Launching A New Scheme at Joyalukkas
G.L.N.PRASAD, Lecturer in Zoology
Saturday, January 31, 2026
Monday, December 22, 2025
స్వర్ణ నారాయణ గారు ప్రారంభించిన పల్లవి రీడర్స్ క్లబ్ సమూహం లో నేను ఉండడం వలన నాకు అనేక రకాల పుస్తకాల గురించి తెలుసుకునే అవకాశం కలుగుతోంది. అలా నా దృష్టికి వచ్చిన ఒక పుస్తకం శ్రీ పద్మ ఆంగ్లం లో రచించిన మరియు అరుణా ప్రసాద్ గారు తెలుగులోకి అనువదించిన 'గ్రామ దేవత' పుస్తకం. నాకు మనుషులకన్నా కూడా దేవతలను ప్రేమించే అలవాటు ఉండడం వలన ఆ పుస్తకాన్ని పోస్ట్ లో తెప్పించేసుకున్నాను. వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా చదవడం మొదలెట్టేసాను. ఈ పుస్తకం చదువుతుంటే, నాకు గ్రామ దేవతలతో ఉన్న అనుభవాలు గుర్తుకు వచ్చాయి. ఆ జ్ఞాపకాలు నెమరువేసుకుంటూనే సమీక్ష చేసాను.
బాల్యంలో నాకు తట్టు పోసింది. శరీరం అంతా కురుపులు లేచాయి. స్నానం లేదు, పానం లేదు. వేపాకు రసం పూసిన గుర్తు కొద్దిగా ఉంది. మందులూ, మాకులతో కాకుండా వేపాకులతో నాకు ట్రీట్మెంట్ జరిగింది. పది రోజుల తరువాత వేపాకు వేసిన ఉష్ణోదకం తో స్నానం చేయించారు. తరువాత ఇప్పుడు అనంతపురం రిజిస్ట్రార్ ఆఫీసు వద్ద ఉన్న పెద్దమ్మ గుడికి మా పితామహులు పిలుచుకుని వెళ్లారు. అక్కడ అమ్మవారికి ఒక టెంకాయ సమర్పించినట్టు నాకు గుర్తు. అదే నేను మొదటిసారి ఒక గ్రామ దేవత గుడికి వెళ్ళడం. వైష్ణవ సంప్రదాయం లో పుట్టి పెరగడం వలన గ్రామ దేవతలకు నేను కొద్దిగా ఎడంగానే ఉన్నానని చెప్పవచ్చు. మా పితామహి కూడా గూళ్యం లో ఆమెకు గ్రామ దేవత అయిన కొల్లాపురమ్మ కనిపించిందని నాతో అప్పుడప్పుడు చెప్పేది. ఇటీవల గూళ్యం వెళ్లినప్పుడు కొల్లాపురమ్మను చూసి వచ్చాను. అలాగే గూళ్యంలో యేటి గట్టున ఉన్న సుబ్బరాయడి గుడి కూడా చూసివచ్చాను.
ఏడవ తరగతిలో ఉండగా నాన్నకు ఉరవకొండ బదిలీ అయ్యింది. అప్పుడు మేము చందా వెంకట స్వామి ఇంట్లో అద్దెకు ఉండేవాళ్లము. చాలా పెద్ద ఇల్లు. ఇంటి బయట రెండు విశాలమైన అరుగులు. అసలు ఆ వీధిలోనే ఏదో mysticism ఉన్నట్టుగా నాకు ఆ బాల్యంలో అనిపించేది. అప్పుడే నాకు ఇంకో గ్రామ దేవత పరిచయం అయ్యింది. ఆమెనే ఏడు తలల తాయమ్మ. మా చిన్న మేనత్త ఒక సారి నిద్రలో కిర్లుకుని లేచినప్పుడు, ఆమెకు ఈ ఏడు తలల తాయమ్మ దర్శనమయ్యిందని మా ఇంట్లో మిగిలిన ఆడవాళ్లు నిర్దారించేసారు. మా మేనత్త ను కూడా దబాయించి అది నిజమని నమ్మేలా చేసారు. ఇప్పుడు కూడా ఆమె దానిని నిజమని నమ్ముతూ నేను బెంగళూరు వెళ్ళినప్పుడల్లా నాకు దాని గురించి చెపుతూ ఉంటుంది. తమాషా ఏమంటే మేము ఉరవకొండలో ఉన్న మూడేళ్ల కాలంలో ఏ రోజు కూడా ఏడు తలల తాయెమ్మ గుడికి వెళ్లలేదు. అసలు ఆ గుడి ఉందో లేదో కూడా నాకు ఇప్పటికీ తెలియదు. కానీ నాకు ఒకటి మాత్రం అర్థమయ్యింది. మనకు మంచి జరిగినా, చెడు జరిగినా దానికి కారణం దేవతలే అని జనం నమ్ముతారని. ఎందుకిలా???? వారికి ఇతర వ్యాపకాలు లేవా!!!!! నాకు తెలిసిన మరో ఉదంతం చెపుతాను. మా బంధు వర్గం లో ఒక అబ్బాయికి ఆట్లమ్మ పోసింది. ఆమె ఉగ్ర దేవత అని, ఉపశమించాలంటే నీరా తాగాలని ఎవరో సలహా ఇచ్చారు. ఇక ఆ తండ్రి నీరా తేవడానికి వెళ్లి, తెలిసో తెలియకో ఏకంగా కల్లు తెచ్చి, పిల్లోడికి ఒక గుటక వేయించి, తనో రెండు గుటకలు వేసాడు. నిషా తండ్రీ, కొడుకులకు నషాళానికి అంటడంతో కల్లు సేవించడం అలవాటై కూచుంది. ఇప్పటికీ ఆ తండ్రీ కొడుకులు ఆ అలవాటు మానలేదు మరి.
