస పోవడం నాకింకా గుర్తు. ఎద్దుల కోసం ప్రాణాలు వదిలేయడానికి సిద్దమైన వారి గురించి చదివినప్పుడు హృదయం ఆర్ద్రం అయ్యింది. విధ్వంసం, ఉపశమనం రెండూ ప్రకృతిలో భాగాలే అని తెలుసుకోవడానికి ఎంతో పరిపక్వత కావాలి. సిద్దవటం మట్లీ రాజుల కొలువులో ఉన్నారని చెప్పిన అష్ట దిగ్గజ కవుల్లో కవి చౌడప్ప పేరు మాత్రమే నేను విన్నాను. చెయ్యేరు వరదకు ఎదురొడ్డి నిలిచిన పులపత్తూరు గురించి చదువుతుంటే, నేను ఎంత భద్రమైన ప్రదేశంలో ఉన్నానో కదా అనిపించింది. పిల్లంకట్ల కళా రూపం గురించిన వివరణ ఆసక్తికరంగా ఉంది. పాలేగాళ్లకు తిరగబడ్డ వొన్నూరమ్మ ధైర్యానికి ఆశ్చర్యపోయాను. పరిస్థితులకు తిరగబడడం అంత సులువు కాదు. నల్లమల లోని మల్లేలమ్మకు ఎద్దుల నీటి కోసం 'తల పండు' సమర్పించున్న భైరవ కొండన్న గురించి చదువుతుంటే వెన్నులో చలి పుట్టింది. ఆ మొండి భైరవకోనను ఏ రోజో ఒక రోజు చూడాలి. 

ఈ పుస్తకం చదివిన తరువాత నాకు అర్థమయ్యిందేమంటే, ఎంత చదివామన్నది ముఖ్యం కాదు, ప్రత్యక్షంగా ఎంత చూసామన్నదే ముఖ్యం అని. ప్రత్యక్షానుభవం మనం చరిత్రను అర్థం చేసుకునే తీరును మారుస్తుంది. ముఖ్యంగా చరిత్ర విద్యార్థులు చదవడం తో ఆగకూడదు. చారిత్రక ఆనవాళ్ళున్న ప్రదేశాలను దర్శించాలి. రకరకాల ఆధారాలను సేకరించే ప్రయత్నం చేయాలి. అప్పుడే వాస్తవాన్ని, కల్పనను విడదీసే నేర్పు వస్తుంది. ఆది మానవుడికి అడవులతో ఉన్న అనుబంధం ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది. ఆకలి, నిద్ర, మైధునం మాత్రమే తెలిసిన ఆది మానవుడు అభద్రతా భావంతో చాలా తీరిక లేని రోజులు గడిపాడు. కొద్దిగా భద్రతా, తీరుబాటు జీవితంలో చొరబడగానే, emotional గా ప్రకృతితో connect అయిపోయాడు. ఇదంతా గమనింపు వల్ల వచ్చింది. ఆదిమానవుడు ద్రవ్య ప్రధాన సమాజం వైపు ఎలా ప్రయాణించాడనే విషయాన్ని చక్కగా తెలియజేసారు. అసలు ఏ అవసరం ఆది మానవుడిని అడవి నుంచి మైదానం వైపు తరిమింది? అడవి లోని ఆహారపు గొలుసుల్లో భాగంగా ఉండకుండా, మానవుడు ఆహారోత్పత్తి వైపు దృష్టి ఎందుకు సారించాడు? అడవిలో ఏం తక్కువైందని తల్లి ఒడి లాంటి అడవిని వదిలాడు? ఈ ఆది మానవుడి మస్తిష్కం లోకి ఆశ ఎప్పుడు ప్రవేశించింది? పుస్తకం చదువుతుంటే, ఇలాంటి ప్రశ్నలతో నా మనసు లోతెంతో తెలియని 'మంచాల గుండం' లా తయారయ్యింది. అడవిలో ఆది మానవుడు నిత్య ఘర్షణ పడలేక, భద్రత కోసం మైదానం వైపు వచ్చి ఉండవచ్చు. భద్రత వల్ల ఒక చోట చేరిన మనుషులు కుటుంబాలుగా, గ్రామాలుగా, రాజ్యాలుగా పరివర్తన చెంది ఉండవచ్చు అంటారు ఒక చోట రచయిత. అడవిని వదిలిన మానవుడు పంచుకోవడం మానేసి, పోగేసుకోవడం మొదలెట్టాడు. తన వాళ్లను కాపాడుకోవడం కోసం రాజ్యాలు ఏర్పరుచుకున్నాడు. అడవిలో ఉండి ఉంటే సంఘర్షణ మాత్రమే ఉండేది. రాచరికాలు మొదలవడంతో, మానవ మస్తిష్కంలో యుద్ధోన్మాదానికి బీజం పడింది. నిజానికి మనమందరం యుద్ధోన్మాదులుగా మారిపోయాము. ఎవరితో ఒకరితో, ఏదో ఒక రకంగా యుద్దాలు చేస్తూనే ఉన్నాము. 

తీరిగ్గా కూచుని తేరగా వచ్చింది మెక్కుదామనుకునే వారికే ధన రాశుల పుకార్లు రుచిస్తాయి. బుస్సా నాయుడి కోటలో ధన రాశులు, బంగారం ఉన్నాయనే పుకార్లు షికార్లు చేయడానికి కారణం మానవుడికి ధనం మీద ఉన్న యావే. చివరకు బుస్సా నాయుడు కూడా ఉంపుడుకత్తె కుతంత్రం వల్ల చస్తాడు. ఎవడి చావు వాడే తెచ్చుకుంటాడు. చాలా మందికి మరణం కాంతా, కనకాల వల్లనే వస్తుంది.  ఈ పుస్తకంలో పేర్కొన్న తురుకల సరి, ముండమోపుల రేవుల ఉదంతాలు తమాషాగా ఉన్నాయి. అనాది కాలంగా కాపాలిక శైవానికి ఆలవాలమైన లంకమల ఇలాంటి రహస్యాలను ఎన్నో దాచుకుందని నాకు అర్థమయ్యింది. సాకిరేవులో భల్లు గుడ్డు ( కబాడీ ) ఆడుతున్న సుగాలోళ్లను గంగమ్మ శపించడం స్త్రీల విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేస్తుంది. తురకల సరి వద్ద ఉన్న ఏనుగు బొమ్మ ఉన్న 'సుబ్బమ్మ రాతి బీరువా' గురించి చదివిన తరువాత, నా జీవితంలో ఎప్పుడో ఒకసారి దీనిని చూడాలని సంకల్పం చేసుకున్నాను. మా ఇంట్లో బీరువా చూడడానికే నాకు అటు తీరికా, ఇటు ఓపికా లేదు. ఇక ఈ సుబ్బమ్మ బీరువా ఏం చూచ్చానబ్బా!!!! తురకల సరి వద్ద చాకలి విసుగు తంత్రం ప్రస్తావన భలే గమ్మత్తుగా ఉంది. 

