Monday, May 25, 2026

                                                     నసనకోట ముత్యాలమ్మ గుడి 





ఎప్పుడో పదేళ్ల క్రితం నసనకోట ముత్యాలమ్మ గుడికి వెళ్లాను. ఎవరితో వెళ్లానో కూడా గుర్తుకులేదు. మళ్లా ఈరోజు మిత్రులతో కలిసివెళ్లాను. ఉదయం ఏడింటికి కారులో బయలుదేరాము. నసనకోటకు తొమ్మిదింటికల్లా చేరిపోయాము. పూజారి ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే వేపమండలు కోసుకుని వస్తాను అని చెప్పారు. అక్కడ వేచి ఉండడం ఎందుకని దగ్గరలోనే ఉన్న తిరుమల దేవర గుడికి వెళ్లాము. గుట్ట మీద ఉంది తిరుమల దేవర గుడి. ఆహ్లాదకరమైన వాతావరణం పరుచుకుని ఉంది. లోపల ఉన్న తిరుమల దేవరని చూసుకుని తిరిగి నసనకోటకు చేరుకున్నాము. పూజారి వేప మండలు తీసుకుని బైక్ లో వచ్చేసాడు. వేప మండలకు, గ్రామ దేవతలకు చాలా అవినాభావ సంబంధం ఉంది. చాలా మంది గ్రామ దేవతలు రోగాధిష్టాన దేవతలు. వారికి ఆగ్రహం కలిగిస్తే రోగాలు వస్తాయని, శాంతింపజేస్తే రోగాలు ఉపశమిస్తాయని ప్రజల నమ్మకం. ఒకప్పుడు గ్రామ దేవతల గుళ్లల్లో బ్రాహ్మణేతరులు పూజారులుగా ఉండేవారు. ఇప్పుడు వారి స్థానంలో చాలా చోట్ల బ్రాహ్మణులే పూజారులుగా పూజాదికాలు నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లాలో ముత్యాలమ్మ, పెద్దమ్మ, సుంకులమ్మ, చౌడేశ్వరి, గౌడు సంద్రమ్మ, మారెమ్మ, కొల్లాపురమ్మ గ్రామ దేవతలు కనిపిస్తారు. ప్రతి గ్రామాన్ని ఒక గ్రామ దేవత రక్షిస్తూ ఉంటుందని చెపుతారు. వీరు జాతరలప్పుడు భక్తుల ఒంటి మీదకు వస్తారు. దీనినే పూనకం అంటారు. ఆ భావాతీత స్థితిలో దేవత ఆవాహన అయిన వ్యక్తి ఎన్నో జరగబోయే విషయాలు చెపుతాడు. గ్రామ దేవతల గుళ్లల్లో బలులు ఇస్తారు. మగ జంతువునే బలి ఇస్తారు. గ్రామ దేవత సోదరుడైన పోతురాజు విగ్రహం ప్రతి గ్రామ దేవత గుడిలో ఉంటుంది. 

నసనకోట గుడిలో ముత్యాలమ్మ పుట్టలో వెలసిన స్వయంభువు. గర్భ గుడి వెనుక గోడకు ఉన్న మూడు రంధ్రాలనుంచీ చూస్తే పుట్ట కనిపిస్తుంది.  పూజారి ముత్యాలమ్మను 'అమ్మయ్య' అని పిలవడం ముచ్చటగా అనిపించింది. మంగళ, శుక్ర మరియు ఆదివారాలలో చాలా జీవాలను బలి ఇస్తారు. ఆలయ పరిసరాలలో రక్తం చారికలు కనిపించాయి. బలిచ్చిన జీవాల కాళ్లను గుడి బయట వేలాడదీసారు. పూజారికి వారసత్వంగా పూజార్హత వచ్చింది. ఆలయ విశిష్టత గురించి చక్కగా వివరించాడు. ఇలా చెప్పుకొచ్చాడు. "అమ్మయ్య కలియుగ నిర్మాణం జరిగేటప్పుడే వెలసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సృష్టించింది. తరువాత సృష్టి కొనసాగడం కోసం విష్ణువును తనతో సంభోగించమని అడిగింది. దానికి విష్ణువు తిరస్కరిస్తే, అమ్మవారు మూడో కంటి మంటతో విష్ణువును బూడిద చేసింది. శివుడికి కూడా అదే పరిస్థితి వచ్చి పడింది. బ్రహ్మ మాత్రం నీకున్న మూడో కన్ను నాకిస్తే, నీ  మాట నెరవేరుస్తాను అన్నాడు. తీరా ఆమె మూడో కన్ను ఇచ్చిన తరువాత ఆ నలువ ఒక తులువ పని చేసాడు. అదేమిటంటే అమ్మయ్య ప్రసాదించిన మూడో కంటి మంటతో ఆమెనే కాల్చేశాడు. కానీ ఇక్కడ శివుడి బదులు బ్రహ్మ అని పూజారి చెప్పాడేమో అని నా అనుమానం. 