ఇదే ఉరవకొండ లో ఉండగానే ఆ ఇంటి అరుగుల మీదనో, లేదా ఇంటి వరండా లోనో తాత పోతన భాగవతం చదువుతుంటే వింటూ ఉండేవాడిని. భాగవత సంప్రదాయం లో యోగ మాయ ప్రస్తావన వస్తుంది. ఆ యోగమాయే ఈ గ్రామ దేవతలని మా పితామహులు చెప్పేవారు. నిజానికి యోగమాయగా రూపాంతీకరణం ఎలా జరిగిందో ఈ 'గ్రామ దేవత' పుస్తకంలో చక్కగా వివరించారు. సింధూ నాగరికత లో మొదలైన అమ్మ తల్లి ఆరాధన ఎలా గ్రామ దేవతలుగా పరిణామం చెందిందో, తరువాత బౌద్ధం, జైనం మరియు వైదిక మతాలు ఈ గ్రామ దేవతారాధనను వివిధ రూపాలలో ఎలా కొనసాగించాయో చక్కగా వివరించారు.
మాతృస్వామ్య వ్యవస్థలో స్త్రీ దేవతలుగా చెలామణి అయిన వారు పితృస్వామ్య వ్యవస్థ ప్రారంభమైన తరువాత కనుమరుగై వారి స్థానంలో పురుష దేవతలు ఎలా వచ్చారో ఉదాహరణాలతో ఈ పుస్తకంలో వివరించారు. ఆదిమ వ్యవస్థలో నగ్నంగా మలచబడిన ఈ దేవతలు తరువాత నగ్నత్వాన్ని వదిలించుకోవడం జరిగింది. దీనికి కారణం బ్రాహ్మణీకరణ. బ్రాహ్మణ పూజారులు వచ్చిన తరువాత దేవతలకు పట్టు వస్త్రాలు కట్టడం మొదలయ్యింది. నగ్నత్వాన్ని నాగరిక ప్రపంచం అంగీకరించకపోవడమే దీనికి కారణం. ఇప్పుడు చాలా దేవతల గుడులలో వస్త్రాలంకరణ సేవలు జరుగుతున్నాయి. దేవతా మూర్తికి ధరింపజేసిన చీరా, రవికలను వేలం వేసి మరీ అమ్ముతున్నారు. ఆదిమ వ్యవస్థలో నగ్నత్వం సహజత్వానికి, పునరుత్పత్తి శక్తికి ప్రతీక. ఈ నాగరిక ప్రపంచంలో కూడా కొన్ని చోట్ల దేవతలు నగ్నత్వాన్ని నిలుపుకున్నారు. అలంపూరులో రేణుకా దేవి విగ్రహం ఇందుకు ఉదాహరణ. ఆదిమ వ్యవస్థలో దేవతా విగ్రహం లో తల, కాళ్లు, యోని మాత్రమే మలచబడేవి. ఇవన్నీ ప్రకృతి యొక్క పునరుత్పత్తి శక్తికి ప్రతీకలు. వైదికం నగ్నత్వాన్ని ఇష్టపడదు. లజ్జా గౌరి పృష్ట భాగాన్ని లంగోటి వంటి వస్త్రంతో అలంకరించడం బ్రాహ్మణీకరణలో భాగమై ఉంటుంది. ఆదిమ నగ్న దేవతా రూపాలని మొదట బౌద్ధ జైనాలు తమలో కలుపుకుంటే, తరువాత శైవ, వైష్ణవాలు ఈ దేవతా మూర్తులకు కొన్ని మార్పులు, చేర్పులు చేసి తమలో కలిపేసుకున్నాయి. శైవం గ్రామ దేవతల వ్యవస్థను పూర్తిగా ఆక్రమించి వేసింది. చాలా మంది గ్రామ దేవతలు శివుడి భార్యలుగా చెలామణి కావడం ప్రారంభించారు. కొన్ని చోట్ల మాత్రం దేవతలు తమ నగ్నత్వాన్ని నిలుపుకున్నాయి. మధురకు చెందిన ఒక శిల్పంలో దేవత తన ఎడమ చన్నును పట్టుకుని, ఎడమ చేత్తో యోని భాగాన్ని చూపిస్తూ ఉండడం పునరుత్పత్తి శక్తిని, పోషణను సూచించే అంశంగానే పరిగణించాలి.
శ్రీవత్సం అనే లాంఛనం ఒక చిక్కుముడిలా మొదలై స్త్రీ రూపంగా ఎలా మారిందో చక్కగా వివరించారు. ఇదే శ్రీవత్సం బౌద్ధుల సిరిగా మారి తరువాత లక్ష్మీ దేవిగా రూపాంతరం చెందింది అని చక్కగా వివరించారు. వైష్ణవం లో విష్ణువు వక్షస్థలం మీద ఉన్న మచ్చను శ్రీవత్సం అంటారు. బ్రాహ్మణులలో శ్రీవత్స గోత్రం వారు ఉన్నారు. 'శ్రీ వత్స వక్షా శ్రీవాసః శ్రీనిధి శ్రీ విభావనః " అని నేను నిత్యం విష్ణు సహస్రనామం అనుసంధానం చేసేటప్పుడు చెప్పుకుంటూనే ఉంటాను. గజ లక్ష్మీ దేవత పరిణామం గురించి చక్కగా వివరించారు.