మొదటిసారి అడవికి వచ్చిన వాళ్లు ఒక్కో రాయి విసరడం వల్ల ఏర్పడిన మల్లాలమ్మ గుట్ట గురించి చదివినప్పుడనిపించింది చతుర్లాడడం కూడా ఒక్కోసారి మంచిదేనని. రాణీ బండ గురించి చదివినప్పుడు, ట్రెక్కింగ్ కు అవకాశమున్న ఇలాంటి స్థానిక ప్రదేశాలను ప్రభుత్వం పూనుకుని అభివృద్ధి చేస్తే బాగుంటుందనే వివేక్ గారి సలహా ఎంతో విలువైనది కదా అనిపించింది.  లంకమల యాత్ర తో ఆగకుండా, అడవంతా ఆరువేల seed balls చల్లడం నిజంగా ప్రశంసనీయం. ఈ విషయాన్ని మా కాలేజీ NSS Program officers దృష్టికి తీసుకువెళతాను. రచయిత చెప్పినట్టుగా అతి జాగ్రత్త, అతి గారాబం వలన ఈ తరం పిల్లలు ప్రకృతికి దూరం అవుతున్నారు. ప్రస్తుత తరం ప్రకృతికి దగ్గరగా జరగాలి అంటే వివేక్ గారి లాగా  అడవి బాట పట్టాలి. 

స్థానికంగా ఉన్న అడవులను కాపాడుకోవాలనే సంకల్పం ప్రతి ఒక్కరిలో కలగాలి. పుస్తకం లో ప్రస్తావించినట్టు No plastic Lankamala, Restore Rajulacheruvu లాంటి ఉద్యమాలు బయలుదేరినప్పుడే, ప్రయాణాల యొక్క సామాజిక ఉద్దేశ్యం నెరవేరుతుంది.  ప్రతి ప్రయాణం యొక్క అంతిమ లక్ష్యం సామాజిక శ్రేయస్సే కావాలి. ప్రతి యాత్రా ఏదో ఒక ఆదర్శంతో ముగియాలి. నేను కూడా వ్యక్తిగతంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాను. ఈ పుస్తకం మా విద్యార్థులచే చదివిస్తాను. 

G L N PRASAD
Lecturer in Zoology
Govt Arts College
Anantapur 

Saturday, May 24, 2025


Awareness tips on Hotel Management 








 షరా మామూలే!! నేను మా ANSET మిత్ర బృందం సునీల్ కుమార్ రెడ్డి గారు మరియు చిగిచెర్ల శ్రీనివాసులు సర్ కలిసి బుక్కరాయ సముద్రం లో ప్రైవేట్ B.Ed కళాశాల ఆవరణలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ కౌశల్ గ్రామీణ యోజన ఆధ్వర్యం లో Hotel Management మరియు Beverages ట్రేడ్స్ లో శిక్షణ పొందుతున్న 90 మంది trainees తో కొన్ని అంశాలు ముచ్చటించాము. వారు ఎంచుకున్న శిక్షణా కార్యక్రమం ముఖ్యంగా హోటల్ నిర్వహణ కాబట్టి, వారికి ఈ క్రింది సూచనలు చేశాను. 

  • మీరు హోటల్ స్వంతంగా ప్రారంభించాలి అనుకుంటున్నారా లేక హోటల్ లో పనిచేయాలి అనుకుంటున్నారా నిర్ణయించుకోండి. 
  • మీరు పెట్టబోయే హోటల్ పేరు ఇప్పుడే మనసులో అనుకోండి. 
  • మీరు పెట్టబోయే హోటల్ శాకాహార లేక మాంసాహార హోటలా కూడా నిర్ణయించుకోండి. 
  • అన్నిటికంటే ఏ ప్రాంతంలో మీరు హోటల్ ప్రారంభిస్తే బాగుంటుందో, అక్కడ ఎలాంటి తిండి పదార్థాలకు డిమాండ్ ఉందో, ఆ ప్రాంత జనాల ఆహారపు అలవాట్లు ఎలాంటివో ఒక సర్వే చేసి సిద్దంగా పెట్టుకోండి. 
  • ఐదు నక్షత్రాల హోటల్ కు వచ్చే కస్టమర్ల మనస్తత్వం అధ్యయనం చేయండి. హోటల్ పరిశ్రమ గురించి యండమూరి రచించిన 'ఇడ్లీ, వడ ఆకాశం' అనే పుస్తకం చదవండి. ఇది కామత్ యొక్క biographical sketch. 
  • వంట చేయడం మొదట నేర్చుకోండి. పప్పుకు తగిన ఉప్పు, ఉప్పుకు తగిన నిప్పు ఉండేలా చూసుకోండి. 
  • వంట చేయడం మరియు వడ్డించడం రెండూ కళలే. 
  • ఎవరికైనా సరే కొసరి, కొసరి వడ్డించడం అలవాటు చేసుకొండి. సాదరంగా పెట్టకుంటే ఎవరూ తినరు. ఒకవేళ తిన్నా రుచించదు. 'ప్రియము లేని కూడు పిండంబు కూడురా' అని మన వేమన ఎప్పుడో చెప్పాడు. కాబట్టి ప్రియంగా వడ్డించండి 
  • కంటికి ఇంపుగా ఉంటే, కడుపుకు ఇంపు అని మరవకండి. 
  • శుభ్రంగా ఉండండి. 
  • స్ట్రీట్ foods గురించి, జాతీయ మరియు అంతర్జాతీయ వంటల గురించి తెలుసుకోండి. 
  • వివిధ వంటల గురించి తెలియాలి అంటే మల్లాది రచించిన మిస్రాణి చదవండి. మీకు food lovers గురించి తెలియాలి. Some people travel for food. మిరపకాయ బజ్జీ బాగుంటే, దానిని తినడానికి మైళ్ల కొద్దీ ప్రయాణించేవాళ్ళు నాకు తెలుసు. 
  • మన దేశంలోనే అనేక రకాల వంటకాలు ఉన్నాయి. ఈ తరం వారికి నచ్చే రుచుల గురించి అధ్యయనం చేయండి. పల్లెటూరి రుచుల గురించి తెలుసుకోండి. 
  • మీరు ఆర్థికంగా స్థిరపడడానికి  పెద్ద, పెద్ద హోటళ్లే పెట్టాల్సిన పనిలేదు. చిన్న, చిన్న Eat outs చాలు. 
  • ప్రాంతీయ రుచుల గురించి అవగాహన పెంచుకోండి. 
  • మీకు వంట చేయడం లో ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండాలి. చెన్నై శరవణ భవన్ లో మూడు దశాబ్దాల క్రితం నేను తిన్న ఇడియప్పం రుచి నాకు ఇంకా గుర్తుకు ఉంది. 
  • ఎదుటి వారి జిహ్వా చాపల్యమే మీ బలం. ప్రపంచం లో వినే వారి కన్నా, తినే వారే ఎక్కువ ఉన్నారు కాబట్టి, నాలాంటి టీచర్ల కన్నా మీరే ఎక్కువ సంపాదించగలరనే విషయాన్ని నమ్మండి. 
  • స్నాక్స్ చేయడం నేర్చుకోండి. మీరు చేసే వంటకు రంగు, రుచి, వాసనా అదిరిపోవాలి. 
  • కొన్నిపదార్థాలు వీధుల్లో తింటేనే బాగుంటుంది. ముఖ్యంగా మా రాయలసీమ లో దొరికే గుంత పొంగణాల లాంటివి చేయడం నేర్చుకుంటే, పొయ్యి, పెనాన్ని పెట్టుబడిగా పెట్టి లక్షలు సంపాదించవచ్చు. 
  • మీరు వంటకు వాడే దినుసులు నాణ్యమైనవిగా ఉండాలి. నాణ్యతలో రాజీ వద్దు సుమీ!!!!!
  • మీరు YouTube వంటల vlog ప్రారంభించవచ్చు. నాలాగా బ్లాగ్ పెట్టి, దానిలో మీరు చేసిన వంటల గురించి ఫోటోస్ తో సహా పంచుకోవచ్చు. ఇంస్టా లో వంటల రీల్స్ చేయవచ్చు. 
  • కేక్స్ తయారీ మీద కూడా పట్టు సాధించండి. కాంటీన్ నిర్వహణ గురించి తెలుసుకోండి. అనంతపురం బెంగళూర్ బేకరీ లో నేను చిన్నప్పుడు ప్రతి రోజూ కారం బన్ను తినేవాణ్ణి. ఆ బన్నుకు నేను చిన్నప్పుడే ఫిదా అయిపోయాను. 
  • ఇక మీరు సమోసా చేస్తే ఎలా ఉండాలి అంటే దానిని తినడం కోసం  అమృతం వదిలేసి వచ్చి దేవతలు కూడా కొట్టుకు చావాలి. 
  • తినడం లో ఉన్న మజా మీ హోటల్ కు వచ్చేవారికి తెలియాలి. తినే వారికి రుచి నసాళానికి తగిలి రససిద్ది కలగాలి. మీ వంట తిన్న తరువాత నల భీమ పాకాన్ని మరిచిపోవాలి.
ఇలా సాగింది స్వామీ నా మాటా మంతీ!!!!!! మరోసారి ఇదే బ్లాగ్ లో ముచ్చట్లు పెట్టుకుందాం. 
 