తరువాత కలియుగ నిర్మాణం మొదటిలోనే అమ్మయ్య పుట్టలో వెలసింది. ఇక్కడ కూడా అన్ని గ్రామ దేవతలకు ఉన్నట్టుగానే ముత్యాలమ్మకు మీసాలు ఉన్నాయి. దీని అంతరార్థం ఏమిటో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. పూజారి చెప్పిన కథ వలన నాకు అర్థం అయ్యింది ఏమంటే మాతృస్వామ్య వ్యవస్థ నుంచి సమాజం పితృ స్వామ్య వ్యవస్థ కు మారినప్పుడు స్త్రీ దేవతల స్థానాన్ని త్రిమూర్తులు తీసుకుని ఉంటారు. ఈ విషయాన్ని బొల్లోజు బాబా గారి ఏదో పుస్తకంలో నేను చదివినట్టు గుర్తు. 

నేను పూజారి అనుమతితో అమ్మయ్యని , గుడి పరిసరాలని వీడియో రూపంలో బంధించి ఇంస్టా లో పెట్టేసాను. స్థానిక సంస్కృతులను పరిరక్షించాలనుకుంటే గ్రామ దేవతల చరిత్ర ప్రతి ఒకరు తెలుసుకోవాలి. జీవితంలో విజయం సాధించాలి అంటే శక్తి, భక్తి, యుక్తి మూడూ కావాలి. ఈ మూడు అంశాలు గ్రామ దేవతారాధనలో పెనవేసుకుని ఉంటాయని నా అభిప్రాయం. 

Sunday, May 17, 2026

                                   ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న నరసింహ క్షేత్రాలు 

                                                                  1. పెన్నహోబిలం







నరసింహ స్వామి మాకు ఇంటి పెరుమాళ్. రాయదుర్గం వద్ద ఉన్న వెప్రగల్ నరసింహ స్వామిని అనాదిగా మా పూర్వీకులు పూజించేవారు. స్వామి ఉగ్ర స్వరూపం లో ఉన్నా కూడా భక్తుల విషయం వచ్చేసరికి పరమ వాత్సల్య మూర్తిగానే దర్శనం ఇస్తారు. అందుకే నాకు నరసింహ క్షేత్రాలను దర్శించడం ఇష్టం. కొండలు, గుట్టలు మరియు కోనల్లోనే ఈ నరసింహ క్షేత్రాలు ఉంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అనేక నరసింహ క్షేత్రాలను నేను చూసాను. చాలా చోట్ల ఓడ్యాణ బంధంలో కూచుని స్వామి దర్శనం ఇస్తారు. అహోబిలం లో నేను నవ నారసింహ క్షేత్రాలలో ఎనిమిది దర్శించాను. స్వామిది నిత్య వైభవం. అవతార కార్యం పూర్తీ అయినా కూడా కొనసాగుతున్న వైభవం ఆయనది. రూపం చూస్తే 'న మృగం, న మానుషం' . జడమైన స్తంభం లో ఉద్భవించిన మహా చైతన్యమూర్తి స్వామి. 

