Thursday, June 25, 2026

                                               Significant activities on 24th June 2026 





Wednesday, June 17, 2026

                                                                 LIFE MEMBERSHIPS 

I have been enrolled as Life Member for C P Brown Library at Kadapa & Indian Red Cross 




Wednesday, June 10, 2026

 పెనుకొండ పార్శ్వ నాథుడి దేవాలయం 








యవ్వనంలో ప్రియురాలిని చూస్తే ఎంత వ్యామోహపడతామో, పెనుకొండను చూస్తే నాకు అంతే వ్యామోహం కలుగుతుంది. హంపీకి ఏ మాత్రం తీసిపోని వైభవం పెనుకొండది. నా దృష్టిలో ఆ మట్టిలోనే ఏదో మహత్తు ఉంది. అంతలేనిది అంత మంది యోగులు అక్కడ సిద్ది పొందరు. పెనుకొండ గిరి దుర్గం. అక్కడ ఇంకా రాచరికపు ఆనవాళ్లు పోలేదు. తనను పరిపాలించిన రాజులు పోయినా కూడా వారి కిరీటాలను ఇంకా మోస్తూ ఉంది పెనుకొండ. ఇప్పటికి పది సార్లకు పైగా చూసి ఉంటాను పెనుకొండను. నాకైతే ప్రతి రాయి ఆనాటి విజయనగర రాణుల మరియు సానుల సౌందర్యాన్ని పోతపోసుకున్నట్టు కనిపిస్తుంది. రాళ్లే ఇంత వయ్యారంగా ఉంటే, ఆ రాణులు ఎలా ఉండేవారో కదా అనిపిస్తుంది. ఆ పెనుకొండకు పోతే ఎవరికైనా చారిత్రిక స్పృహ కలుగుతుంది. 