బాటలో గంగమ్మ గురించి చదువుతుంటే నాకు గుత్తి వద్ద ఉన్న బాటలో సుంకులమ్మ గుర్తుకు వచ్చింది. గంగ జాతరంటే చిత్తూరు, తిరుపతి ప్రాంతాలలో చూడాలి. పురుషులు స్త్రీ వేషాలను ధరించి బూతులతో చెలరేగి పోతారు. వెంకటగిరి పోలేరమ్మ జాతరలో కూడా బూతుల తంతు విస్తృతంగానే కనిపిస్తుంది. వెంకటగిరి పోలేరును నేను చాలా కాలం క్రితం చూసాను. తిరుపతి తాతయ్య గుంట గంగ జాతరను చాలా సార్లే చూసాను. జాతర చివరి రోజు గంగమ్మ చెంప నరుకుతారు. 'తిరుపతి కథలు' అనే పుస్తకంలో ఒక తాగుబోతు గంగమ్మతో రచ్చకేసుకున్న కథనం భలే ఉంది. అసలు ఈ గ్రామ దేవతలది వేరే జోనర్ అనుకుంటాను. కల్యాణదుర్గం లో అక్కమ్మ జాతర కూడా చూసాను. రెడ్డమ్మ కొండ కూడా చూసాను. సమయపురం మారియమ్మ ను దర్శించుకున్నాను. ఒక్కోచోట ఒక్కో కథ. రేణుకా ఎల్లమ్మ కథలు చాలానే ప్రచారంలో ఉన్నాయి. నేను రేణుకా దేవి గురించి దత్త చరిత్రలో మొదటిసారి చదివాను. నేను కోడూరు వద్ద ఉన్న చిన్న ఓరంపాడులో పనిచేసేటప్పుడు బస్సులో పోతూ ఉంటే నాకు మాతంగి గుడి ( చాలా చిన్నది) ఒకటి రోడ్డుకి వారగా కనిపించేది. తిరుమల లో కూడా గంగమ్మ గుడి ఉందట.
గ్రామ దేవత పూజలు మొదటగా చిహ్నాలతో మొదలయ్యాయి. దానిలో ఒక చిహ్నం ఘటం. ఈ ఘటమే వైదికంలో కలశంగా వ్యవహరించబడుతోంది. ఈ కలశం ప్రతి వైదిక తంతులోనూ కనిపించాల్సిందే. కొన్ని చోట్ల చిల్లుల కుండను కూడా అమ్మవారి ప్రతీక గా వాడతారు. ఈ ఘటం ఘట్టం చదువుతుండంగా మా మామగారు కాలంచేసారు. అప్పుడు కర్త అయిన మా బావమరిది చేసే అపరకర్మ చూస్తుంటే నాకు ఘటం యొక్క ప్రాధాన్యత తెలిసి వచ్చింది. అసలు ఘటం దేనికి ప్రతీక????? కుండ పూర్ణత్వానికి ప్రతీక. అలాగే గర్భానికి ప్రతీక. శరీరాన్ని కూడా ఘటం అనే అంటారు. చావుతో ఈ ఘట భ్రాంతి తొలగిపోతుంది. నిప్పు మోయడానికి, నీరు మోయడానికి కూడా కుండనే ఉపయోగిస్తారు. మట్టి తో చేయబడిన కుండ విరిగి మట్టిలో కలిసిపోయినట్టే, దేహం కూడా మట్టిలో నుంచి వచ్చి మట్టిలో కలిసిపోతుంది అని కుండ సూచిస్తుంది. 'విడిచి పోవు కుండకు విభ్రాంతి పడుదురు' అని వేమన మనల్ని హెచ్చరిస్తాడు. వేమన ఓ మొండి ఘటం లెండి!!!!!. ఫలప్రదాయిని దేవత చిహ్నమైన కుండ ఇంకా ఇలా తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. గ్రామ దేవతలను పుట్ట మన్ను రూపంలో, పుట్ట రూపంలో పూజించడానికి కారణం కూడా మట్టితో మనకున్న అనుబంధమే. చక్రం, నందిపాదం, శంఖం లాంటి లాంఛనాలు పూర్తీగా బ్రాహ్మణీకరణ చెందాయి. వీటిలో కొన్ని విష్ణు చిహ్నాలుగా మారిపోతే, కొన్ని శైవ లాంఛనాలుగా చెలామణి అవుతున్నాయి.
ఇక పద్మం అన్ని మతాలలో కనిపిస్తుంది. లక్ష్మికి మరో పేరు కమల. పద్మం లో మహా లక్ష్మి ఆసీనురాలై ఉంటుంది. తామర తూడుకు ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. ఈ పద్మ చిహ్నమే వైష్ణవంలో పుండరీకాక్ష తత్వంగా రూపాంతరం చెంది ఉండొచ్చు. దేనినీ అంటుకోని తత్వం పద్మ పత్రానిది. 'నళినీ దళ గత జలమతి తరళం' అనే శ్లోకాన్ని మీరు వినే ఉంటారు. ఒకప్పుడు పద్మం రూపంలో సూచించబడిన ఫల ప్రదాయిని తరువాత ప్రసిద్ద దేవతగా మారిపోయింది. దేవతలు కామ రూపులు అని అందుకే అంటారేమో!!!!!! వారికి ఈ కామ రూప తత్వాన్ని ఇచ్చింది మనమే కదా!!!!
