Wednesday, February 26, 2025

                                                                    ప్రణయ హంపీ 



హంపీ పేరు తలుచుకుంటేనే నేనో  'చంద్ర ముఖుడిని' అయిపోతాను. అప్పుడే పుట్టి ఉంటే అని అనేక సార్లు ఆక్రోశించాను. నా మొదటి క్రష్ మరియు చివరి క్రష్ హంపీనే అని ఘంటాపథంగా చెప్పగలను. ఎవరైనా వ్యక్తులతో ప్రేమలో పడతారు. నేను మాత్రం హంపీ అనే ప్రదేశం తో ప్రేమలో పడ్డాను. ఇంతా చేస్తే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అదో శిథిల నగరమే. ఈ శిథిల నగరాన్ని నా వయసు శిశిరం లో ఉండగా చూడడం జరిగింది. చిన్నప్పటి నుంచి నాకు హంపీ పేరు కన్నా ఆనేగొంది పేరు సుపరిచితం. దానికి కారణం అది మా పితామహి స్వంత ఊరు. ఆమె బాల్యం లో ఆనేగొంది పాఠశాలలో చదువుకునేటప్పుడు, కొన్ని కారణాల వల్ల ఆమె చదవలేక పలక, బలపం మరియు ఇతర చిన్నా చితకా పుస్తకాలను తుంగభద్ర లో గిరాటేసిందని నాకు చెప్పేది. అంటే ఆమె చదువును తుంగభద్ర మింగేసింది. ఇలా నేను మా పాటి (అవ్వ) ద్వారా ఆనేగొంది పేరు బాల్యం లోనే విన్నాను. కానీ విధి విలాసమేమో మరి నేను ఇంతవరకు ఆనేగొందిని చూడలేకపోయాను. హంపీనే వృద్ధాప్యం లో చూసిన నేను, ఆనేగొంది నగరం లోకి ప్రవేశించలేకపోయినప్పటికీ, పుట్టి లో తుంగభద్ర దాటి నవ బృందావన వరకు వెళ్లాను. హంపీకి మాత్రం 50 ఏళ్ల వయసు మీద పడిన తరువాత ఐదు సార్లు వెళ్లి ఉంటాను. 

హంపీ లో పుట్టిన ప్రతి ఒకరు నా దృష్టిలో అదృష్టవంతులు. ఈ నిర్ణయానికి నేను రావడానికి కారణం తిరుమల రామచంద్ర రాసిన 'హంపీ నుంచి హరప్పా దాకా' అన్న పుస్తకం. ప్రతి విద్యార్థి చదివి తీరవలసిన పుస్తకాలలో ఇది ఒకటి. నేను ఇప్పటికే రెండు సార్లు చదివాను. మొదటి సారి యుక్త వయసులో ఉండగా చదివాను. రెండో సారి 53 ఏళ్ల వయసులో చదివాను. తిరుమల రామచంద్ర గారి లాగా దేశమంతా తిరగాలనే వ్యామోహం నాకూ  ఉంది. కానీ కొన్ని పరిమితుల కారణంగా ఒక నిర్ధిష్ట ప్రాంతానికే అంటిపెట్టుకుని జీవిస్తున్నాను. పరిస్థితుల గురుత్వాకర్షణ నుంచి బయట పడలేకున్నాను. అలా పరిస్థితులకు తలవంచడం లో కూడా ఎంతో మాధుర్యం ఉందనుకోండి. 

ఇలా హంపీ తో నా రొమాంటిక్ జర్నీ కొనసాగిస్తుండగా కొన్ని రోజుల క్రితం ఒక అద్భుతం  జరిగింది. మిత్రుడు ఆనంద భాస్కర్ మా ఇంటికి వచ్చినప్పుడు, అతనికి నా వద్ద ఉన్న 'హంపీ నుంచి హరప్పా దాకా' పుస్తకం చదవడానికి ఇచ్చాను. నేను చదివిన పుస్తకాలను, వీలైనంత మందితో చదివించడం నాకు ఇష్టం మరి. ఆ పుస్తకాన్ని అందుకున్న ఆనంద భాస్కర్, అతని మిత్రుడు మారుతీ పౌరోహితం గారు రాసిన 'ప్రణయ హంపీ' నవల గురించి నాతో ప్రస్తావించాడు. అలా ప్రణయ హంపీ పేరు నేను వినడం తటస్థించింది. ప్రేమ కథలో ఎన్నో కాకతాళీయాలు ఉన్నట్టే, తరువాత కొన్ని రోజులకు జరిగిన కథా కార్యశాలలో రచయిత మారుతి పౌరోహితం గారి చేతుల మీదుగా ప్రణయ హంపీ పుస్తకం ఫిబ్రవరి 23,2025 న నాకు అందింది. తరువాత మూడు రోజులకు వచ్చిన శివరాత్రి పర్వ దినాన ప్రణయ హంపీ చదవడం మొదలెట్టి, ఆ రోజే ముగించాను. ఈ పుస్తకం చదవడానికి ముందే నేను హంపీ చూసి ఉండడంతో ఆ పుస్తకంతో బాగా కనెక్ట్ అయిపోయాను. ఈ నవలలో విజయనగర విస్తృతి, వైభవం అన్నిటినీ ఆవిష్కరించిన తీరు అద్బుతం. హంపీ చూడని వారు సైతం ఒక ట్రాన్స్ లోకి వెళ్లిపోతారు. నేనైతే విజయనగర చరిత్ర తో సంబంధం ఉన్న పెనుకొండ, చంద్రగిరి లాంటి ప్రదేశాలు కూడా చూసి ఉండడంతో, ఈ నవల చదివేటప్పుడు అనుభూతి ఐక్యతను పొందాను. 