Friday, May 23, 2025

TTDC 23rd May 2025 interaction 










 

భూమి మీద మానవ జన్మ తీసుకున్న తరువాత 'చుట్టంలా వచ్చాను.. చూసెళ్లి పోతాను' అంటే కుదరదు. మంచి సమాజాన్ని భావి తరాలకు అందించడానికి మన వంతు కృషి చేయాలి. జనాలతో మమేకం కావాలి. ముఖ్యంగా యువత తో మన అనుభవాలు పంచుకోవాలి. ANSET మిత్రులు సునీల్ కుమార్ రెడ్డి మరియు చిగిచెర్ల శ్రీనివాసులు వలన నాకు యువతతో interact అయ్యే అవకాశం ఇంచుమించు నెలకు ఏడు సార్లు వస్తోంది. వారి కార్యక్రమం లో భాగంగా ఈ రోజు నేను TTDC లో శిక్షణ పొందుతున్న 60 మంది యువత లో నైపుణ్యాభివృద్ది గురించి అవగాహన కలగజేసాను. నైపుణ్యం ఉంటే డబ్బును ఎక్కడైనా సృష్టించవచ్చు. నైపుణ్యం ఉన్న వాడిని సమాజం గౌరవిస్తుంది. యువతలో నైపుణ్యాలు అభివృద్ధి పరిస్తే, నిరుద్యోగం మటుమాయమవుతుంది. 

ఇక్కడ శిక్షణలో పాల్గొంటున్న యువతీ యువకులు చక్కటి క్రమశిక్షణ తో వ్యవహరించారు. చాలా మంది వారికున్న లక్ష్యాల గురించి మాతో ముచ్చటించారు. వీరిని చూస్తుంటే, నా దేశం భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే భరోసా నాకు కలిగింది. 

రేపు మరో కార్యక్రమానికి సిద్ధం అయిపోయాను మరి. 

Wednesday, May 21, 2025



       దేశ యువత కు, గ్రామీణ యువతకు ITI ల అవసరం 

అనంతపురం ప్రభుత్వ  ITI లో నిర్వహించిన skill hour కార్యక్రమానికి నేను ముఖ్య అతిథిగా వెళ్లడం జరిగింది. ప్రిన్సిపల్ రామ్మూర్తి గారు నన్ను సాదరంగా వేదిక మీదకు ఆహ్వానించారు. నాతో పాటుగా ఆన్సెట్ మేనేజర్ సునీల్ కుమార్ రెడ్డి గారు కూడా వేదిక మీద ఆసీనులైనారు. నేను అనంతపురం లో ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేట్ ITI లలో నిర్వహించిన పలు కార్యక్రమాలలో పాల్గొన్నాను. అనంతపురం లోని ప్రభుత్వ ITI ని తలుచుకుంటే నాకొక నాస్టాల్జిక్ ఫీలింగ్ కలుగుతుంది. నా బాల్యంలో  ఈ ITI మైదానంలో నేను, మా బావ చిన్న సైకిల్ తొక్కడం ఎలాగో నేర్చుకున్నాము. అప్పట్లో ఆ చిన్న సైకిల్ రోజంతా మనం వాడుకున్నా, దాని కిరాయి కేవలం రెండు రూపాయలు ఉండేది. ఇలా నా సైక్లింగ్ నైపుణ్యాలకు పదును పెట్టిన ప్రదేశం ఈ ప్రభుత్వ ITI. దీనికి అప్పట్లో ఒక సైరన్ ఉండేది. ఇది మధ్యాహ్నం ఒంటి గంటకు గట్టిగా ఒక రెండు నిమిషాలకు పైగా మోగేది. అది ఎందుకో ఇప్పుడు మూగపోయింది. ఈ రోజు ఈ ITI లో ఉన్న పిల్లలను చూస్తుంటే, నా దేశంలోని work force అంతా ఇక్కడే ఉన్నట్టు అనిపించింది. శ్రమైక జీవన సౌందర్యం నా ముందు పరుచుకుంది. శ్రీ శ్రీ చెప్పిన సమస్త వృత్తుల చిహ్నాలు నా ముందు కదలాడాయి. తీరిక వర్గాలకు శ్రామిక వర్గాలు చేస్తున్న సేవ గుర్తుకు వచ్చింది. మా డిగ్రీ విద్యార్థులకు, ఈ ITI విద్యార్థులకు మౌలికంగా ఒక తేడా ఉంది. అదేమంటే మేము మా డిగ్రీ కళాశాలలో కేవలం విద్య నేర్పుతాము. జ్ఞానం అందజేస్తాము. కానీ ITI లో ఉన్న అధ్యాపకులు లేదా instructors  వివిధ trades లో ఉన్న విద్యార్థులకు నైపుణ్యం అలవడేలా శిక్షణ ఇస్తారు. మన దేశానికి IIT లు ఎంత ముఖ్యమో ITI లు కూడా అంతే ముఖ్యం. ఈ skill hour లో ఈ క్రింది అంశాలు ITI పిల్లలతో పంచుకున్నాను. 