ఇక గ్రామ దేవత ఉపాసనతో పెనవేసుకు పోయిన నాగ చిహ్నం గురించి ఈ పుస్తకం లో చాలా సమాచారమే ఉంది. జంట సర్పాల విగ్రహాలు అనేకం ప్రతి గ్రామంలో రావి చెట్టు కింద కనిపిస్తాయి. దేవత ద్విలింగ జీవి అని ఈ విగ్రహాలు తెలియజేస్తాయి. ఈ నాగులే తరువాతి కాలం లో బౌద్ధం మరియు జైనం లోకి కూడా ప్రవేశించారు. బౌద్ధ జాతక కథలలో ముచికుందుడు ఒక ప్రసిద్ధ నాగ సర్పం. నేను భాగవతంలో తక్షక, కాళీయుడు సర్పాల గురించి చదివాను. ఫల ప్రదాయిని గా గ్రామ దేవత ఉన్న కాలం నుంచి ప్రసిద్ద దేవతల కాలం వరకు కూడా ఈ నాగ దేవతా చిహ్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. నాగారాధన మన దేశంలోనే కాకుండా, ఇతర దేశాలలో కూడా కనిపిస్తుంది. ఈ నాగ దేవతా చిహ్నానికే పురుష రూపం ఇచ్చి ఆదిశేషుడిగా మార్చి వైష్ణవం తనలో కలిపేసుకుంది. ఈ సంప్రదాయం ప్రకారం ఈ భూమికి ఆధారం ఆదిశేషుడే. శైవం కూడా నాగ దేవతకు పురుష రూపం ఇచ్చి సుబ్రమణ్యుడిగా మార్చింది. గ్రామాలలో ఈ సుబ్రమణ్యుడినే సుబ్బరాయుడిగా పిలుస్తారు. నేను కుక్కే, పంపనూరు మరియు నాగలమడక ప్రాంతాలలో సుబ్రమణ్యుడి గుడులు చూసాను. రాహు కేతువులను కూడా సర్ప రూపాల లోనే ఇప్పటికీ కొలుస్తున్నారు. సంతాన సాఫల్యత కోసం సుబ్రమణ్యుడిని ఆరాధిస్తారు. కర్ణాటక లోని ఘాటీ లో సుబ్రమణ్య స్వామి గుడి ఉంది. అలాగే విదురాశ్వత్థం అనే ఊరిలో కొన్ని వేల నాగ ప్రతిమలు చూసాను. నాగ ప్రతిష్ట చేస్తే సంతానం కలుగుతుందనే నమ్మకం ప్రజలలో నేటికీ ఉంది. ఈ నాగ ప్రతిమల చారిత్రక పరిణామం గురించి ఈ పుస్తకంలో చక్కగా వివరించారు.
సతీ సహగమనం చేసిన స్త్రీలు దేవతలుగా కొలవబడుతున్నారు. ఆత్మ త్యాగం చేసుకున్న ముసలమ్మ లాంటి వారు మా అనంతపురంలో దేవతలుగా పూజలందుకుంటున్నారు. స్త్రీని బలి చేసేది మనుషులే, తిరిగి ఆ అపరాధ భావన నుంచి బయట పడడానికి వారిని దేవతలుగా చేసేది మనుషులే. మన మానసిక భావనలే దేవతలుగా పోత పోసుకున్నాయి.
ఈ పుస్తకం చదువుతుంటే నాకు తిరుపతి చుట్టు పక్కల ప్రాంతాలలో జరిగే ద్రౌపదమ్మ జాతరలు గుర్తుకు వచ్చాయి. ఈ జాతరలో పొంగళ్లు నైవేద్యంగా పెడతారు. నల్ల పోచమ్మ కథ చాలా బాగుంది. గరిగెమ్మ కథలో కరుణ రసం ఆవిష్కరించబడింది. మానవ నాగరికతా వికాసంలో ప్రతి భావోద్వేగానికి ఒక దేవత, ప్రతి సమస్యకు ఒక దేవత, ప్రతి సన్నివేశానికి ఒక దేవతను రూపొందించడం జరిగింది. దైవ భావన అనాది కాలంగా మానవాళికి ఒక ఆలంబన అని తెలుస్తోంది.
తెలియని వాటిని, కనపడని వాటిని ప్రేమించడం మనిషి లక్షణం. అందుకే నేను దేవుళ్లను ప్రేమిస్తాను. మీరు కూడా ఈ గ్రామ దేవత పుస్తకం చదివి మీ భావనామయ జగత్తును సుసంపన్నం చేసుకోండి. దేవతలను, ఆ మాటకొస్తే ఎవరినైనా ప్రేమించకున్నా పర్లేదు.... ద్వేషించకండి. యద్భావం తద్భవతి.