దీనిలో కథాంశం సంబజ్జ గౌడ మరియు ముద్దు కుప్పాయి ల ప్రేమ. వారి ప్రేమ చిగురించి, బలపడుతున్న సమయంలోనే రక్కసి తంగేడి యుద్దం జరగడం, దానిలో సంబజ్జ గౌడ పాల్గొనాల్సి రావడం నవల లో ఒక ప్రధాన మలుపు. చారిత్రక నేపథ్యంలో కల్పనా పాత్రలను సృష్టించి, వాటిని, చారిత్రక స్పూర్తి మరియు దీప్తి చెడకుండా, ఆ దేశ, కాలమాన పరిస్థితులలో వాటిని తిప్పడం లో రచయిత అనితర సాధ్యమైన ప్రజ్ఞను ప్రదర్శించారు. ఈ నవల చదువుతున్నంత సేపు పాఠకుడు ముద్దుకుప్పాయి, సంబజ్జ గౌడ ల ప్రేమ ఫలిస్తుందో, లేదో అనే ఆందోళన కు గురవుతాడు. ప్రేమలో, యుద్ధం లో ఎవరు గెలుస్తారో చెప్పలేము కదా!!! యుద్దాలలో ముగిసిపోయిన ప్రేమ కథలు ఎన్నో ఉన్నట్టే, యుద్దాలకు దారి తీసిన ప్రేమ కథలు కూడా ఉన్నాయి. కానీ ఇది యుద్ధ నేపథ్యం లో సాగే ప్రేమ కథ, ప్రేమ ఆయుధంగా సాగే యుద్ధ కథ. 

మరో విచిత్రం ఏమంటే ప్రధాన పాత్ర అయిన సంబజ్జ గౌడ విస్తృతి దీనిలో చాలా తక్కువగానే ఉంది. కానీ కథ మొత్తం ఆ పాత్రే పరుచుకుని కనపడుతుంది. కథ మొదట్లో దున్నపోతు ను నరికేటప్పుడు దాని మూపురం క్రింద ఉన్న మెడ మందాన్ని అంచనా వేసి, ఎంతో ఒడుపుతో కత్తిని దింపి మహిషాన్ని తుదముట్టించిన సంబజ్జ గౌడ రక్కసి తంగేడి యుద్దం లో అళియ రామరాయలను రక్షించాలనే స్వామి భక్తి తో ముందూ, వెనుకా చూడకుండా మద గజాన్ని ఎదుర్కోవాలనుకోవడం అతని పరోపకార పరాయణతకు పరాకాష్ట. యుద్ధ సమయంలో సంబజ్జ గౌడ మనస్థితి కళింగ యుద్ద సమయం లో అశోకుడిని గుర్తుకుచేస్తుంది. యుద్ధం గురించి చదువుతూ ఉంటే ఎవరి గెలుపోటములతో యుద్దానికి పనిలేదని అర్థమవుతుంది. యుద్ధ కాంక్ష రాజ్య దాహం వలన వస్తుంది. అన్ని రాజ్యాలు యుద్ధాల వల్ల కూలిపోతాయి. చదరంగం లో చచ్చేది బంట్లే అన్నట్టుగా ఏ యుద్ధం లోనైనా నష్టపోయేది సామాన్యులే. ఈ విషయం ఈ రాక్షస తంగేడి యుద్దం లో కూడా నిరూపించబడింది. అళియ రామరాయలు మరణం తరువాత తిరుమల రాయలు కోశాగారం లో నున్న సంపదను పెట్టెలలో పెట్టుకుని ఏనుగుల మీద పెనుగొండకు తరలిపోతాడు. హంపీ మాత్రం హాళు హంపీ గా మిగిలిపోతుంది. అవని గోపాలయ్య శెట్టి లాంటి వణిజులు ఏ ఆదవానికో తరలిపోగలరు. కొద్ది పాటి సంపద ఉన్న ఏ సలకం తిమ్మయ్య లాంటి వాళ్లో దేవతార్చన గృహం లో గొయ్యి తీసి మట్టి కుండలో దాన్ని కప్పెట్టగలరు. కానీ హంపీ నే నమ్ముకున్న సామాన్య ప్రజలు తమ కొంపలు వదిలేసి అడవులలో ఉన్న గుహలలో తలదాచుకున్నారన్న వాస్తవం పాఠకుడికి కన్నీరు తెప్పిస్తుంది. సామాన్యుడి పట్ల సానుభూతి కలిగి పాఠకుడి కళ్లలో తుంగభద్ర పోటెత్తుతుంది. 

యుద్దము, ప్రేమా పడుగు పేకగా సాగే ఈ కథను చదువుతూ, నా ఊహా ప్రపంచం లో ఆవిష్కరిచుకున్న విజయనగర సామ్రాజ్యం లో కొన్ని చోట్ల కాస్త ఎక్కువ సేపు విహరించాను. అలా కాస్త ఎక్కువ సేపు విహరించిన లేదా ఆగిన ప్రదేశాలలో ఒకటి సూలే బజారు. పేరే విచిత్రం. ఈ పేరు చాలు విజయనగర సామ్రాజ్యం లో తీరిక వర్గాలకు ఎంత భోగ లాలసత ఉండేదో తెలియడానికి. సూలే బజారు లో కనిపించేది కేవలం విట కోలాహలం. సానులలో కూడా  తారతమ్యాల నిచ్చెన మెట్లు ఉండేవి. ధనికులైన సానులు చాలా ప్రజోపకర కార్యక్రమాలు చేపట్టేవారు. వారు సంపాదించిన సొమ్మును దైవ కార్యాలకు కైంకర్యంగా ఇచ్చేవారు. గుళ్లకు మాన్యాలు ఇచ్చేవారు. దేవాదాసీ వ్యవస్థ అప్పటికే వేళ్ళూనుకుని ఉంది. ఏదో పుస్తకం లో చదివాను.. అప్పటి ఒంటి మిట్టలో శాపానుగ్రహ సమర్థురాలైన ఒక సిద్ద సాని ఉండేదని. ఎంతవరుకు నిజమో విజ్ఞులకు ఎరుక. నాకేమెరుక? 