  • ముందు ముందు సాంప్రదాయ కళాశాలల కన్నా కూడా ITI శిక్షణ పట్ల విద్యార్థులకు ఆసక్తి పెరుగుతుంది. 
  • ITI లో శిక్షణ ఉపాధి కల్పనకు తగ్గ నైపుణ్యాన్ని ఇస్తుంది. 
  • మీరు చదువుకున్న ITI లో మీరు ట్రైనర్ గా రావాలి అంటే మీరు CTI చేయాలి. 
  • మీరు కృత్రిమ మేధ మీద కూడా పట్టు సాధిస్తే, మీకు అవకాశాలు వెల్లువెత్తుతాయి. 
  • మీరు మీ రంగంలో నైపుణ్యంతో పాటు కార్మిక చట్టాల పట్ల కూడా అవగాహన ఏర్పరుచుకోండి. 
  • శ్రమ చేయడానికి సిగ్గు పడకండి. Dignity of labour అలవరుచుకోండి. 
  • భవిష్యత్తు లో నిపుణులైన పని వారు దొరకడం చాలా కష్టం అవుతుంది. మీ నైపుణ్యాలకు మార్కెట్ విలువ పెరుగుతుంది. మీరు సంపదను అవలీలగా సృష్టించగలరు. 
  • సాధారణ పట్టభద్రుల లాగా మీరు ఉద్యోగం కోసం, ఉపాధి కోసం వెంపర్లాడరు. మీరే ఉపాధి కల్పిస్తారు. 
  • దేశంలో ITI ల సంఖ్య మరియు skill hubs సంఖ్య పెరగాలి. 
  • దేశంలో జ్ఞానుల అవసరం కంటే, నిపుణుల అవసరం ఎక్కువ ఉంది. 
  • మంచి పని తీరు ఉన్న వారిని ప్రపంచం వదులుకోదు 
  • పని చేయడం మరియు పనిని పర్యవేక్షించడం ద్వారా మాత్రమే సంపదను సృష్టించగలం.
  • పని చేయని వాడు ఏదో ప్రాపకంతో పైకి వచ్చినా కూడా రోజులు గడిచే కొద్దీ తన ప్రాభవాన్ని కోల్పోతాడు. 
కాబట్టి విద్యార్థులారా!!!! మీ మీ నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకోండి. దేశం కోసం పాటు పడండి. 












Thursday, May 15, 2025

16 May 2025 న National Academy of Construction లోని టైలరింగ్ మరియు ఎలక్ట్రీషియన్ ట్రేడ్ trainees కు నేను ఇచ్చిన వ్యక్తిత్వ వికాస సదస్సు కు సంబంధించిన ఫోటోలు  




























              


జీవన భృతి కోసం జంతుశాస్త్ర అధ్యాపకుడిగా ఉద్యోగం వెలగబెడుతున్నాను కానీ, నాకు సైన్స్ కన్నా చరిత్ర అంటే తగని మక్కువ. ఇప్పుడు నేను సమీక్షించబోయే పుస్తకం లో ప్రస్తావించినట్టు నాకు చరిత్ర జబ్బు చాలా కాలం క్రితమే పట్టుకుంది. దీనికి కారణం నేను సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధం కావడమే. గ్రూప్ - I పరీక్షలకు సన్నద్ధం కావడం వలన కూడా  నాకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర పట్ల ఆసక్తి మితిమీరింది. కానీ నాకున్న వైదికపు పోకడల వలన నేను చూసిన చారిత్రక ప్రదేశాలన్నిటిని దర్శించిన సమయంలో నాకు భక్తి భావన అంబికా దర్బార్ బత్తి లాగా తగులుకునేది. అలా అని ఇప్పుడు మారిపోయాను అని కాదు గానీ, వాస్తవాలు గుర్తించే తెంపరితనం మాత్రం అబ్బింది. ఇలా వరం లాగా నాకు సంక్రమించిన చరిత్ర జ్వరం తో నేను ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో పేటా శ్రీ మరియు బొల్లోజు బాబా లాంటి వారి రచనలు నాకు చరిత్ర పట్ల ఆసక్తిని పెంచాయి. ఈ చరిత్ర యావలో తగులుకున్న నేను ఒకప్పటి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని చాలా గుళ్లు, గోపురాలు, చారిత్రక ప్రదేశాలన్నిటినీ ఒక దిమ్మరి లాగా చుట్టబెట్టేసాను. నా చరిత్ర మక్కువను పెంచే ఒక సంఘటన ఇటీవల జరిగింది. అదేమంటే అనంత కథల వాట్సప్ సముదాయం లో అడవాల శేషగిరి రాయుడు రచించిన "కంబగిరి నుంచి శేషగిరి దాకా - ఓ చారిత్రక ప్రయాణం" అనే పుస్తకం ప్రకటన మరియు దాని ప్రాప్తి స్థానం షేర్ చేయబడింది. పుస్తకం చదవకుండానే నన్ను ఆకర్షించిన అంశం ఆ పుస్తకం కవర్ పేజీ. రచయిత ఒక లింగాకారం లో ఉన్న ఒక రాతి నిర్మాణం పక్కన నిలబడ్డ ఫోటో ఆ కవర్ పేజీ లో ముద్రితమై ఉంది. ఇక ఆసక్తి తట్టుకోలేక ఆ వాట్సప్ సముదాయం లో ఇచ్చిన లంకె లోకి వెళ్లి పుస్తకం ఆర్డర్ పెట్టేసాను. ఇదిగో ఈ రోజు కొరియర్ లో ఆ పుస్తకం మా ఇంట్లోకి వచ్చేసింది. కళాశాల లో పరీక్షల విభాగంలో ఊపిరి సలపనంత పనిలో ఉక్కిరి బిక్కిరి అవుతున్న నాకు, ఇంటికి వచ్చిన తరువాత ఆ పుస్తకం నా రీడింగ్ టేబుల్ మీద కనిపించడంతో, హడావుడిగా రిఫ్రెష్ అయిపోయి ఎప్పటిలాగే కాఫీ తాగుతూ చదవడం మొదలెట్టాను.  

ఈ పుస్తకం చదవడం మొదలుపెట్టిన వెంటనే అదో రకపు మత్తు నన్ను ఆవరించేసిందని చెప్పొచ్చు . దీనిలో ప్రస్తావించిన చాలా ప్రదేశాలను నేను చూసి ఉండడంతో బాగా కనెక్ట్ అయిపోయాను. మరో విషయం పుస్తక రచయిత 'అశేరా'ను  నేను చాలా సార్లు అనంతపురంలో చూసానని నాకు పుస్తకం చదువుతుంటే తెలిసింది.  ఆయనను నేను అనేక సార్లు చూసినా కూడా ఆయనే అశేరా అని నాకు తెలియదు. గమ్మత్తేమిటంటే రచయిత ఉన్న వీధిలోనే మేము అద్దెకు ఉండేవాళ్లం. రచయిత గారి 'సంగీత వాణి' ని కూడా నేనెరుగుదును. సంగీతం లో ఆయన నైపుణ్యం నా చెవిన పడింది గానీ, చరిత్ర లో ఆయనకు ఇంత ప్రవేశం ఉందని ఇప్పుడే తెలిసివచ్చింది. మరో విషయం రచయిత ప్రస్తావించిన కల్లూరు సుబ్బరావు పురావస్తు ప్రదర్శన శాలకు ఇటీవలనే మా ఆర్ట్స్ కళాశాల సహ అధ్యాపకుడు డాక్టర్ కిరణ్ పిలుచుకువెళ్లాడు. ఆ మ్యూజియం నన్ను గతంలోకి అమాంతంగా విసిరేసింది. ఇదిగో ఇప్పుడు మళ్లీ ఈ పుస్తకం చదువుతుంటే, ఆ మ్యూజియంతో అనుబంధం ఉన్న విజయ్ కుమార్ సర్ మరియు రజిత మేడం గురించి తెలిసింది. విజయకుమార్ గారి స్నేహం రచయిత చారిత్రక స్పృహను ఎలా పెంచిందో చదువుతుంటే, నాకూ విద్యార్థి దశలో అలాంటి గురువు దొరికి ఉంటే, ఈ జంతు శాస్త్రం వదిలేసి, ఏ చారిత్రక విభాత సంధ్యలలోనో  పరిఢవిల్లిన  నాగరికతా వికాసాల గురించి అధ్యయనం చేస్తూ ఉండిపోయేవాడినేమో కదా!!!!