స్వస్తి
Wednesday, October 1, 2025
భారత దేశ చరిత్ర (పోటీ పరీక్షల కోసం )
- మొహంజొదారో ను కనిపెట్టినది : మార్షల్
- మొహంజొదారో అంటే అర్థం : మృతుల దిబ్బ
- హరప్పా పై పరిశోధన చేసినది: కనింగ్ హాం
- నాలుగు వేదాలలో ప్రాచీనమైనది : ఋగ్వేదం
- వేదాలలో మిత్ర శబ్దం ఏ దేవుడిని సూచిస్తుంది? సూర్యుడు
- సుదాస్ పురోహితుడి పేరు: విశ్వామిత్రుడు
- అలహాబాద్ త్రివేణి సంగమం లో అంతర్వాహినిగా ప్రవహించే నది: సరస్వతి
- సుదాస్ తండ్రి పేరు: దివోదాస్
- ఋగ్వేదం లో వాడబడిన ఓకల శబ్దానికి అర్థం : రోకలి
- ఋగ్వేదం లో వాడబడిన అయస్ శబ్దం ఏ లోహాన్ని సూచిస్తుంది? రాగి
- హరిశ్చంద్రుడి కొడుకు పేరు : లోహితుడు
- హరిశ్చంద్రుడి కొడుకు లోహితుడికి బదులుగా నరబలికి ఎవరిని సిద్దం చేసారు? శునశ్శేపుడు
- శునశ్శేపుడిని కాపాడినది ఎవరు? విశ్వామిత్రుడు
- సాగరానికి ఆ పేరు ఎలా వచ్చింది? సగర పుత్రులచే తవ్వబడడం వలన
- బ్రహ్మ వాదాన్ని మొదటిసారిగా ప్రతిపాదించినది : ప్రవహణ జైవాలి
- జాతక కథలలో కనిపించే కాశీ రాజు : బ్రహ్మ దత్తుడు
- బింబిసారుడి పుత్రుడు: అజాత శత్రువు
- నాసదీయ సూక్తం దేని లోనిది? ఋగ్వేదం
- బుద్దుడి అసలు పేరు: గౌతముడు
- గౌతముడి తల్లి పేరు: మహా మాయ
- బుద్దుడి వంశం: శాక్య వంశం
- బుద్దుడి గుర్రం పేరు: కంటకం
- బుద్దుడి రథ సారథి: చన్నుడు
- బుద్దుడు జన్మించిన ప్రదేశం: లుంబినీ
- బుద్దుడు ప్రతిపాదించిన సూత్రం : ప్రతీత్య సముత్పాదం
- ప్రతీత్య సముత్పాదం అంటే కార్యకరణ వాదం
- గౌతముని భార్య: యశోధర
- బుద్దుడు చూసిన ముని పేరు: అజీవక ముని
- బుద్దుడు మొదటి సారి ఐదు మంది శిష్యులకు ధర్మం బోధించాడు
- బుద్దుడు మొదటిసారి ధర్మ బోధ చేసిన ప్రాంతం: సారనాథ్
- బింబిసారుడు బుద్దుడికి దానం చేసిన ప్రాంతం: వేణు వనం
- బుద్దుడి కాలంలో జీవించిన లిచ్చావి రాజ నర్తకి పేరు : అంబ ఫలి
- అంబ ఫలికి మరో పేరు : ఆమ్రపాలి
- బుద్దుడు బోధించిన మార్గం: అష్టాంగ మార్గం
- కాలాశోకుడిని హత్య చేసిన సేనాని : మహా పద్మ నందుడు
- చంద్రగుప్త మౌర్యుడు ఎవరి సహాయంచే నవ నందులను జయించాడు? చాణుక్యుడు
- రాక్షస మంత్రి అసలు పేరు: ఉగ్రసేనుడు
- అలెక్సాండర్ ఏ కనుమ ద్వారా భారత దేశం లోకి అడుగుపెట్టాడు? కైబర్
- అలెక్జాండర్ దండెత్తినప్పుడు తక్షశిల రాజు ఎవరు? అంభి
- ఏ నది తీరంలో అలెక్జాండర్ సేనలకు, పురుషోత్తముడి కి యుద్దం జరిగింది? జీలం
- చంద్రగుప్త మౌర్యుడు అవలంబించిన మతం : జైనం
- అశోకుడి తండ్రి పేరు: బిందుసారుడు
- కథా సరిత్సాగరం ఏ రాజుల కాలంలో రచించబడినది? శాతవాహన
- ఆంటియోకస్ ఎవరి కుమారుడు? సెల్యూకస్
- అశోకుడు ఎవరి బోధల వలన బౌద్ధం స్వీకరించాడు? ఉపగుప్తుడు
- వృద్దాప్యం లో అశోకుడు వివాహం చేసుకున్న వనిత పేరు: తిష్య రక్షిత
- కునాలుడు మరియు జలోకుడు అనువారు అశోకుడి పుత్రులు
- జలోకుడు అవలంబించిన మతం : కాశ్మీర శైవం
- అశోకుడి మనవడు: సంప్రతి
- పుష్యమిత్ర శృంగుడు ఏ మతావలంబి? బ్రాహ్మణ మతం
- పుష్య మిత్రుడు ఎవరి వద్ద సేనాని గా పనిచేశాడు? బృహద్రధుడు
- ప్రతీత్య సముత్పదాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన బౌద్ద భిక్షువు : నాగసేనుడు
- బౌద్ద ధర్మానికి రెండవ అశోకుడి గా ఖ్యాతి చెందిన రాజు: కనిష్కుడు
- కనిష్కుడి ఆస్థానం లో ఉన్న ఆయుర్వేద పండితుడు ఎవరు? చరకుడు
- తమిళ గ్రంథం అకట్టియం ను రచించినది : అగస్త్యుడు
- కాళిదాసు రచించిన రఘువంశం లో ప్రారంభ శ్లోకం : వాగర్థా వివ సంపృక్తౌ
Monday, September 29, 2025
As Chief Guest to Freshers' day function at Govt Junior College for Girls, Uravakonda
Sunday, September 21, 2025
మన చరిత్ర - ఏటుకూరు బలరామమూర్తి
- భారత దేశ నాగరికతను ఆర్యులు ప్రారంభించలేదు. ఆర్యుల రాకకు పూర్వమే భరత ఖండంలో Urban Civilization గా పేరుగాంచిన సింధూ నాగరికత మహోజ్వలంగా విలసిల్లింది. వేదాలలో హిందూ అనే పదం లేదు. ఇప్పుడు ఎక్కువగా మనం చదువుతున్నది రాచరిక చరిత్రే కానీ సామాజిక చరిత్ర కాదు. "ఏ యుద్దం ఎందుకు జరిగెనో , ఏ రాజ్యం ఎన్నాళ్లుందో , తారీఖులు, దస్తావేజులు ఇది కాదోయ్ చరిత్ర సారం" అనే విషయం మనకు తెలిసిన తరువాతనే, మనం చరిత్ర చదివే తీరు మారింది. చరిత్రను అర్థం చేసుకునే తీరు మారింది.