వలంది అనే పడుచు పాత్ర ఈ కథ లో పాఠకుల అందరి సానుభూతిని పొందుతుంది. ఈమె ఒక వేశ్య. వేశ్యల లో కూడా ఉన్నత భావాలు ఉన్నవారుంటారని వలంది పాత్ర ద్వారా తెలుస్తుంది. ఈ వలంది కి యజమానురాలు (దొరసాని అనొచ్చా) నాగసాని. అప్పటి విజయనగర చరిత్రలో సానుల స్థితి గతులను వలంది పాత్ర ద్వారా రచయిత చెప్పించి మెప్పించారు. ఈ సుకుమార వార వనితల యాతన యుద్ద సమయం లో ఎలా ఉండేదో తెలిసి వచ్చి అప్పటి రాజుల పట్ల జుగుప్స వస్తుంది. ఎవరి పరిపాలనలో కూడా అన్ని వర్గాలు సుఖపడిన దాఖలా చరిత్రలో ఎక్కడా కనపడదు. దోపిడి వర్గాలు మారతాయి. దోపిడి మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. అప్పట్లో వేశ్యలు చాలా మంది సాహిత్య పరిజ్ఞానం ఉండేవాళ్లే. వలందికి కూడా ఆమె యజమానురాలు చదవు నేర్పింది. వలంది యజమానురాలు నాగసాని వీణ వినసొంపుగా వాయించేదట. ఏది ఏమైనప్పటికీ అలా సూలే బజారులో నిలిచిపోయిన నా మనస్సుకు ఆ బజారు మొత్తం నట విట గాయక సమ్మిళితంగా తోచింది. వలంది చెప్పిన విషయాలు చదివితే అప్పటి వేశ్యల పరిస్థితికి పాఠకుడు కదిలిపోతాడు. పన్నెండు సంవత్సరాల వయసులోనే కన్యలు ఈ వృత్తిలోకి ప్రవేశించేవారు అప్పట్లో. Prostitution is the oldest trade అనేది నాకు అర్థం అయ్యింది. చైత్ర మాసం లో పౌర్ణమి రోజు అద్దం చూసుకోవడం అనే క్రతువు ద్వారా కన్యలు వేశ్యా వృత్తిలోకి ప్రవేశించేవారని వలంది చెపుతుంది. ఈ అద్దం చూసుకోవడాన్ని 'ముద్రాధికోత్సవం' అనేవారు. మరో వైచిత్రి ఏమంటే ఈ అద్దం మీద కూడా పన్ను ఉండేది అప్పట్లో. వేశ్యలు అద్దం చూసుకున్నందుకు కట్టే పన్నును 'సులేధం' అనే వారని ఒక కథలో వంశీ (పసలపూడి  కథలలో అనుకుంటా ) ప్రస్తావించారు. వేశ్యా వృత్తి మీద పన్ను కాకుండా, ఈ అద్దం పన్నును అదనంగా చెల్లించాలి మరి. ప్రజలను ఆపన్నులుగా భావించి ఆదుకోవాల్సిన మహారాజులే, ఆ పన్నులు, ఈ పన్నులు వేసి ప్రజల నడ్డిని నడి వీధుల్లో విరిచారు మరి. కానీ అప్పటి బజారుల్లో రత్నాలు రాశులు పోసి అమ్మారు. ఏ చారిత్రక నగరాల్లో అయినా సరే బజార్లు బలిసి కొట్టుకుంటూ కనిపిస్తాయి. ముప్పై ఆరు రకాల పన్నులు వేసేవారట విజయనగర రాజులు. అప్పట్లో వేశ్యలకు ఎంత సాహిత్య పరిజ్ఞానం ఉండేది అంటే వారిలో కొద్ది మంది కావ్య రచన కూడా చేశారు. గణికలు చెరువులు తవ్వించారు, దేవాలయాలు కట్టించారు. 

యుద్దం లో సైనికుల శారీరిక అవసరాలను తీర్చడానికి వేల మంది వేశ్యలను  యుద్ధ భూమికి బలవంతంగా తరలించేవారు. కొన్ని లక్షల మంది సైన్యం, వేల సంఖ్య లో ఉన్న వేశ్యల మీద ఆధారపడితే , వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో ఆలోచించినప్పుడు మాత్రం అప్పట్లో పుట్టకపోవడం మంచిదయ్యింది అని నిట్టూర్చాను. ఇలా హంపీ లో పుట్టిఉంటే బాగుండేదనే నా పూర్వపు ఆలోచన నుంచి విముక్తి పొందాను. 

సైనికుల వికృత, విపరీత ప్రవర్తన వల్ల తనువు పుండై, కాదు.. కాదు.., తనే ఒక పుండై వలంది వడలి రాలి పోతుంది. సంబజ్జ గౌడ, ముద్దుకుప్పాయిల పరిణయాన్ని కళ్లారా చూడాలనే ఆకాంక్ష తీరకనే వలంది కళ్లు మూస్తుంది. "అసలు వేశ్యల మీద హక్కు సైనికులకు ఎవరిచ్చారు?" "యుద్ధ ఖైదీలకు కూడా ఇలాంటి అమానవీయ అనుభవాలు ఎదురుకావు కదా?" లాంటి ప్రశ్నలు ప్రణయ హంపీ చదువుతుంటే పాఠకుల మదిని తొలుస్తాయి. 