ఈ రోజు అనుకోకుండా అహ్మద్ మరియు మరొక కొలీగ్ తో నేను పెనుకొండ వెళ్లడం తటస్థించింది. కొన్ని అలా కలిసి వస్తుంటాయి అంతే. ముందుగా దర్గాను దర్శించుకున్నాము. అక్కడ మా కోసం మిత్రుడు హరీశ్ వచ్చాడు. అతని ఆధ్వర్యంలో నేను ఎప్పటి నుంచో చూడాలి అనుకుంటున్న జైనుల పార్శ్వ నాథ స్వామి దేవాలయానికి వెళ్లాము. ఒకప్పుడు బౌద్దం లాగే జైనం ఎంతో వైభవంగా ఇక్కడ వెలుగొందింది. నిజానికి రాయలసీమ మరియు కర్ణాటక ప్రాంతంలో బౌద్దాన్ని మించిన వైభవాన్ని జైనం చవి చూసిందని చెప్పవచ్చు. మనం పూజించే చాలా మంది దేవీ దేవతలు జైన మూలాలు ఉన్నవారే. శైవం వలన బౌద్దం మరుగునపడినట్టుగానే వైష్ణవం వలన జైనం అంతరించింది అని చెప్పవచ్చు. 
జైన తీర్థంకరులు మొత్తం 24 మంది. అందులో వర్ధమాన మహావీరుడు బుద్దుడి సమాకాలీకుడు మరియు బుద్దుడి కంటే వయసులో పెద్ద వాడు. ఆ పరంపరలో 19 వ తీర్థంకరిగా మల్ల నాథ అనే స్త్రీ ఉండేదని ఇటీవల ఏదో పుస్తకంలో చదివాను. అలాగే పార్శ్వ నాథుడు 23 వ తీర్థంకరుడు. పెనుకొండ పార్శ్వ నాథ దేవాలయంలో విగ్రహం ఖడ్గాసనంలో నిలుచుండి దర్శనం ఇస్తుంది. కొన్ని చోట్ల పార్శ్వ నాథుడు పద్మాసనంలో దర్శనమిస్తాడు. ఖడ్గాసనంలో లింగం కనపడుతుంది. పద్మాసనం లో లింగం కనపడదు. పార్శ్వ నాథ విగ్రహం పాదాల వద్ద 'హళ కనడ' భాషలో రాసిన శాసనాలు ఉన్నాయి. 
పూజారి అజిత ప్రసాద్ గారు చాలా విశేషాలు చెప్పారు. ప్రతి జైన తీర్థంకరుడికి ఒక యక్షుడు మరియు ఒక యక్షిణి శాసన లేదా రక్షక దేవతలుగా ఉంటారు. అలా పార్శ్వ నాథుడికి పద్మావతి దేవి యక్షిణిగా, ధరణేంద్రుడు యక్షుడిగా ఉంటారు. ఇక్కడే నాగ దేవతలు కూడా ఉన్నారు. ఈ నాగ దేవతలు పెనవేసుకుని లేకపోయినప్పటికీ చాలా దగ్గరగా ఉన్నారు. ఇక్కడ ప్రతి అమావాస్యకు కాలసర్ప దోషం ఉన్నవారు రాహు కేతు పూజ చేయించుకుంటారని పురోహితుడు చెప్పాడు. ఋషభ నాథుడు మొదటి తీర్థంకరుడు. ఇతనికి రక్షణగా ఉండే యక్షిణి చక్రేశ్వరి. మరో విశేషం ఏమంటే నేమినాథుడు మరియు మన కృష్ణ పరమాత్మ దాయాదులట. భాగవత పురాణంలో ఈ ఋషభ నాథ మరియు నేమినాథ ప్రస్తావన వస్తుంది. ఈ ఆలయంలో శ్రుత స్కంద యంత్రాన్ని మరియు ఋషి మండలాన్ని చూసాను. శ్రుత స్కంద యంత్రం సరస్వతీ దేవికి ప్రతీక అని, ఈ యంత్రం వద్ద అక్షరాభ్యాసం చేస్తారని పురోహితులు చెప్పారు. శీతలనాథుడి యక్షిణి మానవి. జ్వాలామాలిని కూడా ఒక యక్షిణి. ఇప్పటికీ హైందవ తంత్రంలో యక్షిణీ ఉపాసనను కొందరు  చేస్తూ ఉంటారు. విశేషమైన శక్తులు యక్షిణీ ఉపాసన వలన సిద్దిస్తాయని అంటారు. నాకైతే ఉన్న శక్తి చాలు అనిపిస్తుంది. మోతాదు మించిన శక్తి వెల్లువను ఎవరు భరించగలరు??? అందుకే దీనిని ఒక కౌళాచార ప్రక్రియగా పరిగణిస్తారు. అజిత నాథుడి యక్షిణి రోహిణి. కాళీ మరియు మనోవేగ కూడా యక్షిణులే. జైనంలో శ్వేతాంబర మరియు దిగంబర అనే శాఖలు ఉన్నాయి. 
ఇదే గుడిలో మరొక ఉపాలయంలో పచ్చ పార్శ్వ నాథుడి విగ్రహం ఉంది. పచ్చతో చేసిన విగ్రహం కాబోలు. ఇంత వైభవంగా వెలుగొందిన జైనం క్షీణించడానికి కారణాలు కర్ణుడి చావుకు ఉన్నన్ని ఉన్నాయి. వీరశైవం ఒక వైపు, వైష్ణవం మరో వైపు జైనం వ్యాప్తిని అరికట్టాయి. చాలా మంది జైనులు చంపబడ్డారని చరిత్ర చదివితే తెలుస్తుంది. మీరు కర్ణాటకలోని గుడులు, గోపురాలు చూస్తే జైన శిల్ప అవశేషాలైన లతలు, ఏనుగులు లాంటివి కనిపిస్తాయి. గజలక్ష్మి అమ్మవారి పక్కన ఉన్న ఏనుగులు జైన శిల్ప కళా రీతి ఆనవాళ్లు అని కొద్దిమంది చరిత్రకారుల అభిప్రాయం. తీవ్ర తపో నియమాలను ఆచరించడం  కూడా జైనం క్షీణ దశకు చేరుకోవడానికి మరో కారణం. 
నాకైతే ఈ పార్శ్వ నాథ దేవాలయం దర్శించిన తరువాత జీవితం తరించింది అనిపించింది. అలాగే అక్కడ నుంచి పరసక్కర బావికి చేరుకున్నాము. ఈ బావిలో జలాధివాసం చేస్తున్న హనుమంతుడి విగ్రహం ఉంది. బావి నీరు తగ్గితే హనుమంతుడి దర్శనం అవుతుంది. మాకు ఆ భాగ్యం కలుగలేదు కానీ తోవలో ఎవరో ఒక వ్యక్తి తన చరవాణిలోని హనుమంతుడి చిత్రాన్ని మాకు షేర్ చేసాడు. 
ఇక అక్కడి నుంచి భోగ సముద్రం చెరువుకు చేరాము. మౌర్యుల కాలంలో రచించబడిన బ్రహ్మాండ పురాణంలో దీనిని యమ తీర్థంగా పేర్కొన్నారు. ఈ చెరువు గట్టు మీద మరువ గంగమ్మ విగ్రహం ఉంది. ఈ గంగమ్మ నోటి వరకు నీళ్లు వస్తే అప్పుడు మరువ పారుతుంది. భోగ సముద్రం పరిసరాలు చాలా ఆహ్లాదంగా ఉన్నాయి. ఈసారి మీరు పెనుకొండకు వెళితే ఇవన్నీ చూసేయండి. మరో ప్రయాణంలో మిమ్మల్ని మళ్లీ పలకరిస్తాను. స్వస్తి. 