ఈ పుస్తకం చదువుతూ ఉంటే చరిత్ర బాగా ఔపాసన పట్టిన మిత్రుడిని ప్రతి ఒక్కరూ కలిగి ఉండడం ఒక చారిత్రక అవసరం అని తెలిసి వచ్చింది.  మనది చింపేస్తే చిరిగి పోయే చరిత్ర కాదని కూడా అర్థం అయ్యింది. ఈ పుస్తకం లో ప్రస్తావించిన కర్నూల్ జిల్లా లోని జలదుర్గం ప్రాంతానికి దగ్గరగా ఉన్న కంబగిరి నరసింహ స్వామి గుడిని నేను చాలా కాలం క్రితమే నెహ్రూ యువ కేంద్ర అధికారులు శివ కుమార్ మరియు శ్రీనివాసులు తో వెళ్లి సందర్శించాను. ఉడుము రూపంలో ఉన్న నరసింహ స్వామిని చూడడం నాకు అదే మొదటి సారి. కానీ నేను ఈ కంబగిరిని చూసేటప్పుడు భక్తి పారవశ్యం లో మునిగిపోవడం వలన స్వవశం తప్పాను. ఈ పుస్తకం ద్వారా నాకు తెలిసి వచ్చినదేమంటే చరిత్ర కారుడు భౌతికవాది గా ఉంటే మంచిది అని. అప్పుడే యదార్థ వాది కాగలడు. భౌతిక వాదిగా తనను తాను పేర్కొన్న అశేరా కంబగిరి లో నరసింహ స్వామి చెంచు లక్ష్మి ని గుహలో దాచిపెట్టిన సన్నివేశాన్ని వర్ణించిన తీరు నన్ను ఒక మైమరపుకు గురిచేసింది. స్థానిక బోయలతో ఆ గుడి చరిత్ర ముడి పడిఉందని కూడా ఇప్పుడే  తెలుసుకున్నాను. ఇక్కడ ఒక మేలి మలుపు ఏమంటే రచయితకు కంబగిరి లో దొరికిన రాగి నాణెం ఆయనను విజయ కుమార్ జావేద్ గారి వద్దకు తీసుకు వెళ్లడం. 

నేను చిన్నప్పటి నుంచి అనంతపురం జిల్లాలో చూస్తూ ఉన్న చాలా గుడుల మరియు కట్టడాల చారిత్రక నేపథ్యం నాకు ఈ పుస్తకం ద్వారా తెలిసింది. పదునాల్గవ శతాబ్ధం లో చిక్కన్న ఒడయార్ కట్టించిన అనంతపురం చెరువు పరిసర ప్రాంతాలకు నేను నా బాల్యం నుంచీ వెళుతూనే ఉన్నాను. అక్కడ ఉన్న కాశీ విశ్వనాథ స్వామి గుడికి కూడా చాలా సార్లు వెళ్లాను. అప్పట్లో నా కంటికి బుక్కరాయ సముద్రం చెరువు ఒక గంభీర సాగరం లాగా కనిపించేది. ఈ తాడిపత్రి బస్ స్టాండ్ వద్ద ఉన్న చెరువు కట్టని అప్పట్లో గణేష్ పార్క్ అని పిలిచేవారు. అప్పట్లో ఆ కట్ట మీద వినాయకుడి గుడి మరియు ఆంజనేయ స్వామి గుడి మాత్రమే ఉండేవి. నా బాల్యం లో మా అనంతపురం వాసులకు ఈ గణేష్ పార్క్ ఒక పెద్ద పిక్నిక్ స్పాట్. నాకు ఇప్పటికీ గుర్తు ఉన్న విషయం ఒకటి ఇక్కడ ప్రస్తావిస్తాను. అదేమంటే చెరువు కట్ట మీద ఉన్న గుడిలో నరక లోక శిక్షల వర్ణనలతో కూడిన ఒక నలుపు, తెలుపు చిత్రం గోడకు వేలాడేసి ఉండేది. దానిని నేను చిన్నప్పుడు చాలా సేపు చూస్తూ నిలుచుని ఉండేవాడిని. నరకం ( ఉందో, లేదో తెలియక పోయినా కూడా ) నాకు ఎందుకో ఇప్పటికీ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. నీషే లాగా నాకు కూడా చచ్చిన తరువాత స్వర్గానికంటే కూడా నరకానికే పోవాలని ఉంది. పాప భీతి ని తొలగించడానికి అప్పట్లో గుడులు ఎంతో సహకరించాయి. కాని అనేక పాపాలకు ఇప్పుడు అవే గుడులు నెలవులుగా మారడానికి  మానవ నైజంలో వచ్చిన సంక్లిష్టతనే కారణం అనిపిస్తుంది. 

గుడులు కట్టిన కాలాన్ని అంచనా వేయడంలో గుడిలో ఉన్న అనేక నిర్మాణాలు, విగ్రహ భంగిమలు, ద్వారపాలకుల విగ్రహాలు ఎలా ఉపయోగపడతాయో రచయిత చక్కగా వివరించారు. ఈ పుస్తకం చదువుతూ ఉంటే సర్ థామస్ మన్రో కార్యాలయ ప్రాంగణంగా ఒక వెలుగు వెలిగిన పాతూరు నెంబర్ 1 హై స్కూల్ మరియు జూనియర్ కాలేజీ ని నేను సందర్శించిన విషయం గుర్తుకు వచ్చింది. నగరం లో ఉన్న ఇలాంటి బ్రిటీష్ కట్టడాలకు పూర్వ వైభవం తీసుకు రావడం మన అందరి ఉమ్మడి బాధ్యత. అసలు ఈ పుస్తకం ప్రతి చరిత్ర విద్యార్థి చదవాలి. కంప్యూటరు మరియు కృత్రిమ మేధ తప్ప మిగిలినవి ఏవీ చదువులే కావు అనే భ్రమలో కొనసాగుతున్న ఈ తరం రాబోయే కొన్ని ఏళ్లలో ఎంత ఘనమైన చారిత్రక ఆనవాళ్లను కోల్పోతుందో కదా!!!! కళాశాలలో ఇప్పుడు చరిత్ర కోర్సు, ఏ ఇతర కోర్సులలో సీటు రాని వారికి శరణార్థి శిబిరంగా మాత్రమే ఉపయోగపడుతున్నది. ఈ దుస్థితి పోవాలి. చరిత్ర విద్యార్థులలో, అధ్యాపకులలో చారిత్రిక స్పృహ పెరగాలి. అలా పెరగాలి అంటే ఇలాంటి పుస్తకాలు విద్యార్థులకు అందుబాటులో ఉండాలి. అశేరా గారు విజయ కుమార్ గారితో చారిత్రక ప్రదేశాలకు తిరిగినట్టుగా విద్యార్థులను ప్రతి చరిత్ర అధ్యాపకుడు క్షేత్ర సందర్శనలకు తీసుకువెళ్లాలి. అసలు అనంతపురంలో ఉన్న ఒకప్పటి మన్రో కార్యాలయాన్ని ఎంత మంది డిగ్రీ స్థాయిలో చరిత్ర చదువుతున్న విద్యార్థులు, బోధిస్తున్న అధ్యాపకులు చూసి ఉంటారు???????? ఎందుకు మన స్థానిక చరిత్ర పట్ల ఇప్పటి తరాలకు ఇంత అవజ్ఞ!!!!!!! చరిత్రను విస్మరించి భవిష్యత్తును నిర్మించుకోవాలి అనుకోవడం నేల విడిచి సాము చేయడం లాంటిదే. ఈ పుస్తకంలో చెప్పినట్టుగా బ్రాహ్మీ లిపిని, ప్రాకృత భాషని డీకోడ్ చేసే విధానాన్ని చరిత్ర విద్యార్థులకు ప్రాక్టికల్స్ గా పెట్టాలి. అసలు చరిత్ర ను మనం చూసే కోణం మారాలి. 