ముద్దు కుప్పాయి నాట్యం లో దిట్ట. కూచిపూడి భాగవుతుల కుటుంబం ఆమెది. ఆమె పూర్వీకులు దేశ దిమ్మరులుగా వచ్చి విజయనగర లో స్థిరపడతారు. రంగనాథుడికి ముద్దు కుప్పాయి పుష్ప కైంకర్యం చేస్తున్న ఘట్టం చదువుతుంటే 'ఆముక్తమాల్యద' లోని 'చూడి కుడుత్త నాచ్చియార్' కాస్త తొంగి చూసినట్టు అనిపిస్తుంది. దానికి నేను పెరిగిన నేపథ్యం కారణం కావొచ్చు. 

యుద్ధం లో సంబజ్జ గౌడ పాల్గొనే ఘట్టాలు చదువుతూ ఉంటే, ఆ కదన రంగం లో కూడా వీర రసాన్ని, కరుణ రసం అధిగమించిందని  చెప్పవచ్చు. ఆ యుద్ధ వర్ణన చదువుతుంటే నాకు కూడా పుస్తకం వదిలేసి "గరుడ, గరుడ" అని రంకెలేసుకుంటూ ఉరకాలనిపించింది. ఆలీ ఆదిల్షా నిస్సహాయత ఒక మహా సామ్రాజ్యాన్ని నేలమట్టం చేసిన తీరు తలుచుకుంటే, అతని పట్ల కోపం కంటే కూడా సానుభూతే ఎక్కువ కలుగుతుంది. హుసేన్ నిజాం షా అళియ రామరాయల తలను ఉత్తరించిన తీరు కనులకు కట్టి మనసు కకావికలు అవుతుంది. నెత్తురు తో కలిసి ప్రవహిస్తున్న తుంగభద్ర తీరం వెంబడి గుర్రం మీద స్వారీ చేస్తూ రణ క్షేత్రం నుంచి తప్పించుకు వెళ్లిపోతున్న తిరుమలరాయల రూపు ఇప్పటికీ సజీవంగా దర్శనమిస్తుంది. ఇక్కడితో మాత్రమే ఆగిపోయి ఉంటే ప్రణయ హంపీ ప్రళయ హంపీ లాగా మారిపోయేది. కానీ యుద్దం లో విజయ నగర రాజులు ఓడిపోయినా కూడా సంబజ్జ గౌడ మరియు ముద్దుకుప్పాయిల కథ సుఖాంతం కావడం వలన నవల చదువుతున్న పాఠకుడి కి సానుభూతి కన్నా కూడా రసానుభూతి ఎక్కువగా కలుగుతుంది. ఏ నవలకైనా కూడా రస సిద్దే ప్రధాన ఉద్దేశ్యం. చాంద్ బాడి తవ్వకం లో యుద్ధ ఖైదీ గా నియమించబడిన సంబజ్జ గౌడను ముద్దు కుప్పాయితో సూఫీ భావాలున్న సల్మాన్ అహమ్మద్ ఫరూకి కలపడం వలన  అన్ని మతాల, భావజాలాల మధ్య సమన్వయం కుదిరిన అనుభూతి పాఠకుడికి కలుగుతుంది. 

ప్రణయ హంపీ చదివిన తరువాత హంపీ పట్ల నా ప్రేమ ముదిరి పాకానికి పడింది. ఇప్పుడు నేను ఒక సగటు పాఠకుడిని కాను. ఇప్పుడు నేనో రస సిద్దుడిని. ఈ సారి హంపీకి వెళ్లినప్పుడు ఆనేగొంది ని దర్శిస్తాను. రాక్షస తంగేడి యుద్దం జరిగిన ప్రాంతానికి కూడా వెళతాను. యుద్దాలు చేసిన గాయాలకు ప్రేమ మలాములు పూస్తూ, సూలే బజార్, విఠ్ఠల్ బజార్, విరూపాక్ష స్వామి దేవాలయం అన్నిటినీ చుట్టబెట్టేస్తాను. హాళు హంపీ ని ప్రణయ హంపీ గా మారుస్తాను. 

Sunday, February 23, 2025

                                                                   కథా కార్యశాల 




అనంతపురం లోని లలిత కళా పరిషత్ లో ఈ రోజు హిందూపురం మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రగతి మేడం ఆధ్వర్యంలో కథా కార్యశాల జరిగింది. సుమారు 20 మంది వరకు ఔత్సాహిక రచయితలు కథలు రాయడంలో ఒడుపులు నేర్చుకోవడానికి సదస్సుకు వచ్చారు. ఉదయం 10 గంటలకు కథా రచయిత సింగమనేని నారాయణ గారి చిత్రపటానికి పూలమాల వేసి, నివాళి సమర్పించడంతో కార్యశాల మొదలయ్యింది. ప్రముఖ రచయితలు కెంగార మోహన్, వేంపల్లి షరీఫ్, శశికళ, శ్రీనివాస మూర్తి మరియు మారుతి పౌరోహితం కథా రచనలో ఉన్న మెళుకువలు నేర్పడానికి శిక్షకులుగా విచ్చేసారు. 

మొదటగా వేంపల్లి షరీఫ్ కథా రచనకు సంబంధించి ఈ క్రింది అంశాలు తెలియజేసారు. 