"ఆ నాభే బ్రహ్మణో రూపం - ఆగళా ద్వైష్ణవం విభుః 

ఆశీర్షాద్రుద్ర రూపంతం తదగ్ర సర్వతః శివం " 

అని నరసింహ స్వరూపాన్ని వర్ణిస్తారు ఋషులు. ఇతర రాష్ట్రాలలో కూడా ప్రసిద్ద నరసింహ క్షేత్రాలను కొన్నిటిని చూసాను. మైసూర్ తోవలో ఉన్న మద్దూరులో మూడు నేత్రాలు కలిగి ఉన్న నరసింహ స్వామి ఉన్నాడు. ఇలాంటి రూపం చాలా అరుదు. హాసన్ పట్టణంలోకి బెంగళూరు వైపు నుండి ప్రవేశించేటప్పుడు ఒక నరసింహ స్వామి దేవాలయం వస్తుంది. దాన్ని దర్శించినప్పుడు నేనో దివ్యానుభూతికి లోనయ్యాను. ఇక మేల్కోటె లో యోగా నరసింహ స్వామి పర్వతం మీద దర్శనం ఇస్తాడు. తమిళనాడు లో ఘటికాచాలంగా పిలువబడే షోలింగర్ చాలా సార్లు చూసాను. ఇక్కడ పూజారులు స్వామి మంత్ర జలాన్ని ముఖం మీద చల్లడం భలే అనుభూతినిస్తుంది. 

రాపూరు వద్ద ఉన్న పెంచల కోన ఒక అద్బుతమైన నరసింహ క్షేత్రం. ఇక్కడ ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడు. తెలంగాణా లోని యాదగిరిని మూడు సార్లకు పైగానే చూసాను. అక్కడి ఆలయ గోపురం మీద సుదర్శన చక్రత్తాళ్వార్ నాకో పెద్ద ఆకర్షణ. ఈతి బాధలు ఉన్నవారు ఈ క్షేత్ర దర్శనం ఎక్కువగా చేస్తుంటారు. ధర్మపురి గుడి కూడా కుటుంబంతో కలిసి చూసాను. ఈ ధర్మపురి లో యమధర్మ రాజుకు గుడి ఉంది. అక్కడ యముడికి కూడా పూజలు చేస్తారు. హన్మకొండకు శిక్షణార్థం వెళ్లినప్పుడు మల్లూరు నరసింహుడి దర్శనం చేసుకున్నాను. ఇక్కడ స్వామి మూల విరాట్టు కు రోమాలు ఉండడమే కాక, మానవ శరీరం లాగా మెత్తగా ఉంటుంది. చూసినప్పుడు కొద్దిగా భయం కూడా వేసింది. మొన్న .. మొన్న ఒంగోలు వెళ్లినప్పుడు సింగరాయ కొండకు వెళ్లి 'సింగప్పెరుమాళ్' ను చూసాను. గుర్రంకొండ దగ్గర ఉన్న తరిగొండ నరసింహ స్వామి క్షేత్రాన్ని చూసాను. ఇక్కడ గరుడోత్సవం చాలా ప్రసిద్ది. 

నరసింహోపాసన సిద్దించాలంటే నిష్ట ఉండాలి అని అనుభవంతో తెలుసుకున్నాను. మరి అదే నాకు లేదాయే. కర్ణాటక లోని బాగే పల్లి వద్ద కొండ గుహలో మరో నరసింహ క్షేత్రం ఉంది. క్షేత్రం పేరు మరిచాను. క్షంతవ్యుడను. హిందూపూర్ కు దగ్గరగా ఉన్న దాళి వట్టం కూడా చాలా పెద్ద గుడి. మడకశిర వద్ద ఉన్న భక్తర హళ్లి నరసింహ క్షేత్రం భూతప్పల జాతర కు ప్రసిద్ది. ఏ క్షేత్రం ప్రత్యేకత దానిదే. ఘాటీ క్షేత్రం లో విశేషం ఏమంటే విగ్రహానికి ఒక వైపు సుబ్రమణ్యుడు, మరో వైపు నరసింహుడు. ఇలా సుబ్రమణ్యుడు మరియు నరసింహుడు కలిసి ఒకే విగ్రహంలో కాకున్నా, ఒకే చోట దర్శనం ఇచ్చే ప్రాంతం పంపనూరు. 