- పురాణాలలో చాలా వరకు కుటుంబ కలహాలు వర్ణించబడ్డాయి. శాపాల సందడి ఎక్కువగా కనపడుతుంది. బ్రాహ్మణ, క్షత్రియుల వైరాలు చరిత్ర గతిని మార్చాయి. సమాజంలో మిగిలిన వర్ణాల చరిత్ర నమోదు చేయబడలేదు.
- యుద్ధాలన్నిటిని మతాల మధ్య చిచ్చుగా చూడలేము. మతానికి, రాజ్యానికి ఏ కాలంలోనైనా సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. రాజ్యం ఏదో ఒక మతం తో అంటకాగుతుంది. దీనికి వైదిక, జైన మరియు బౌద్ధ మతాలు ఏ మాత్రం మినహాయింపులు కావు. అసలు రాజులను ఆశ్రయించకుంటే మతాలు మనుగడ సాగించలేవు. కాబట్టి ఏ మతాన్ని ప్రత్యేకించి నిరసించాల్సిన పనీ లేదు. ఏ మతాన్ని నెత్తికెత్తుకోవాల్సిన పనీ లేదు.
- ప్రాచీన శిలాయుగపు ఆనవాళ్లు బళ్ళారి ప్రాంతంలో కూడా కనిపించాయి. పీఠభూముల్లోనే ప్రాచీన శిలా యుగపు మానవుడు సంచరించాడు. ఇక సికింద్రాబాదు లోని బేగంపేట విమానాశ్రయం వద్ద నవీన శిలా యుగానికి చెందిన సమాధులు కనిపిస్తాయి. తెలుగు రాష్ట్రాలలో కనిపించే రాక్షస గుళ్లు ఇలాంటి సమాధులే. ఆది మానవుడి సమాధులు కళ్యాణదుర్గం ప్రాంతం లో కూడా కనిపిస్తాయి.
- మానవ నాగరికత ప్రస్థానం ఆఫ్రికా నుంచి మొదలయ్యినట్టు ఉంది. భారత దేశం లోకి మొదటగా ఆఫ్రికా ఖండం నుంచి నెగ్రిటో జాతి వారు వచ్చారు. తరువాత మధ్యధరా ప్రాంతం నుంచి ప్రోటో ఆస్ట్రలాయిడ్ తెగ వారు వచ్చారు. ద్రావిడులుగా తరువాత పిలవబడిన వారు కూడా మధ్యధరా వాసులే. వీరి దేహ ఛాయ నలుపు. కుండలు చేయడం, కందమూల ఫలాల సేకరణ ఆస్ట్రలాయిడ్ తెగ నుంచి మనకు వచ్చి చేరిన నైపుణ్యాలు.
- హరప్పా ను గురించి ప్రజానీకానికి తెలియజేసినది కనింగ్ హామ్. బెనర్జీ మొహంజొదారో గురించి చాలా సమాచారాన్నే అందించాడు. సింధూ నాగరికత చాలా విస్తృతమైనది. ఇనుము తెలియకున్నా రాగి, కంచు లాంటి లోహాలు వీరికి తెలుసు. సింధూ నగరాల నమూనాలు పరిశీలిస్తే మేడలు, మిద్దెలు, వాణిజ్య సముదాయాలు ఉన్నట్టు అర్థం అవుతుంది. మాతృ స్వామ్య వ్యవస్థ ఉండేది. సర్ జాన్ మార్షల్ ఈ నాగరికత గురించి చాలా విషయాలు ఏకరువు పెట్టాడు. సింధూ ప్రజలు పత్తి, ఉన్ని వాడకం తెలిసిన వారు. వ్యవసాయం తెలుసు. చిత్ర లిపి కలిగిన వారు. సింధూ నాగరికతా కాలం నాటి చిత్రాలలో మేక, దున్న, వృషభం, ఖడ్గ మృగం లాంటి జంతువులు కనిపిస్తాయి. దిసమొలతో ఉన్న స్త్రీ విగ్రహాలు కనిపిస్తాయి. మొహంజొదారో ప్రాంతంలో కనిపించిన Dancing Girl గురించి అందరికీ తెలిసిందే కదా!!!లింగాకారాలు కనిపించాయి కానీ వాటికి మత ప్రాధాన్యత ఉందో లేదో తెలియలేదు. పశుపతి పూజ కనిపిస్తుంది. అమ్మ తల్లి ఆరాధన కనిపిస్తుంది. ఋగ్వేదం లో లింగ పూజ చేసే వారి గురించి ఉన్న నిరసన వాక్యాలు ఆర్యులు సింధూ ప్రజల మధ్య వైషమ్యాలను తెలియజేస్తాయి. ఆర్యులకు, ఆది శైవానికి మధ్య ఘర్షణ జరిగి ఉండొచ్చు అంటారు రచయిత. అద్దాలు, దువ్వెనలు ఆనాటికే కనిపెట్టేసారు మరి. అంటే సౌందర్య లాలస మొదలయ్యింది. కొప్పులో దువ్వెనలు ఉంచుకున్న స్త్రీ, పురుష విగ్రహాలు సింధూ నాగరికతా కాలంలో కనిపిస్తాయి. జూద గృహాలు కూడా ఉన్నట్టే ఉన్నాయి. మా కోచింగ్ సెంటర్ లో చెప్పిన ఒక విషయం ఇప్పుడు గుర్తుకు వస్తోంది. సింధూ నాగరికతా కాలంలో aristocracy ఉండేది అని చెప్పారు. స్త్రీ యోని నుండి ఒక వృక్షం పైకి వస్తున్న చిత్రం కూడా ఆ కాలం నాటిదే. స్త్రీని ఉత్పత్తి శక్తికి కేంద్రంగా వర్ణించే ప్రయత్నం కావొచ్చు ఇది. హరప్పా అనే పేరు ప్రాచీన ఆది శైవాన్ని సూచిస్తుందా? చరిత్రకారులే చెప్పాలి మరి!!!!