  • కథకు ప్రధానమైన ముడి సరుకు జీవితం. రచయిత తన జీవితం నుంచి గానీ, చుట్టూ ఉన్నవారి జీవితాల నుంచి గానీ కథకు, కథనానికి కావలసిన ముడిసరుకును గ్రహించాలి. 
  • కవిత్వం ఆవేశం నుంచి వస్తే, కథ ఆలోచన నుంచి వస్తుంది. 
  • కథను కదిలించేది సంఘటన 
  • కథా ప్రారంభం ఆసక్తి కలిగించేలా, ముగింపు ఆలోచింపజేసేలా ఉండాలి. 
  • ఎవరైనా సరే టెక్నిక్ ను manage చేయగలిగితే మంచి కథ రాయవచ్చు. కథను మలుపు తిప్పే ఒడుపే టెక్నిక్ అంటే. 
  • నిజానికి కథకు, కవితకు క్లుప్తత గుండెకాయ లాంటిది. 
  • రచయితకు పాత్ర స్వభావం గురించి స్పష్టత ఉండాలి. 
  • పాత్రకు తగిన కంఠ స్వరం ఉండాలి. 
  • అన్నిటికంటే ముఖ్యంగా రచయిత కథను ప్రేమించాలి. 
  • ఇప్పుడున్న Busy life లో కథాంశం దొరకడమే కష్టం. 
  • పదాలలో లయ ( rhythm ) ఉంటే పాఠకులు పట్టుకోగలగుతారు. 
  • కథ కు ప్రధానమైన ఉద్దేశ్యం అనుభూతి ఐక్యత
  • రావి శాస్త్రి పేర్కొన్నట్టుగా కథ రాసేటప్పుడు ఏ మంచికి చెడు చేయకు, ఏ చెడుకు మంచి చేయకు. 
వేంపల్లి షరీఫ్ గారు  దేశ విభజన నేపథ్యంలో రాసిన "రావి పారా" అనే కథ గురించి హృద్యంగా వివరించారు. 















రెండవ సెషన్ లో శశికళ మేడం గారు రాయలసీమ కథల గురించి ప్రస్తావించారు. రాయల సీమ నీళ్లకు, కథలకు ఏదో పీట ముడి పడిపోయింది అన్నారు. ఈమె ప్రస్తావించిన మరి కొన్ని అంశాలు ఈ క్రింద పేర్కొంటున్నాను. 

  • కథ అంటే పిప్పరమెంటు చప్పరించినట్టు ఉండాలి. 
  • కథ ఒక్కోసారి వెర్రి కుక్కలా వెంటబడుతుంది 
  • రాయలసీమ లో శ్రామిక వర్గాలు ఎక్కువ కథలను సృష్టించాయి. 
  • కడప జిల్లా రచయిత కేతు విశ్వనాథ రెడ్డి రచించిన 'నమ్ముకున్న నేల', 'గడ్డి' కథలను చక్కగా విశ్లేషించారు. 
  • చిత్తూరు  జిల్లా రచయిత మధురాంతకం రాజారాం పేర్కొన్నట్టుగా కథకులు ఎప్పుడూ దొంగ చూపులు చూస్తుండాలి అని చెప్పారు. మధురాంతకం రాజారాం మూడు వందల కథలు రాసారు. చిత్తూరు జిల్లా నాకు తెలిసినంతవరకు కథల కాణాచి. బాపూ, రమణ లను సైతం మైమరిపించిన నామిని రాసిన మిట్టూరోడి కథలు నేను కూడా చదివాను. తిరుపతి లో చాలా కాలం కాపురమున్నా కూడా నాకు నామినిని  కలిసే అదృష్టం పట్టలేదు. మధురాంతకం నరేంద్ర రాసిన మనోధర్మ పరాగం నవల కూడా నేను మూడు రోజుల్లో చదివేసాను. అంతెందుకు తిరుపతి లో నాకు తెలిసిన మరో రచయిత పేటా శ్రీ. ఈయన రాసిన తిరుపతి కథలు, కొండ కథలు చదివితే వేంకటేశ్వర స్వామి కళ్యాణం లడ్డు చప్పరించినంత కమ్మగా ఉంటాయి. 
  • మధురాంతకం రాజారాం రాసిన జీవన్ముక్తుడు గురించి చక్కగా వివరిస్తూ శశికళ గారు రచయిత సామాన్యుడి వైపు నిలబడడం శ్రేయస్కరం అన్నారు. 
  • కర్నూల్ జిల్లా రచయిత శ్రీనివాస మూర్తి గారి కథల గురించి ప్రస్తావించారు. 
  • అనంతపురం జిల్లా రచయితలు సింగమనేని రాసిన 'మకర ముఖం' , బండి నారాయణ స్వామి రాసిన 'నీళ్ల కథలు' లాంటి వాటిని సామాజిక మరియు ఆర్థిక కోణాలలో విశ్లేషించారు. 
  • శశికళ గారు "మహిళ రాయడం అంటే, తల్లి రాయడమే' అన్నమాట శ్రోతలకు హత్తుకుపోయింది. 
  • గల్పిక గురించి నేను మొదటిసారి ఈ సదస్సులో వినడం జరిగింది. గల్పిక లో హాస్యం మరియు వ్యంగ్యం ఉంటాయట.  
మద్యాహ్నం భోజన విరామం ఇచ్చారు. ఇక్కడ ప్రదర్శనలో పెట్టిన ఆరుద్ర రాసిన "కాబోయే కథకులకు పనికొచ్చే చిట్కాలు"  పదిహేను రూపాయలు పెట్టి కొన్నాను. 