ఇదంతా ఉపోధ్ఘాతం లెండి. పైన నేను పోస్ట్ చేసిన ఫొటోస్ అనంతపురం జిల్లా ఉరవకొండ దగ్గరగా ఉన్న పెన్నహోబిలంకు సంబంధించినవి. బాల్యం నుంచి ఈ క్షేత్రాన్ని చాలా సార్లే చూసాను. ఇక్కడ వర్షాకాలం లో పెన్న పరవళ్లు తొక్కుతుంది. నరసింహ స్వామి వేటాడుతూ అహోబిలంలో ఒక పాదం, పెన్నహోబిలం లో మరో పాదం పెట్టాడని కథనం. ఎత్తు ప్రదేశంలో ఉన్న ఈ  గుడి నాలుగు రాజగోపురాలతో అలరారుతూ ఉంటుంది.  ఒక వైపు మాత్రం అతి చిన్న గోపురం ఉంటుంది. దీనిని పాలు, నెయ్యితో కట్టారని ప్రతీతి. క్షేత్ర ప్రవేశ మార్గంలో స్తంభం నుంచి ఉద్భవం అవుతున్న నరసింహ స్వామిని భయంగా చూస్తూన్న హిరణ్యకశిపుడు, పరవశంతో చూస్తున్న ప్రహ్లాదుడి నిలువెత్తు విగ్రహాలు ఇప్పుడు ఇంస్టాలో వైరల్ అవుతున్నాయి. నేను కూడా ఒక రీల్ చేసి పెట్టాను. 

ఈసారి నేను నా పీజీ క్లాస్మెట్ రూపరాజు రవికాంత్ తో వెళ్లాను. మమ్మల్ని కలవడానికి , మాకు చక్కటి దర్శనం ఇప్పించడానికి ఉరవకొండ నుంచీ మిత్రుడు మాసినేని సుధాకర్, అతని శిష్యుడు లాయర్ సురేష్ వచ్చారు. అంతరాలయ దర్శనం దొరికింది. అక్కడి నుంచి క్రింద ఉన్న ఉధ్భవ లక్ష్మీ గుడి చూసాము. ఈ ట్రిప్ యొక్క విశేషం ఏమంటే ఈ పెన్నహోబిలం వద్ద ఉన్న బగిరి గుండ్లను చూడడం. ఇక్కడ ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ ఆకతాయిల ఆగడాలు ఉండేవట. ఇప్పుడు పోలీస్ out post పెట్టారు. ఈ ప్రాంతం అంతా చిట్టడివి. ఇక్కడే నరసింహ స్వామి మృగయా వినోదార్థం అడవి పందిని వేటాడాడు అని భక్తుల నమ్మకం. వేటాడి అడవి పంది మాంసాన్ని కుప్పలుగా పోసిన వైనం అక్కడి పూజారి చక్కగా చెప్పారు. అడవి పంది కోసం స్వామి దాక్కొన్న గుహను  నా చరవాణిలో బంధించాను . తరువాత మరో గుహలో స్వామి శిలా రూపంలో దర్శనం ఇచ్చాడు. ఆ గుహలో కూచుని నేనూ, నా మిత్ర బృందం విష్ణు సహస్రనామ పారాయణ చేసాము. చేస్తున్నంత సేపూ గుహలోపలి నుంచి ఏ ఎలుగ్గొడ్డు వస్తుందో అని నాకు ఒకటే భయం. అసలు స్వామికి ఈ వేట వ్యసనం ఎలా అంటుకుంది అని ఆలోచిస్తే, జీవులను వేటాడడం ఆయనకు వినోదం అని స్పురించింది. సుమారు ఒక నలభై నిమిషాలపాటు ఈ బగిరి గుండ్ల దగ్గర గడిపాము. ఇంస్టా లో రీలెట్టేసాను. అప్పుడే ఏడువేల మంది చూసేసారు. 

వర్షాకాలంలో పెన్నా నదిలో నీరు పోటెత్తినప్పుడు ఈ క్షేత్రాన్ని దర్శించడం ఒక మధురానుభూతిని ఇస్తుంది. అనంతపురం నుంచీ బళ్ళారి పోయే దావలో ఈ క్షేత్రం ఉంది. గుడి చుట్టూ ఉన్న అంగళ్ళలో బొరుగులను మిరపకాయ బజ్జీలతో కలిపి తింటే ఆ కారానికి నరసింహ స్వామి మరోసారి దర్శనం ఇవ్వడం ఖాయం. 

 NEWS CLIPPINGS -2026