Monday, May 25, 2026

                                                     నసనకోట ముత్యాలమ్మ గుడి 





ఎప్పుడో పదేళ్ల క్రితం నసనకోట ముత్యాలమ్మ గుడికి వెళ్లాను. ఎవరితో వెళ్లానో కూడా గుర్తుకులేదు. మళ్లా ఈరోజు మిత్రులతో కలిసివెళ్లాను. ఉదయం ఏడింటికి కారులో బయలుదేరాము. నసనకోటకు తొమ్మిదింటికల్లా చేరిపోయాము. పూజారి ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే వేపమండలు కోసుకుని వస్తాను అని చెప్పారు. అక్కడ వేచి ఉండడం ఎందుకని దగ్గరలోనే ఉన్న తిరుమల దేవర గుడికి వెళ్లాము. గుట్ట మీద ఉంది తిరుమల దేవర గుడి. ఆహ్లాదకరమైన వాతావరణం పరుచుకుని ఉంది. లోపల ఉన్న తిరుమల దేవరని చూసుకుని తిరిగి నసనకోటకు చేరుకున్నాము. పూజారి వేప మండలు తీసుకుని బైక్ లో వచ్చేసాడు. వేప మండలకు, గ్రామ దేవతలకు చాలా అవినాభావ సంబంధం ఉంది. చాలా మంది గ్రామ దేవతలు రోగాధిష్టాన దేవతలు. వారికి ఆగ్రహం కలిగిస్తే రోగాలు వస్తాయని, శాంతింపజేస్తే రోగాలు ఉపశమిస్తాయని ప్రజల నమ్మకం. ఒకప్పుడు గ్రామ దేవతల గుళ్లల్లో బ్రాహ్మణేతరులు పూజారులుగా ఉండేవారు. ఇప్పుడు వారి స్థానంలో చాలా చోట్ల బ్రాహ్మణులే పూజారులుగా పూజాదికాలు నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లాలో ముత్యాలమ్మ, పెద్దమ్మ, సుంకులమ్మ, చౌడేశ్వరి, గౌడు సంద్రమ్మ, మారెమ్మ, కొల్లాపురమ్మ గ్రామ దేవతలు కనిపిస్తారు. ప్రతి గ్రామాన్ని ఒక గ్రామ దేవత రక్షిస్తూ ఉంటుందని చెపుతారు. వీరు జాతరలప్పుడు భక్తుల ఒంటి మీదకు వస్తారు. దీనినే పూనకం అంటారు. ఆ భావాతీత స్థితిలో దేవత ఆవాహన అయిన వ్యక్తి ఎన్నో జరగబోయే విషయాలు చెపుతాడు. గ్రామ దేవతల గుళ్లల్లో బలులు ఇస్తారు. మగ జంతువునే బలి ఇస్తారు. గ్రామ దేవత సోదరుడైన పోతురాజు విగ్రహం ప్రతి గ్రామ దేవత గుడిలో ఉంటుంది. 