భోజనానంతరం శ్రీనివాస మూర్తి గారి సదస్సు జరిగింది. ఇది జరిగేటప్పుడే ప్రగతి మేడం గారు అందరినీ రౌండ్ టేబల్ తరహాలో కూచోపెట్టారు. ఈ round table సమావేశం జరుగుతుండగానే, పై కప్పు పెచ్చు ఊడి అందరి మధ్యలో ఉరుమురిమి పెనం మీద పడినట్టు పడింది. ఆ పెచ్చు మామూలు పెచ్చు కాదు. అది concrete slab. నా లాంటి తల లేని వాళ్ల మీద పడితే పర్లేదు కానీ, ఔత్సాహిక రచయితల తలల మీద పడి ఉంటే చాలా కథలను సమాజం కోల్పోయేది. ఇక లోపలే సదస్సు కొనసాగితే తిరిగి ఏ పెచ్చో మీద పడే ప్రమాదం ఉందని, అప్పుడు అది anti climax అవుతుందని భావించి అందరం బయటకు వెళ్లి కూచున్నాము. శ్రీనివాస మూర్తి గారు ఈ క్రింది అంశాలు ప్రస్తావించారు. 

  • స్పురించిన భావనలను వెంటనే document చేసుకోండి. 
  • రష్యన్ రచయిత మైకో విస్కీ ప్రకారం రచయిత అవడానికి నిబంధనలు అంటూ ఏమీ లేవు. 
  • భిన్న రచయితలు భిన్న మార్గాలలో ప్రవేశిస్తారు. 
  • సాధన వల్లనే కథలో పరిణితి వస్తుంది. 
  • రచయితకు నిషిద్ధ వస్తువు అంటూ ఏమీ లేదు. 
  • సాహిత్యం లోని ఏ వనరైనా కథ రాయడానికి ఉపయోగపడుతుంది. 
  • రాయడం మొదలెడితేనే మంచి కథను సృష్టించగలరు. 
  • కథను బాగా రాయడానికి వయసు ద్వారా వచ్చే పరిపక్వత ఉపయోగపడుతుంది. వయో పరిపాకం లేని రచయితలు కొన్ని రసాలను పండించడం లో లౌల్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. 
  • కథా రచయిత భారత దేశం అనేక జాతుల సమాఖ్య అని మరువకూడదు. ఏ  జాతి ఆత్మ గౌరవాన్ని భంగపరిచే రీతిలో కథలు రాయకూడదు. 
  • కథను judge చేసే మంచి పాఠకుడు ప్రతి రచయితకు అవసరం. 
  • కథలో ఉటంకించిన సంఘటన పూర్వ చరిత్ర తెలుసుకుంటే, కథాంశానికి పరిపుష్టత వస్తుంది. 
  • రచయిత ఎప్పుడూ కూడా సాధ్యం కాని ముగింపులు ఇవ్వకూడదు. 
  • రచయితకు అన్ని ప్రజా ఉద్యమాల పట్ల అవగాహన ఉండాలి. రాజ్యాంగాన్ని కాపాడడం కూడా రచయితల కర్తవ్యం. మారుతున్న సామాజిక మరియు ఆర్థిక పరిణామాలను గుర్తించకుంటే, రచయిత వెనకపడతాడు. 
  • ఈ కాలం లో బాల్యం నుంచీనే మనిషి ఒంటరి వాడవుతున్నాడు. కాబట్టి బాల సాహిత్యం సృష్టించాలి. 
  • రచయితకు దృక్పథం ముఖ్యం. 
  • ఏ అనుభవం, అనుభూతి వృధా పోదు. 
  • మంచి కథ రాయడానికి triggering point దొరికే వరకు, ఏళ్ల కొద్ది అయినా సరే వేచి ఉండే ఓపిక రచయితకుండాలి. 
  • రచన సామాజిక ఉత్పత్తి. అంతరంగ పరిణితి లేకుండా మంచి కథ రాయలేరు. 
  • ఇక్కడ ఒక రహస్యం చెప్పారు. మనకు వచ్చే ఆర్థికేతర సమస్యలన్నీ స్వయంకృతాలే అన్నారు. 
  • మీ కథకు మీరే అంతిమ నిర్ణేతలు. 
  • నమ్మకం ఎక్కడో ఒక చోట ఆగి, reasoning ప్రవేశించాలి. 
  • కథ ఎప్పుడూ oppressed of most oppressed వైపు వకాల్తా పుచ్చుకోవాలి.  కథ కేవలం reporting లా పేలవంగా ఉండకూడదు. మరో విశేషం కూడా చెప్పారు. అదేమంటే "writer is going to be educated by his own writings" . ఈ వాక్యం నా స్వీయానుభవం. 
చివరగా ప్రణయ హంపీ  రచయిత మారుతీ పౌరోహితం చక్కగా ప్రసంగించారు. ఆయన ఈ నవల రాయడానికి చేసిన పరిశ్రమ గురించి చక్కగా చెప్పారు. ప్రణయ హంపీ రచన చదివి హంపీ రాజమాత ఆనేగొంది కి పిలిచి ఆయనను సన్మానించిన తీరు గురించి వివరించారు. ప్రణయ హంపీ నవల లోని పాత్రలకు పేర్లు పెట్టడానికి మారుతి గారు కన్నడ భాషా శాసనాలను కూడా చదివారట. వెయ్యి పేజీల నోట్స్ తయారుచేసుకున్నారట. నేను ఈ ప్రణయ హంపీ పుస్తకం గురించి మొదటగా  నా మిత్రుడు ఆనంద భాస్కర్ చెపితే విన్నాను. విచిత్రంగా ఈ ప్రణయ హంపీ పుస్తకం ప్రస్తావన వచ్చినప్పుడే మిత్రుడు ఆనంద భాస్కర్ సదస్సుకు విచ్చేశారు. నేను కూడా హంపీ తో ప్రేమలో పడిన తీరు తెలుసుకుని మారుతీ పౌరోహితం గారు నాకు ప్రణయ హంపీ పుస్తకాన్ని బహుకరించారు. 