రచయిత సంజీవపురం దగ్గర ఉన్న మెన్ హిర్స్ గా పిలవబడే నిలువు రాళ్ల సమాధులను గురించి చేసిన వివరణ గురించి చదువుతుంటే చరిత్రలో నా అజ్ఞానం బయటపడింది. నేనైతే వాటిని శివ స్వరూపాలుగా భావించేవాడినేమో!!!!!! అసలు శివాలెత్తి తిరుగుతున్న నాలాంటి వాడికి అన్ని రాళ్లు శివ లింగాలుగానే కనిపిస్తాయి. నేను కూడా బ్రహ్మ రాత నుంచి, మను గీత నుంచి బయట పడవలసిన అవసరం ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్నాను. కల్యాణదుర్గం వద్ద ఉన్న పాపం పేట లోని ఆది మానవుల సమాధులను  నేలమట్టం కానీవడం ఒక చారిత్రక తప్పిదం. ఇలాంటి ఆది మానవుల అవశేషాలే కళ్యాణ దుర్గం ముదిగల్లు వద్ద ఉన్నాయని విన్నాను. ఇప్పుడు అవి ఏ స్థితిలో ఉన్నాయో మరి!!!!

మరో విషయం ఇక్కడ ప్రస్తావించాలి. చారిత్రక ప్రదేశాలను డాక్యుమెంట్ చేసేటప్పుడు యూ ట్యూబర్లు ఎంత బాధ్యతాయుతంగా ఉండాలో కూడా ఈ పుస్తకం చదివిన తరువాత నాకు తెలిసివచ్చింది. చరిత్రను నమోదు చేసేటప్పుడు, వివరాలు ఎంత నిబద్దతగా సేకరించాలో కూడా అర్థం అయ్యింది. ఈ పుస్తకం చదువుతూ ఉంటే, నేను కూడా అరకొర చరిత్ర పరిజ్ఞానం తో చేసిన షార్ట్ వీడియోలు గుర్తుకువచ్చి నా గొట్టం పరిజ్ఞానానికి హృదయం మూలిగింది. కల్యాణదుర్గం వద్ద ఉన్న కంబదూరు శివాలయం మీద నేను ఒక వీడియో చిత్రీకరించాను. 

ఇక సలకం నరసయ్య నిర్మించిన సలకం చెరువు గ్రామం గురించి నేను యుక్త వయసు నుంచీ వింటూనే ఉన్నాను. అక్కడ అప్పట్లో మా నాన్న గారి మిత్రుడు ఉమా మహేశ్వర పండిట్ గారు స్టేట్ బ్యాంక్ లో పనిచేసేవారు. నేను వాగనార్ కారు కొన్న కొత్తలో మా అమ్మా, నాన్న మరియు శ్రీమతి తో కలిసి సలకం చెరువు గ్రామంలో సత్యా వేణుగోపాల విగ్రహమున్న దేవాలయాన్ని సందర్శించాను. అది చూసిన వెంటనే నాకు పోతన రాసిన 'అరి చూచున్, హరి జూచున్' పద్యం గుర్తుకువచ్చింది. ఇక శింగన మలను నేను చాలా సార్లు చూశాను. అక్కడ ఉన్న శ్రీ రంగ రాయల చెరువు మండు వేసవిలో కూడా నిండు కుండ లాగా నీటితో తొణికిసలాడుతూ ఉండడం చిన్నప్పటి నుంచి ఎరుగుదును. అలాగే గంప మల్లయ్య గుడి పూజారి వడి వడి గా గెంతుతూ కొండ దిగేటప్పుడు జారి పడి మరణించడాన్ని సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసిన వీడియోలలో చూసాను. ఎందుకో మరి చిత్రచేడు లో నిలువెత్తు బండ మీద ఉన్న ఆంజనేయ స్వామిని చూడలేక పోయాను. రచయిత ప్రస్తావించిన రాయదుర్గం సమీప గ్రామం లోని రాతి మంచం చూడాలని నాన్న రాయదుర్గం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ గా  1996 లో పనిచేస్తున్నప్పుడు  సంకల్పించుకున్న నేను దానిని ఇంచు మించు రెండు దశాబ్దాల తరువాత 2021 లో చూచి వచ్చాను. చూడముచ్చటగా ఉంది ఆ రాతి మంచం. దానిని చూసినప్పుడు నాకు మాయా బజార్ సినిమా లోని 'తల్పం.. గిల్పం' సన్నివేశం గుర్తుకువచ్చింది. జైన తీర్థంకర శాసన దేవతల మరియు బౌద్ధ పరివ్రాజక  దేవతల ప్రతిమా లక్షణాలలో భేదాలు ఉంటాయనే విషయం ఈ పుస్తకం చదివిన తరువాతే నాకు తెలిసింది. 