- సింధూ నాగరికత కాలంలోనే నర బలులు ఉండేవి. స్త్రీని పురుషుడు వధిస్తున్న చిత్రం దీనికి నిదర్శనం. శవాలను మొదట్లో ఖననం చేసేవారు. ఎందుకంటే ఆత్మ శరీరం తో పాటుగా జన్మ తీసుకుంటుంది అని అప్పట్లో నమ్మే వారు. అందుకే శరీరాన్ని పాతి పెట్టేవారు. తరువాత శరీర భ్రాంతి ఉడిగిన కాలంలో ఆత్మ ప్రాధాన్యం పెరిగింది. అప్పట్నుంచి శవాల దహనం మొదలయ్యింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ పీటముడి తెగనే లేదు స్వామి!!!! చావు, పుట్టుకల చుట్టూ చాలా తతంగమే చేరి పోయింది.
- తరువాత కాలంలో గుర్రాలెక్కి, విల్లంబులు ధరించి ఆర్యులు సింధూ ప్రజల మీద విరుచుకు పడ్డారు. మొహంజొదారోను మృతుల దిబ్బ చేసి వదిలారు. సింధూ నాగరికత ద్రావిడ నాగరికత. ఆర్యుల రాకతో ద్రావిడులకు, ఆర్యులకు మధ్య యుద్దాలు జరిగాయి. వ్యవసాయ నాగరికత ప్రధానంగా జీవిస్తున్న సింధూ ప్రజలు శాంతి కాముకులు. యుద్దం వారికి తెలియదు. ఆర్యులు సంచార తెగలు. ఇనుము తెలియడం వలన కత్తులు చేసుకుని, గుర్రాల మీద తెగబడ్డారు.
- తరువాత కాలంలో ఆర్య ద్రావిడ తెగలు కలిసిపోయాయి. ఆర్యుల మొదటి గ్రంథం ఋగ్వేదానికి, ఇరానియన్ల గ్రంథం ఆవేస్తా కి చాలా పోలికలే ఉన్నాయి. ఇరానియన్లే ఆర్యన్లయ్యారా???? ఆర్యులకు, ఇరానియన్లకు కూడా దైవమైన మిత్ర నే ఇప్పుడు సూర్యుడిగా మనం ఆరాధిస్తున్నాము. వేదాలలో చెప్పబడిన ఇంద్రుడు ఆర్య ప్రతినిధి. ద్రవిడులు నిర్మించిన పురాలను నాశనం చేసేవాడు కాబట్టి ఇంద్రుడిని పురంధరుడు అని కూడా పిలిచేవారు. వేదాల నుంచి పురాణాలకు వచ్చేసరికి ఇంద్ర ప్రాశస్త్యం తగ్గింది. దైవాసుర సంఘర్షణలు, త్రిపురాసుర సంహారం లాంటి కథలన్నీ బహుశా ఆర్య ద్రావిడ సంఘర్షణలు కావొచ్చు.