చివరగా ఫిల్మ్ ప్రొడక్షన్ లో ఉన్న రషీద్ మరియు ఆనంద భాస్కర్ మాట్లాడారు. కెంగార మోహన్ గారు ఎవరైనా రచనలు పంపితే ప్రస్థానం పత్రిక లో పరిశీలించి ప్రచురించుకునే అవకాశం ఉందని తెలియజేసారు. 

చివరగా ప్రజాశక్తి రవిచంద్ర వందన సమర్పణ చేసారు. ఫోటోస్ పంపిన యూసఫ్ గారికి ధన్యవాదాలు. 

ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్మాణాత్మకంగా నిర్వహించిన ప్రగతి గారికి కైమోడ్పులతో ముగిస్తున్నాను. 






Saturday, February 22, 2025

 APTWRS For Girls,  (AP Tribal Welfare Residential School for Girls), Navodaya Colony, Ananthapuramu







కొత్త విద్యార్థులను కలవని రోజు నా దృష్టిలో వృధా. రేపు గ్రూప్ II పరీక్షలు ఉండడంతో మా కళాశాలలో క్లాస్ వర్క్ రద్దు చేయబడింది. కానీ నేను మాత్రం దీనిని సద్వినియోగం చేసుకున్నాను. ANSET వాళ్లు  అనంతపురం నవోదయ కాలనీ లో ఉన్న AP Tribal Welfare School for Girls లో నా  కార్యక్రమం ఏర్పాటుచేసారు. చక్కటి భద్రమైన వాతావరణం ఈ పాఠశాల లో కనపడింది. ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్న పార్వతీ మేడం సుమారు వంద మంది విద్యార్థినులను నా క్లాస్ లో కూచోపెట్టారు. వారికి ఈ క్రింది విషయాలు నేను బోధించాను. 
  • ఆంగ్లం మరియు ఆంధ్రం రెండూ చక్కగా నేర్చుకోండి. ఒక భాష మీద సాధికారత వస్తే చాలు, మిగిలిన భాషలు నేర్చుకోవడం సులభమవుతుంది. 
  • భావోద్వేగాల మీద కూడా పట్టు సాధించండి. 
  • సమస్య వచ్చినప్పుడు ఏడుస్తూ కూచోకుండా, నిర్మాణాత్మకంగా ఆలోచించండి. 
  • చేతి రాత ద్వారా మీ తల రాత మార్చుకోవచ్చు. 
  • తెలుగు పద్య, వచన సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేయండి. 
  • రోజుకు పది కొత్త ఆంగ్ల పదాలను నేర్చుకోండి. 
  • కొత్త భాషలను నేర్చుకోవడానికి ఉత్సాహం చూపండి. 
  • మూఢ నమ్మకాలకు లొంగకండి 
  • వినండి.. చదవండి.. రాయండి. మీ జీవితం మారకుంటే నన్నడగండి 
  • రేడియో లో వార్తలు మరియు ఇతర మంచి కార్యక్రమాలు వినండి. 
  • "మీ రక్షణ మీ కర్తవ్యం" అని మరవకండి. ఈ సందర్భంగా జూడో నేర్చుకున్నామని విద్యార్థినులు నాతో చెప్పడం నాకు ఆనందాన్ని కలిగించింది. 
  • చాటింగ్ చేస్తే చీటింగ్ కు అవకాశం ఇచ్చినట్టే. 
  • సైన్స్ పాఠాలు అర్థం చేసుకుంటూ చదవండి. 
  • గణితం ను నిర్లక్ష్యం చేయకండి. లెక్కలు నేర్చుకుంటే, లెక్కలేనన్ని విజయాలను మీరు సాధించవచ్చు. 
ఇలా సుమారు గంట సేపు పిల్లలతో నేను ముచ్చటించాను. ఈ కార్యక్రమం లో విద్యార్థినులు చూపించిన ఉత్సాహం నేను ఎప్పటికీ మరువలేను. అన్నట్టు చెప్పడం మరిచాను. ఈ రోజు కూడా నేను మా మీడియా సెంటర్ లో ఒక వీడియో పాఠం రికార్డు చేసాను. 
                              Thus I spent one more day in constructive manner. 

Friday, February 21, 2025

 AP SOCIAL WELFARE SCHOOL, ROTARY PURAM 

&

ZPHS, KORRAPADU 













ఈ రోజున  ( ఫిబ్రవరి 21, 2025 ) వంద మంది విద్యార్థులను కలిసే అవకాశాన్ని ANCET అధికారులు నాకు కల్పించారు. మిత్రుడు చిగిచెర్ల శ్రీనివాసులు మరియు మేనేజర్ సునీల్ కుమార్ రెడ్డి తో పాటుగా ఉదయం 10.15 కు కొర్రపాడు జిల్లా ఉన్నత పాఠశాలకు చేరుకున్నాను. క్యాంపస్ చాలా ఆహ్లాదకరంగా మరియు శుభ్రంగా ఉంది. పిల్లలను ఒక రూములో కూచోపెట్టారు. నైపుణ్యాభివృద్ధి గురించి మేమంతా మాట్లాడాము. వాసంతి అనే అమ్మాయి చక్కటి సమాధానాలు ఇవ్వడం వలన రెండు వందల రూపాయల నగదు బహుమతి నేను, సునీల్ కుమార్ రెడ్డి సర్ కలిసి ఇచ్చాము. 