మన ప్రాంతం లో ఆంజనేయ స్వామి గుళ్లకు కొదవలేదని నాకు తెలుసు. కానీ కొలనుపాక  మ్యూజియం లో ఉన్న హనుమంతుడి కొడుకు మత్స్య వల్లభుడి విగ్రహ కథనం నాకు చాలా ఆసక్తి కరంగా అనిపించింది. రాయల సీమలో వ్యాసరాయలు ప్రతిష్టించినవిగా చెప్పబడుతున్న శతాధిక  హనుమంతుడి దేవాలయాలను నేను సందర్శించాను. శ్రావణ మాసం లో ప్రసిద్ద హనుమత్ క్షేత్రాలైన కసాపురం, మురిడీ మరియు నేమికల్లును ఒకే రోజు సందర్శించాను. హనుమంతుడు అంటే పూనకం తెచ్చుకునే నాకు మత్స్య వల్లభుడి కథనం గురించి సరిగా తెలియకపోవడం ఒక బుద్ది జాడ్యంగా భావిస్తున్నాను. ఒకప్పుడు గ్రామ శివార్లలో మాత్రమే ప్రతిష్టించ బడేటటువంటి హనుమంతుడు మెల్లగా ఎలా గ్రామాల లోకి ప్రవేశించాడో ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్నాను. రామానుజుల వారు ఏ విధంగా హనుమంతుడి కి ప్రాధాన్యత తీసుకువచ్చారో నాకు రేఖా మాత్రంగా తెలుసు. వైష్ణవం లో హనుమంతుడిని 'శిరియ తిరువడి' గా పేర్కొంటారు మరి. హనుమంతుడికి ఇంత ప్రాధాన్యత ఎలా వచ్చిందో సూత్ర ప్రాయంగా తెలియజేసిన రచయితకు ధన్యవాదాలు. బ్రాహ్మణ దేవతలకు ప్రాధాన్యత ఎలా పెరిగిందో, బౌద్దం మరియు జైనం కనుమరుగు కావడానికి వైదికం పన్నిన వ్యూహాలు ఎలాంటివో తెలుసుకున్నాను. చాలా జైన దేవాలయాలు వైష్ణవ ఆలయాలుగా పరిణామం చెందిన తీరు తెన్ను కర్ణాటక ప్రాంతం లో స్పష్టంగా తెలుస్తుంది. అలా అని బౌద్దం, జైనం రెండూ పూర్తిగా కనుమరుగు అవడానికి వైదికం పన్నాగాలే  కారణం కాక పోవచ్చు. ఏది ఏమైనప్పటికీ , ఈ పుస్తకం చదువుతుంటే, మన భారత దేశంలో వివిధ తత్వ శాఖలు కలిసిపోయిన తీరు  అవగతం అవుతుంది. 

గుంతకల్ దగ్గర ఉన్న దిగంబర జైన క్షేత్రం అయిన కొనకొండ్ల గురించి రచయిత చక్కగా ముచ్చటించారు. జంబూ ద్వీప చక్రాన్ని నేను గుంతకల్ కాలేజీకి అకడెమిక్ ఆడిట్ కు వెళ్లినప్పుడు చూసాను. ఆ ప్రాంతాన్ని కాపాడడానికి చక్రవర్తి అనే స్కూల్ టీచర్ ప్రయత్నం చేసాడని ఈ పుస్తకం ద్వారానే నాకు తెలిసింది. 

ఇండోనేషియా వద్ద ఉన్న టోబా అగ్ని పర్వత పేలుడు ధూళితో నిండిన జ్వాలా పురం గురించిన కథనం ఆసక్తి కరంగా ఉంది.  దీని గురించి జయ ప్రకాష్ గారి  ఇంటర్వ్యూ ఒకటి సామాజిక మాధ్యమం లో  ఇది వరకే చూసాను.  ఆది మానవుల సమాధులలో మెన్ హిర్స్, డాల్మిన్స్ మరియు డాల్మినియాడ్స్ అనే నమూనాలు ఉంటాయని ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్నాను. 

ఈ పుస్తకం లో ప్రస్తావించిన థామస్ మన్రో చూసిన పెనకచర్ల చితంబర స్వామి గురించిన కథనం  'ఆంధ్ర యోగులు' పుస్తకంలో చదివాను. మా రాయలసీమ నిండా ముఠాలు, మఠాలే కదా!!!!! . పుస్తకం లో  ప్రస్తావించిన విరాట పర్వం పారాయణం గురించి నా చిన్నప్పుడు మా పితమహులు చెపుతుండగా విన్నాను. ఈ వ్యవస్ఠీకృత నమ్మకాల నుంచి బయట పడడానికి నాకు ఇంకా కాస్త సమయం పట్టొచ్చు. మన్రో కు గండి వద్ద స్వర్ణ తోరణం కనిపించిందని కూడా నేను ఇదివరకే విన్నాను. కానీ వీటిని రచయిత వర్ణించిన తీరు అద్భుతం. రాయలసీమ వాసుల చింత తీర్చడానికి థామస్ మన్రో చింత చెట్లు నాటించిన వైనం ఈ పుస్తకం ద్వారా తెలసుకున్నాను. ఈ తింత్రిణీ యజ్ఞాన్ని మన్రో ఎంత నిబద్దతో నిర్వహించాడో తెలుసుకుని మురిసిపోయాను. ఈ మన్రో మాండవ్య మహా ముని అవతారమని చెప్పే ఒక వైదికపు కట్టు కథను  నా చిన్నప్పుడే విన్నాను. 

మరొక ఆసక్తికర విషయాన్ని నేను ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్నాను. అదే కదిరితో ముడి పడి ఉన్న చంద్రవదన మరియు మొహియార్ ప్రేమ కథ. నాకు ముందుగానే ప్రేమ కథలంటే తగని పిచ్చి. చంద్రవదన మీద మరులు గొన్న మొహియార్ విరహ బాధను ఓర్వలేక మరణించిన తీరు చదివి నా హృదయం మరో టోబా అగ్ని పర్వతం లాగా జ్వలించింది. రెండు గదులను గడప కలిపినట్టే, కదిరి లో ఉన్న ఈ ఇరువురు అజ్ఞాత ప్రేమికులను గడప మీద కూచునే మా నరసింహ స్వామి ఎందుకు కలప లేక పోయాడో కదా!!!! అనాదిగా ప్రేమికుల పట్ల దైవం ఇంత ఉపేక్ష ఎందుకు వహిస్తున్నదో కదా అని తలచి వగచాను. ఈ కథనాన్ని అశేరా వర్ణించిన తీరు ఒక ప్రబంధాన్ని తలపించింది. ఈ సారి కదిరికి వెళ్లినప్పుడు ఆ ప్రేమికులను ఎందుకు కలపలేక పోయావని నరసింహ స్వామిని నిలదీసి వస్తాను. అలాగే ఈ సారి మద్దికెర వెళ్లినప్పుడు 'మద్దలాంబ'  దారు విగ్రహాన్ని చూసి వస్తాను. 

తిమ్మమ్మ మర్రి మాను వెనుక దాగి ఉన్న సతీ సహగమన కథనం చదువుతుంటే ఆనాటి దుష్ట సంప్రదాయాలను తలుచుకుని నా మనసే ఒక చితాగ్ని కుండం అయ్యింది. ఈ ఘట్టం లో రచయిత పేర్కొన్న మరో పుస్తకం తేజో తుంగభద్ర చదవాలని ఇప్పుడు ఉబలాటం నాకు మొదలయ్యింది. ఎవరి వద్దనైనా ఉంటే అరువివ్వండి........చదివి ఇచ్చేస్తాను. 

ఇక దక్షిణ జలియన్ వాలా బాగ్ గా పిలవబడే విదురాశ్వత్థ క్షేత్రం ను నేను రెండు, మూడు సార్లు చూడడం తటస్థించింది. ఇక్కడ ఉన్న అశ్వత్థ వృక్షానికి, మహా భారతం లోని విదురుడికి భలే పీట ముడి వేసారు. ఇది పాలేగాడు అయిన విదుర నాయకుడి తో సంబంధపడిన ప్రదేశమని ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్నాను. 