నసనకోట గుడిలో ముత్యాలమ్మ పుట్టలో వెలసిన స్వయంభువు. గర్భ గుడి వెనుక గోడకు ఉన్న మూడు రంధ్రాలనుంచీ చూస్తే పుట్ట కనిపిస్తుంది.  పూజారి ముత్యాలమ్మను 'అమ్మయ్య' అని పిలవడం ముచ్చటగా అనిపించింది. మంగళ, శుక్ర మరియు ఆదివారాలలో చాలా జీవాలను బలి ఇస్తారు. ఆలయ పరిసరాలలో రక్తం చారికలు కనిపించాయి. బలిచ్చిన జీవాల కాళ్లను గుడి బయట వేలాడదీసారు. పూజారికి వారసత్వంగా పూజార్హత వచ్చింది. ఆలయ విశిష్టత గురించి చక్కగా వివరించాడు. ఇలా చెప్పుకొచ్చాడు. "అమ్మయ్య కలియుగ నిర్మాణం జరిగేటప్పుడే వెలసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సృష్టించింది. తరువాత సృష్టి కొనసాగడం కోసం విష్ణువును తనతో సంభోగించమని అడిగింది. దానికి విష్ణువు తిరస్కరిస్తే, అమ్మవారు మూడో కంటి మంటతో విష్ణువును బూడిద చేసింది. శివుడికి కూడా అదే పరిస్థితి వచ్చి పడింది. బ్రహ్మ మాత్రం నీకున్న మూడో కన్ను నాకిస్తే, నీ  మాట నెరవేరుస్తాను అన్నాడు. తీరా ఆమె మూడో కన్ను ఇచ్చిన తరువాత ఆ నలువ ఒక తులువ పని చేసాడు. అదేమిటంటే అమ్మయ్య ప్రసాదించిన మూడో కంటి మంటతో ఆమెనే కాల్చేశాడు. కానీ ఇక్కడ శివుడి బదులు బ్రహ్మ అని పూజారి చెప్పాడేమో అని నా అనుమానం. 

తరువాత కలియుగ నిర్మాణం మొదటిలోనే అమ్మయ్య పుట్టలో వెలసింది. ఇక్కడ కూడా అన్ని గ్రామ దేవతలకు ఉన్నట్టుగానే ముత్యాలమ్మకు మీసాలు ఉన్నాయి. దీని అంతరార్థం ఏమిటో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. పూజారి చెప్పిన కథ వలన నాకు అర్థం అయ్యింది ఏమంటే మాతృస్వామ్య వ్యవస్థ నుంచి సమాజం పితృ స్వామ్య వ్యవస్థ కు మారినప్పుడు స్త్రీ దేవతల స్థానాన్ని త్రిమూర్తులు తీసుకుని ఉంటారు. ఈ విషయాన్ని బొల్లోజు బాబా గారి ఏదో పుస్తకంలో నేను చదివినట్టు గుర్తు. 

నేను పూజారి అనుమతితో అమ్మయ్యని , గుడి పరిసరాలని వీడియో రూపంలో బంధించి ఇంస్టా లో పెట్టేసాను. స్థానిక సంస్కృతులను పరిరక్షించాలనుకుంటే గ్రామ దేవతల చరిత్ర ప్రతి ఒకరు తెలుసుకోవాలి. జీవితంలో విజయం సాధించాలి అంటే శక్తి, భక్తి, యుక్తి మూడూ కావాలి. ఈ మూడు అంశాలు గ్రామ దేవతారాధనలో పెనవేసుకుని ఉంటాయని నా అభిప్రాయం. 

Sunday, May 17, 2026

                                   ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న నరసింహ క్షేత్రాలు 

                                                                  1. పెన్నహోబిలం







నరసింహ స్వామి మాకు ఇంటి పెరుమాళ్. రాయదుర్గం వద్ద ఉన్న వెప్రగల్ నరసింహ స్వామిని అనాదిగా మా పూర్వీకులు పూజించేవారు. స్వామి ఉగ్ర స్వరూపం లో ఉన్నా కూడా భక్తుల విషయం వచ్చేసరికి పరమ వాత్సల్య మూర్తిగానే దర్శనం ఇస్తారు. అందుకే నాకు నరసింహ క్షేత్రాలను దర్శించడం ఇష్టం. కొండలు, గుట్టలు మరియు కోనల్లోనే ఈ నరసింహ క్షేత్రాలు ఉంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అనేక నరసింహ క్షేత్రాలను నేను చూసాను. చాలా చోట్ల ఓడ్యాణ బంధంలో కూచుని స్వామి దర్శనం ఇస్తారు. అహోబిలం లో నేను నవ నారసింహ క్షేత్రాలలో ఎనిమిది దర్శించాను. స్వామిది నిత్య వైభవం. అవతార కార్యం పూర్తీ అయినా కూడా కొనసాగుతున్న వైభవం ఆయనది. రూపం చూస్తే 'న మృగం, న మానుషం' . జడమైన స్తంభం లో ఉద్భవించిన మహా చైతన్యమూర్తి స్వామి. 