కొర్రపాడు నుంచి రోటరీ పురం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కు చేరుకున్నాము. లైబ్రరి హాలు లో ఎనభై మంది విద్యార్థినులు చక్కగా ఒక వరుస క్రమం లో కూచున్నారు. సునీల్ కుమార్ సర్ career orientation గురించి చక్కగా వివరించారు. నేను ఈ సారి వ్యూహం మార్చి నైపుణ్యాభివృద్ధి గురించి చెపుతూనే, అమ్మాయిలు తమను తాము ఏ విధంగా రక్షించుకోవాలనే విషయం గురించి వివరించాను. 

  • సామాజిక మాధ్యమాలలో క్రియాశీలకంగా ఉండకండి. 
  • మీ ఫోటో ను పంచుకోకండి 
  • అపరిచుతులతో చాటింగ్ చేయకండి 
  • చాలా విషయాలలో NO చెప్పడం నేర్చుకుంటే, ఇబ్బందులు రావు. 
  • అమ్మా, నాన్న కు పాఠశాలలో జరిగే విషయాలు తెలియజేయాలి. 
  • మంచి స్నేహితులతో మాత్రమే కలిసి ఉండాలి. 
  • Birth day పార్టీల లాంటి వాటికి దూరంగా ఉండాలి. 
  • ఏ రోజు పాఠాలు ఆ రోజే పురశ్చరణ చేసుకోవాలి. 
  • మీ ఫోన్ నెంబర్ ఎవరితోను, ముఖ్యంగా కొత్త వారితో పంచుకోకూడదు. 
  • అభ్యంతరకర రీతిలో ప్రవర్తించే వారి గురించి టీచర్లకు, తల్లి తండ్రులకు చెప్పాలి. 
  • Good touch మరియు bad touch గురించి అవగాహన కలిగి ఉండాలి.
ఈ రెండు కార్యక్రమాల తరువాత ఈ రోజును నేను సద్వినియోగం చేసుకొన్నాననే సంతృప్తి కలిగింది. తరువాత నేను కళాశాలకు వచ్చి, మా విద్యార్థులు mid term internal exams రాస్తూ ఉండడంతో, మా మీడియా సెంటర్ కు వెళ్లి Canal System in Sponges మీద ఒక వీడియో చేసి YouTube లో upload చేసాను. 

Saturday, February 15, 2025

                Swachha Andhra - Swarna Andhra Initiative at Govt College (A) Anantapur 

















ఈ రోజు అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో స్వచ్చ ఆంధ్ర మీద ఒక మెగా ఈవెంట్ జరిగింది అని చెప్పవచ్చు. ప్రిన్సిపల్ పద్మ శ్రీ  ఈ కళాశాలలో పనిచేసే పారిశుద్ద సిబ్బంది మరియు విద్యార్థులకు వ్యర్థ పదార్థాల నిర్వహణ గురించి అవగాహన కల్పించారు. NSS coordinators సోమశేఖర్, బాలాజీ నాయక్, జయలక్ష్మీ, సుధాకర్, బృంద  మరియు ఇతర అధ్యాపకులు ఈ కార్యక్రమంలో క్రియాశీలకంగా  పాల్గొన్నారు. మొదటగా కామర్స్ బ్లాక్ ముందు విద్యార్థులు మరియు అధ్యాపకులు కలిసి స్వచ్చ ఆంధ్ర ప్రతిజ్ఞ చేసారు. తరువాత కాంటీన్ వద్ధ పారిశుద్ధ సిబ్బందికి తడి చెత్త, పొడి చెత్త గురించి అవగాహన కల్పించారు. Dust bins కు సంబంధించిన Colour code కు సంబంధించి ప్రిన్సిపల్ మేడం అవగాహన కలగజేశారు. ఏ విధంగా చెత్తను సంపదగా మార్చుకోవచ్చో తెలియజేసారు. Waste to wealth మరియు Trash to treasure concepts గురించి అవగాహన కలగజేశారు. 
మధ్యాహ్నం 2 గంటల నుంచి మూడు గంటల వరకు స్వచ్చ ఆంధ్ర అనే అంశం మరియు వ్యర్థ పదార్థాల నిర్వహణ మీద SASA coordinator విష్ణు ప్రియ ఆధ్వర్యం లో ఒక కార్యశాల ను కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యశాల లో స్వచ్చ ఆంధ్ర సాధించడానికి  ప్రతి నెల చేపట్టవలసిన కార్యక్రమాల గురించి వక్తలు తెలియజేసారు. ఈ కార్యక్రమం లో అధ్యాపకులు అహ్మద్, లక్ష్మీ కాంత్, అరుణ శ్రీ, మాధవీ లత, శైలజ, చిన్న వెంకటమ్మ, బృంద, నాగ జ్యోతి మరియు రుహినాజ్ పాల్గొన్నారు. 
స్వచ్చ ఆంధ్ర కు సంబంధించి ఈ క్రింది slogans ను అధ్యాపకులు సూచించారు. 

  • Your waste - Your responsibility 
  • Planet Earth has suddenly become sick and it urgently needs a cure 
  • From trash to treasure, recycle for pleasure 
  • Don't be rubbish - Bin your trash 
  • Segregation of waste - A step towards Greener future 
  • Reduce, Reuse & Recycle 
  • Stop trashing your Planet 
  • Be a good guest on Earth 

                           Collaborative Work With District Science Center, Anantapur   In collaboration with the District Science Center an...