శాసనాల గురించి సందర్భోచితంగా అశేరా గారు చాలా చక్కగా వివరించారు. తిరుమలకు దర్శనాలకు వెళ్లినప్పుడు అక్కడ శ్రీనివాసుడి గుడి కుడ్యాల మీద అనేక తమిళ భాషలోని (?) శాసనాలను చూసాను. వాటిని చదివే ప్రయత్నం చేయడం వలన నేను తెలుగు కూడా మరిచిపోయే పరిస్థితి దాపురించడంతో వాటి వైపు తిరగడం కూడా మానేసాను. శాసనాలు అంటే నాకు చిన్నప్పటి నుంచి భయమే. ఎందుకంటే నా బాల్యం లో నేనూ, నా మిత్రుడు ఉరవకొండ లోని కొండ మీదకు ఎక్కినప్పుడు, ఆ కొండ బండ మీద ఏదో భాష లో రాసిన అక్షరాలను కూడ బలుక్కొని చదివినట్టు నటించాను. అప్పుడు నా మిత్రుడు 'అది చదివితే శిలగా మారతారు' అని చెప్పడంతో అవాక్కై అలాగే నిలుచుండి పోయాను. బాల్యంలో చాలా కాలం పాటు రాత్రి నిద్దరలో నేను శిలనై పోతానేమో అనే భయం వెంటాడింది. 

కూడేరు ను నేను ఎన్నో సార్లు చూసినప్పటికి, దాని చారిత్రక నేపథ్యం నాకు తెలియదు. కూడేరు శాసనం లో కుల ప్రస్తావన ఉన్నట్టుగానే, గొల్లలు, కైకాల రెడ్లు చేయవలసిన కైంకర్యాల గురించి తిరుమల, తిరుపతి లో శాసనాలు ఉన్నట్టు ఎక్కడో చదివాను. నిధుల గురించి శాసనాల లో ఉండవనే విషయం ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్నాను. అసలు మా ఆర్ట్స్ కళాశాల చరిత్ర మరియు ఆర్కియాలజీ విద్యార్థులకు ఈ శాసనాల పట్ల, దేవాలయ చరిత్ర పట్ల అవగాహన కల్పించాలి. మా చరిత్ర విభాగానికి కల్లూరు సుబ్బరావు మ్యూజియం తో అవగాహనా ఒప్పందం ఉండే వుంటుంది. ఇలాంటి మ్యూజియంలో మా విద్యార్థులకు ఇంటర్న్షిప్ కల్పిస్తే ఎంత బాగుంటుందో కదా!!!!! 

కూడేరులో దొమ్మరాటలు  ఆడే పెన్నమ్మను, పవాడప్ప నాయుడు మోహించి ఇప్పటి అనంతపురం రాణి నగర్ లో అప్పట్లోనే పెట్టడం నాకు తెలియని చారిత్రక కోణం. ఇవన్నీ చదువుతుంటే నాకు హండే రాజుల చరిత్రను తెలుసుకోవాలనే ఉబలాటం కొత్తగా పుట్టింది.  ఇవన్నీ ఇప్పటి చరిత్ర విద్యార్థులు చదువుతున్నారా????? చరిత్ర చదవడం మొదలెడితే ఆ కిక్కే వేరప్పా!!!!!! నేను చేయాల్సిన పనులు ఇంకా చాలానే ఉన్నాయి. ఈ వేసంగి సెలవుల లోనే చిత్రదుర్గం లోని 'ఏలు సుత్తిన కోట' చూడాలి మరి!!!!! 

మడకశిర వద్ద ఉన్న రత్నగిరి కోటను నేను ఒకసారి చూసాను. నాకో వింత అలవాటు ఏమంటే కళాశాల పని మీద ఏదైనా ఊరు వెళ్లినప్పుడు, దాని చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను సందర్శిస్తాను. ఆ అలవాటులో భాగంగానే రొళ్ల లో ఉన్న నరసింహ స్వామి గుడి, హేమావతి, మరియు రత్నగిరిని నేను చూడడం జరిగింది. రత్నగిరి కొల్లాపురమ్మ గుడిలో నాకు తోచిన రీతిలో అనుష్టానం కూడా చేసుకున్నాను. ఈ రత్నగిరి కోటకు సంబంధించిన జింక చర్మం మ్యాపు కథనం అశేరా గారు ఆసక్తి కరంగా వివరించారు. 

కళ్యాణదుర్గం అక్కమ్మ గారి కొండ గురించిన కథనం నన్ను ఒక ట్రాన్స్ లోకి తీసుకువెళ్ళింది. దానికి కారణం నేను అక్కమ్మ గారి కొండ వద్ధ ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు విడతలుగా సుమారు మూడు ఏళ్ల పాటు పనిచేయడమే. ఆ దేవాలయం బయట ఉన్న శిలలను నేను వీరగల్లులుగా పోల్చుకోలేక పోయాను. కాలేజీ నుంచి అనంతపురంకు బయలుదేరేటప్పుడు కురులు విరబోసుకుని పడుకున్న గర్భిణి లాగా  కనిపించే కొండను ప్రతిరోజు చూసి మా అధ్యాపకులంతా ఓ విధమైన మైమరుపునకు గురయ్యే వాళ్లం. ఈ పుస్తకం లో ప్రస్తావించిన కుందుర్పి రామాలయాన్ని మాత్రం చూడలేకపోయాను. విజయ్ కుమార్ జాదవ్ గారికి తిరుమలేశుడే నిలువుదోపిడి ఇచ్చుకున్న కథనం చాలా ఆసక్తి దాయకంగా ఉంది. ఈ ఘట్టం చదువుతుంటే, అప్పట్లో నేను తిరుమల వేయి కాళ్ళ మండపం లో సేద తీరిన రోజులు గుర్తుకు వచ్చాయి. తిరుపతి గురించి ఇంకా బోలెడు విషయాలు తెలుసుకోవాలంటే మీరు పేటా శ్రీ రాసిన తిరుపతి కథలు చదవండి. నిజానికి చారిత్రక నేపథ్యం ఉన్న పుస్తకాలను చదవడం ఒక మధురానుభూతిని మిగులుస్తుంది. 

ఈ 'కంబ గిరి నుంచి శేషగిరి దాకా ఓ చారిత్రక ప్రయాణం' పుస్తకం ప్రతి యొక్క చరిత్ర విద్యార్థి చదివి తీరాలి.  ఈ పుస్తకం లో ప్రస్తావించిన అనంతపురం జిల్లాలోని ప్రతి చారిత్రక ప్రదేశానికి విద్యార్థులు క్షేత్ర పర్యటనకు వెళ్లాలి అని ఆకాంక్షిస్తూ విరమిస్తున్నాను. నాకు పత్రికల వాళ్లు, వారి అడ్రస్ లు తెలియకపోవడం వలన దీనిని నా బ్లాగు లోనే షేర్ చేసుకుంటున్నాను. ఇది చదివిన వారు, నేను చదవాల్సిన ఆసక్తికర చరిత్ర పుస్తకాలు ఉంటే, వాటి వివరాలు కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. అందరికీ మంగిడీలు. 

G L N Prasad

Lecturer in Zoology, Govt Arts College, Anantapur 



Monday, May 12, 2025

SAMBHAV foundation : Certificate Distribution Function : I feel that I am really honored to distribute the certificates who have completed the course on Data entry Operator































                                Multiple Activities in Our College Today  1. Meeting is convened in the examination committee with the membe...