"ఆ నాభే బ్రహ్మణో రూపం - ఆగళా ద్వైష్ణవం విభుః 

ఆశీర్షాద్రుద్ర రూపంతం తదగ్ర సర్వతః శివం " 

అని నరసింహ స్వరూపాన్ని వర్ణిస్తారు ఋషులు. ఇతర రాష్ట్రాలలో కూడా ప్రసిద్ద నరసింహ క్షేత్రాలను కొన్నిటిని చూసాను. మైసూర్ తోవలో ఉన్న మద్దూరులో మూడు నేత్రాలు కలిగి ఉన్న నరసింహ స్వామి ఉన్నాడు. ఇలాంటి రూపం చాలా అరుదు. హాసన్ పట్టణంలోకి బెంగళూరు వైపు నుండి ప్రవేశించేటప్పుడు ఒక నరసింహ స్వామి దేవాలయం వస్తుంది. దాన్ని దర్శించినప్పుడు నేనో దివ్యానుభూతికి లోనయ్యాను. ఇక మేల్కోటె లో యోగా నరసింహ స్వామి పర్వతం మీద దర్శనం ఇస్తాడు. తమిళనాడు లో ఘటికాచాలంగా పిలువబడే షోలింగర్ చాలా సార్లు చూసాను. ఇక్కడ పూజారులు స్వామి మంత్ర జలాన్ని ముఖం మీద చల్లడం భలే అనుభూతినిస్తుంది. 

రాపూరు వద్ద ఉన్న పెంచల కోన ఒక అద్బుతమైన నరసింహ క్షేత్రం. ఇక్కడ ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడు. తెలంగాణా లోని యాదగిరిని మూడు సార్లకు పైగానే చూసాను. అక్కడి ఆలయ గోపురం మీద సుదర్శన చక్రత్తాళ్వార్ నాకో పెద్ద ఆకర్షణ. ఈతి బాధలు ఉన్నవారు ఈ క్షేత్ర దర్శనం ఎక్కువగా చేస్తుంటారు. ధర్మపురి గుడి కూడా కుటుంబంతో కలిసి చూసాను. ఈ ధర్మపురి లో యమధర్మ రాజుకు గుడి ఉంది. అక్కడ యముడికి కూడా పూజలు చేస్తారు. హన్మకొండకు శిక్షణార్థం వెళ్లినప్పుడు మల్లూరు నరసింహుడి దర్శనం చేసుకున్నాను. ఇక్కడ స్వామి మూల విరాట్టు కు రోమాలు ఉండడమే కాక, మానవ శరీరం లాగా మెత్తగా ఉంటుంది. చూసినప్పుడు కొద్దిగా భయం కూడా వేసింది. మొన్న .. మొన్న ఒంగోలు వెళ్లినప్పుడు సింగరాయ కొండకు వెళ్లి 'సింగప్పెరుమాళ్' ను చూసాను. గుర్రంకొండ దగ్గర ఉన్న తరిగొండ నరసింహ స్వామి క్షేత్రాన్ని చూసాను. ఇక్కడ గరుడోత్సవం చాలా ప్రసిద్ది. 

నరసింహోపాసన సిద్దించాలంటే నిష్ట ఉండాలి అని అనుభవంతో తెలుసుకున్నాను. మరి అదే నాకు లేదాయే. కర్ణాటక లోని బాగే పల్లి వద్ద కొండ గుహలో మరో నరసింహ క్షేత్రం ఉంది. క్షేత్రం పేరు మరిచాను. క్షంతవ్యుడను. హిందూపూర్ కు దగ్గరగా ఉన్న దాళి వట్టం కూడా చాలా పెద్ద గుడి. మడకశిర వద్ద ఉన్న భక్తర హళ్లి నరసింహ క్షేత్రం భూతప్పల జాతర కు ప్రసిద్ది. ఏ క్షేత్రం ప్రత్యేకత దానిదే. ఘాటీ క్షేత్రం లో విశేషం ఏమంటే విగ్రహానికి ఒక వైపు సుబ్రమణ్యుడు, మరో వైపు నరసింహుడు. ఇలా సుబ్రమణ్యుడు మరియు నరసింహుడు కలిసి ఒకే విగ్రహంలో కాకున్నా, ఒకే చోట దర్శనం ఇచ్చే ప్రాంతం పంపనూరు. 