- సుదాస్ అనే గణాధిపతి పది మంది శత్రు రాజులను రావి నదిలో ముంచి చంపేస్తాడు. సుదాస్ భరత వంశజుడైన ఆర్యుడు. ఇతను చంపిన పది మంది రాజులు కూడా ఆర్యులే. అంటే ఆర్య తెగలు ఒకే సారి భరత ఖండంలోకి ప్రవేశించలేదు. అలలు, అలలుగా వచ్చారు. తరువాత వచ్చిన వారు, అంతకు ముందు వచ్చిన వారితో ఘర్షణ పడ్డారు. సుదాస్ పురోహితుడే విశ్వామిత్రుడు. సుదాస్ తదనంతర కాలంలో విశ్వామిత్రుడిని తొలగించి వశిష్టుడిని పురోహితుడిగా చేస్తాడు. బహుశా అందుకే విశ్వామిత్రుడికి, వశిష్టుడికి మధ్య వైరం మొదలైఉంటుంది. దీనిని బ్రహ్మర్షి, రాజర్షి వైరంగా పురాణాలు చిత్రీకరించాయి. విశ్వామిత్రుడు పురాణ వాఙ్మయంలో కొన్ని చోట్ల ఉదాత్తంగా, మరికొన్ని చోట్ల తద్విరుద్దంగా కనిపిస్తాడు. రామాయణం లో రామచంద్రుడికి అస్త్ర, శస్త్ర మంత్రాలు నేర్పింది విశ్వామిత్రుడే. విశ్వామిత్రుడు రాముడుకి ఉపదేశించిన బల, అతి బల మంత్రాలు యుక్త వయసులో చాపల్యం కొద్దీ నేను పఠించేవాడిని. ఇలా మంత్రాలకు నాకు రాలిన చింతకాయలు నా దగ్గర ఇప్పటికే చాలా పోగుపడ్డాయి. చాలా చోట్ల పురాణాలలో మనకు ఋషులు కనిపిస్తారు. ఎంతో తపస్సు చేసి పరస్పరం శాపాలు పెట్టుకునే వారు వీళ్లు. మనం నామవాచకాలుగా అనుకునే విశ్వామిత్ర, వశిష్ట, వేద వ్యాస మరియు శంకర శబ్దాలు నిజానికి సర్వనామాలు. తమకంటే కాస్త ముందుగా భారత దేశంలో స్థిరపడిన ఆస్సీరియన్ తెగ వారినే ఆర్యులు అసురులు అన్నారు. ద్రావిడ దాసులనే దస్యులన్నారు. దస్యులే శూద్రులుగా మారి ఉంటారు.
- సమిష్టి జీవన విధానానికి ప్రతీక అయిన యజ్ఞం తరువాత కాలంలో మత కర్మ అయ్యింది. దానిలోకి అతి మానుష శక్తులు ప్రవేశించాయి. వేద కాలం లో ఉన్న గణాలలో ఉత్పత్తి, పంపకం మరియు స్త్రీ, పురుష సంబంధాలు అన్నీ సామూహిక కార్యాలే. సమిష్టి భావనకు ప్రతీకనే బ్రహ్మ. సొంత ఆస్తి లేని రోజులు అవి. గణాలనే వైరాజ్యాలు అనేవారు. యజ్ఞ కర్మలు పురోహిత వర్గం చేతిలోకి వెళ్లిపోయాయి. బానిస వ్యవస్థ అవశేషంగా వర్ణ వ్యవస్థ రూపొందింది. పురోహితులు చాలా తంతులు ప్రవేశపెట్టారు. అన్నీ వారికి లాభం చేకూర్చేవే. దేవతలకు బలులు ఇస్తూ, తాము దానాలు తీసుకునేవారు. దానాలను తప్పనిసరి చేస్తూ దాన శ్రుతులను ఏర్పరిచారు. దీని వలననే హరిశ్చంద్రుడు, రంతి దేవుడు లాంటి వారు కుదేలయ్యారని రచయిత చెప్పడం సందర్భోచితంగా అనిపిస్తుంది. బ్రాహ్మణులు వ్యవసాయం కూడా చేసేవారు అప్పట్లో. ఖాండవ దహనం అర్జునుడు చేసింది బ్రాహ్మణుడికి ఆ భూభాగం దానం ఇయ్యడానికే కదా!!! ఇప్పుడైతే బాపన సేద్యం భత్యం చేటు అనే మాట వాడుకలోకి వచ్చింది.
- పాలు పితికే బాధ్యత కూతురిది కాబట్టి ఆమెను దుహిత అన్నారు. పశువు నడకను దూరానికి ప్రమాణంగా భావించారు కాబట్టి గవ్యూతీ అనే పదం ఏర్పడింది. వేద కాలంలో వేయించిన ధాన్యాన్ని దానా అని, రొట్టె ను అపూపం అని, పిండిని కరంభం అని పిలిచేవారు. ఇలాంటి పద బంధాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భాషలలో చాలానే కనిపిస్తాయి. గ్రీక్, లాటిన్ మరియు కెల్టిన్ భాషలకు, సంస్కృతానికి చాలా దగ్గర సంబంధం ఉంది మరి.
Thursday, June 26, 2025
Multiple Activities in Our College Today
1. Meeting is convened in the examination committee with the members of staff council regarding the conduct of internals, practical, CSP and internship for instant candidates.
2. Later in the evening, we joined the meeting addressed by the District Collector and Superintendent of Police as a part of Nasha Mukth Bharath.
I have also added the press clippings of my yesterday's programme held at Kadapa
Launching A New Scheme at Joyalukkas బాల్యం నుంచి నేను ధనానికి , అదనానికి దూరంగానే ఉన్నానని చెప్పొచ్చు. మితిమీరిన సంపద మనిషిని ఇబ్బంది పెడ...
-
Drug Free India- Need of the Hour & Fostering Adaptability in the 21st Century Teaching Profession SKR & SKR Government Coll...
-
జీవన భృతి కోసం జంతుశాస్త్ర అధ్యాపకుడిగా ఉద్యోగం వెలగబెడుతున్నాను కానీ, నాకు సైన్స్ కన్నా చరిత్ర అంటే తగని మక్కువ. ఇప్పుడు నేన...

.jpeg)




.jpeg)
.jpeg)

.jpeg)



.jpeg)

.jpeg)
.jpeg)

.jpeg)

.jpeg)

.jpeg)
.jpeg)
.jpeg)