ఇదంతా ఉపోధ్ఘాతం లెండి. పైన నేను పోస్ట్ చేసిన ఫొటోస్ అనంతపురం జిల్లా ఉరవకొండ దగ్గరగా ఉన్న పెన్నహోబిలంకు సంబంధించినవి. బాల్యం నుంచి ఈ క్షేత్రాన్ని చాలా సార్లే చూసాను. ఇక్కడ వర్షాకాలం లో పెన్న పరవళ్లు తొక్కుతుంది. నరసింహ స్వామి వేటాడుతూ అహోబిలంలో ఒక పాదం, పెన్నహోబిలం లో మరో పాదం పెట్టాడని కథనం. ఎత్తు ప్రదేశంలో ఉన్న ఈ  గుడి నాలుగు రాజగోపురాలతో అలరారుతూ ఉంటుంది.  ఒక వైపు మాత్రం అతి చిన్న గోపురం ఉంటుంది. దీనిని పాలు, నెయ్యితో కట్టారని ప్రతీతి. క్షేత్ర ప్రవేశ మార్గంలో స్తంభం నుంచి ఉద్భవం అవుతున్న నరసింహ స్వామిని భయంగా చూస్తూన్న హిరణ్యకశిపుడు, పరవశంతో చూస్తున్న ప్రహ్లాదుడి నిలువెత్తు విగ్రహాలు ఇప్పుడు ఇంస్టాలో వైరల్ అవుతున్నాయి. నేను కూడా ఒక రీల్ చేసి పెట్టాను. 

ఈసారి నేను నా పీజీ క్లాస్మెట్ రూపరాజు రవికాంత్ తో వెళ్లాను. మమ్మల్ని కలవడానికి , మాకు చక్కటి దర్శనం ఇప్పించడానికి ఉరవకొండ నుంచీ మిత్రుడు మాసినేని సుధాకర్, అతని శిష్యుడు లాయర్ సురేష్ వచ్చారు. అంతరాలయ దర్శనం దొరికింది. అక్కడి నుంచి క్రింద ఉన్న ఉధ్భవ లక్ష్మీ గుడి చూసాము. ఈ ట్రిప్ యొక్క విశేషం ఏమంటే ఈ పెన్నహోబిలం వద్ద ఉన్న బగిరి గుండ్లను చూడడం. ఇక్కడ ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ ఆకతాయిల ఆగడాలు ఉండేవట. ఇప్పుడు పోలీస్ out post పెట్టారు. ఈ ప్రాంతం అంతా చిట్టడివి. ఇక్కడే నరసింహ స్వామి మృగయా వినోదార్థం అడవి పందిని వేటాడాడు అని భక్తుల నమ్మకం. వేటాడి అడవి పంది మాంసాన్ని కుప్పలుగా పోసిన వైనం అక్కడి పూజారి చక్కగా చెప్పారు. అడవి పంది కోసం స్వామి దాక్కొన్న గుహను  నా చరవాణిలో బంధించాను . తరువాత మరో గుహలో స్వామి శిలా రూపంలో దర్శనం ఇచ్చాడు. ఆ గుహలో కూచుని నేనూ, నా మిత్ర బృందం విష్ణు సహస్రనామ పారాయణ చేసాము. చేస్తున్నంత సేపూ గుహలోపలి నుంచి ఏ ఎలుగ్గొడ్డు వస్తుందో అని నాకు ఒకటే భయం. అసలు స్వామికి ఈ వేట వ్యసనం ఎలా అంటుకుంది అని ఆలోచిస్తే, జీవులను వేటాడడం ఆయనకు వినోదం అని స్పురించింది. సుమారు ఒక నలభై నిమిషాలపాటు ఈ బగిరి గుండ్ల దగ్గర గడిపాము. ఇంస్టా లో రీలెట్టేసాను. అప్పుడే ఏడువేల మంది చూసేసారు. 

వర్షాకాలంలో పెన్నా నదిలో నీరు పోటెత్తినప్పుడు ఈ క్షేత్రాన్ని దర్శించడం ఒక మధురానుభూతిని ఇస్తుంది. అనంతపురం నుంచీ బళ్ళారి పోయే దావలో ఈ క్షేత్రం ఉంది. గుడి చుట్టూ ఉన్న అంగళ్ళలో బొరుగులను మిరపకాయ బజ్జీలతో కలిపి తింటే ఆ కారానికి నరసింహ స్వామి మరోసారి దర్శనం ఇవ్వడం ఖాయం. 

Friday, April 17, 2026

 Self Enumeration and Other Posters pertaining to Census 2027 released by District Collector 





                                               Significant activities on 24th June 2026